Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం అనేది కూర్చొని పనిచేయడం కన్నా ఎక్కువ ప్రమాదకరమని వారు అంటున్నారు. ఐదు నుంచి ఆరు గంటలు నిలబడి పని చేయడం వల్ల కాళ్ళకు తిమ్మిరి, ఆయాసం, వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
పని మధ్యలో అరగంట పాటు విరామం తీసుకున్నా, పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా వారు చెబుతున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సుగల వారిని రెండు గ్రూపులుగా విభజించి వారి పనిగంటలు, పని విధానం అధ్యయనం చేశారు. ఎక్కువసేపు కూర్చొని పని చేసేవారిలో కన్నా కూడా ఎక్కువసేపు నిలుచుని పనిచేసే వారిలోనే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
కొన్ని రోజుల తర్వాత ఈ రెండు గ్రూపుల వారికి మధ్యాహ్నం 30 నిమిషాల విరామ సమయాన్ని కేటాయించారు. అయినప్పటికీ నిలుచుని పనిచేసేవారిలో పలురకాలైన ఆరోగ్య సమస్యలు ప్రారంభంకావడం వీరి దృష్టికి వచ్చింది. 50 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపించే ఆరోగ్య సమస్యలను వీరిలో గుర్తించారు. దీనికి కారణం ఎక్కువ గంటలు నిలబడి పని చేయడమేనని నిపుణులు వెల్లడించారు. ఉద్యోగులు నిలుచుని పనిచేస్తున్నా లేదా కూర్చొని పనిచేస్తున్నా, మధ్యమధ్యలో విరామం తీసుకోవాలని వీరు హెచ్చరిస్తున్నారు.