Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాలు పెంచిన కూతుర్ని నీకు అప్పగించారు. తనని ప్రేమగా చూసుకోవల్సిన బాధ్యత నీకుంది. కాని నీకు భార్య కావాలి, ఆమె తల్లిదండ్రులతో సంబంధం వద్దంటున్నావు. వాళ్ళు లేకుండా నీకు నీ భార్య ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. లేనిపోని అపార్థాలతో ఇటు నీ కుటుంబం, అటు సునంద కుటుంబం మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి నీ ఆలోచనల్లో కూడా మార్పు రావాలి.
వారి జంట చూడముచ్చటగా ఉంది. చాలా అమాయకంగా ఉన్నారు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ. కాని పైకి చెప్పుకోలేరు. కారణం పెద్దల పంతాలు. పెద్దల మధ్య గొడవలు పెళ్ళి రోజు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఆ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లోనే పిల్లవాడి తండ్రి ఐద్వాలీగల్సెల్కు వచ్చి సమస్యను ఇలా చెప్పుకొచ్చాడు.
'మేడమ్ ఇతను శేఖర్, నా కొడుకు. ఈ మధ్యనే పెళ్ళి చేశాం. కోడలి పేరు సునంద. చాలా మంచి పిల్ల. మా అందరిలో కలిసిపోయింది. అయితే చాలా బలహీనంగా, సన్నగా ఉంటుంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే రక్తం తక్కువగా ఉందంటే మంచి ఆహారం పెట్టాం. కాని వాళ్ళ పుట్టింటి వాళ్ళు మేమే పిల్లకు ఏదో మందుపెట్టామని ప్రచారం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి నెల రోజులవుతుంది. శేఖర్ తన భార్యకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ 'మా అమ్మాయికి ఎప్పుడు తగ్గితే అప్పుడే వస్తుంది' అంటూ సమాధానం చెబుతుంది. అమ్మాయికి ఏమైనా సమస్య ఉంటే మేమే చూపించుకుంటామని చెబుతున్నా వినడం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాం. మీరే ఎలాగైనా వాళ్ళతో మాట్లాడి మా కోడలు మా ఇంటికి వచ్చేటట్లు చేయండి' అంటూ సుబ్బారావు చెప్పుకొచ్చాడు.
అతను చెప్పిందంతా విన్న బాధ్యులు శేఖర్ ఒక్కడినే కూర్చొబెట్టి అసలు ఏం జరిగిందని అడిగారు. అతను మాట్లాడుతూ 'సునంద మా అందరితో బాగుండేది. పెళ్ళపుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి. అప్పటి నుండి వాళ్ళ అమ్మ మాతో సరిగా మాట్లాడదు. మా అమ్మానాన్నలతో ఎప్పుడూ గొడవలే. అందుకే నేను కూడా వాళ్ళ ఇంటికి పెద్దగా వెళ్ళే వాడిని కాదు. పెళ్ళపుడు వాళ్ళు నాకు బండి పెట్టారు. ఆ బండి సునంద పేరుతోనే ఉంది. రిజిస్ట్రేషన్ చేయించుకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళాను. అప్పుడు సునంద వాళ్ళ పుట్టింట్లో ఉంది. తనను కూడా అక్కడికే రమ్మని చెప్పా. ముందు తను వస్తాననే చెప్పింది. కాని ఎన్ని సార్లు ఫోన్ చేసినా వస్తున్నా వస్తున్నా అనే చెప్పింది. ఎంతకీ రాకపోయే సరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదని కోప్పడ్డా. దాంతో వాళ్ళ అమ్మ 'కొత్తగా పెళ్ళి చేసుకున్న వాడివి పెళ్ళాన్ని ఇంటికి వచ్చి తీసుకుపోవడం చేతకాదా, నీ ముఖానికి పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవడం తెలుసా' అంటూ మాట్లాడింది. జరిగింది మా నాన్నకు ఫోన్ చేసి చెప్పా. మా నాన్న బండి తాళాలు అక్కడే పెట్టేసి, సునందను తీసుకొని వచ్చేయమన్నాడు. నేను బండి నాకు వద్దని చెప్పి, నా భార్యను నాతో పంపమని అడిగా. కాని వాళ్ళు పంపలేదు. మా అమ్మా, నాన్న వచ్చి మాట్లాడితేనే పంపుతామన్నారు. నాకు కోపం వచ్చి వెళ్ళిపోయా. అప్పటి నుండి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరిగా స్పందించడం లేదు. నాకు సునంద కావాలి. వాళ్ళ అమ్మవాళ్ళతో ఎలాంటి సంబంధం వద్దూ' అని శేఖర్ తన మాటలు ముగించాడు.
అంతా విన్న తర్వాత పెద్దల మధ్య ఉన్న గొడవలు పిల్లల మధ్య దూరాన్ని పెంచాయని బాధ్యులకు అర్థమయింది. అందుకే బాధ్యులు శేఖర్తో మాట్లాడుతూ 'చూడు శేఖర్, చిన్న చిన్న అపార్థాలు మీ మధ్య దూరాన్ని పెంపాయి. పెళ్ళయిన కొత్తలో ఎవరికైనా అల్లుడు వాళ్ళ ఇంటికి రావాలి, కూతురితో ప్రేమగా ఉండాలనే ఉంటుంది. కాని పెళ్ళి రోజే మీ పెద్దల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వాళ్ళ పంతాలు మీపై రుద్దుతున్నారు. ఇవేవీ మీరు అర్థం చేసుకునే స్థితిలో లేరు. బండి రిజిస్ట్రేషన్ రోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లి ముందే కూతురిని కోప్పడ్డావు. అప్పటికి మీ పెళ్ళి జరిగి పదిహేను రోజులు. అప్పుడే అలా చేస్తే ఆ తర్వాత కూతురిని ఇంకెలా చూస్తావో అనే భయం ఏ ఆడపిల్ల తల్లికైనా ఉంటుంది. అయినా ఆమె అలా మాట్లాడడం కూడా పొరపాటే. మేం వాళ్లన కూడా పిలిచి మాట్లాడతాం. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాలు పెంచిన కూతుర్ని నీకు అప్పగించారు. తనని ప్రేమగా చూసుకోవల్సిన బాధ్యత నీకుంది. కాని నీకు భార్య కావాలి, ఆమె తల్లిదండ్రులతో సంబంధం వద్దంటున్నావు. వాళ్ళు లేకుండా నీకు నీ భార్య ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. లేనిపోని అపార్థాలతో ఇటు నీ కుటుంబం, అటు సునంద కుటుంబం మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి నీ ఆలోచనల్లో కూడా మార్పు రావాలి. ముందు సునంద తల్లిదండ్రులకు, నువ్వు నీ భార్యను ప్రేమగా చూసుకుంటావనే నమ్మకం కల్పించాలి. అప్పుడే వాళ్ళ కూతురిని నీతో పంపుతారు' అని చెప్పారు.
చెప్పింది అంతా విన్న శేఖర్ 'మేడమ్ మీరు చెప్పినట్లే చేస్తా. నేను కూడా మార్చుకుంటా. ఇకపై వాళ్ళ ఇంటికి వెళతా' అని సమాధానం చెప్పాడు. బాధ్యులు తర్వాత వారం సునందను, అమె తల్లిదండ్రులను రమ్మని లెటర్ పంపారు. తర్వాతి వారం వాళ్ళు వచ్చారు. బాధ్యులు సునందను లోపలికి పిలిచి ఒంటరిగా మాట్లాడారు. బలహీనంగానే కాదు, చాలా అమాయకంగా కనిపిస్తున్న ఆమెతో అసలు మీ మధ్య సమస్య ఏంటని బాధ్యులు అడిగారు. దానికి ఆమె 'సమస్య ఏమీ లేదు. వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటారు. నేను రానని చెప్పలేదు. నాకు హెల్త్ బాగోలేదని అమ్మవాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉండమన్నారు. మా అమ్మవాళ్ళు ఎప్పుడు పంపితే అప్పుడు వెళతాను' అని అమాయకంగా చెప్పింది.
సునంద మాటలకు బాధ్యులు ' నీకు ఇప్పుడు ఇరవైనాలుగేళ్ళు.ఇంత బలహీనంగా ఉంటే ఎలా? ఇది నీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.అందుకే నువ్వు బాగా తినాలి. అలాగే నీకు పెళ్ళయింది. అంటే నీకూ ఓ కుటుంబం ఏర్పడింది. నిర్ణయాలు సొంతగా తీసుకోవల్సిన సమయం వచ్చింది. పెళ్ళి తర్వాత నువ్వు నీ భర్తతో కలిసి ఉండాలి. వాళ్లు కూడా నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నారని చెబుతున్నావు. కాబట్టి వెంటనే మీ అత్తగారింటికి వెళ్ళు. లేకపోతే భవిష్యత్లో ఇంకా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది' అని చెప్పారు. అయితే సునంద మాత్రం వాళ్ళ అమ్మవాళ్ళను ఒప్పిస్తే వెళతానని చెప్పింది.
సునంద తల్లి దండ్రులు లోపలికి రావడం రావడంతోనే 'మేము అమ్మాయిని పంపమని చెప్పలేదు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియడం లేదు. ఏమైనా ఉంటే పెద్దమనుషుల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక్కడికి రావడం ఏంటి' అంటూ మాట్లాడారు. దానికి బాధ్యులు ఇక్కడికి రావడం తప్పేమీ కాదు. మమ్మల్ని కూడా మీ కుటుంబం సభ్యులుగా భావించండి. మీకైనా, మాకైనా కావాల్సింది అబ్బాయి, అమ్మాయి సంతోషంగా ఉండటం. మనందరం కలిసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు చేద్దాం' అన్నారు. బాధ్యుల మాటలకు కాస్త స్థిమిత పడ్డ సునంద తల్లి దండ్రులు మాట్లాడుతూ 'మేము కోరుకున్నేది కూడా అదే, కాని వాళ్ళు పెళ్ళి నాటి నుండి ఏదో ఒక పేచీ పెడుతూనే ఉన్నారు. శేఖర్ అసలు మా ఇంట్లో అడుగు కూడా పెట్టడు. పిల్లను గేటు దగ్గరే వదిలి వెళ్ళిపోతాడు. అతను ఇలా ప్రవర్తిస్తుంటే ఇక మాకు వాళ్ళపై నమ్మకం ఎలా వస్తుంది' అని చెప్పి బాధపడ్డారు.
దీనికి బాధ్యులు 'మీ అల్లుడితో మేం మాట్లాడాం. అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాం. ఇకపై మీ అల్లుడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాని మీరు కూడా కాస్త మార్చుకోవాలి. పెద్దవాళ్ళ పంతాలు, పట్టింపులతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళు సునందను ఇబ్బందులేమీ పెట్టడం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. సునందను వెంటనే శేఖర్తో పంపండి. అక్కడకు వెళ్ళిన తర్వాత ఏదైనా సమస్య వస్తే మా దగ్గరకు రండి. మీరు కూడా చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. అలా చేస్తే ప్రతీదీ సమస్యగా అనిపిస్తుంది' అని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళు సునందను నెల రోజుల తర్వాత పంపుతామన్నారు. కాని బాధ్యులు మాత్రం అన్ని రోజులు వద్దని ఒక వారం ఉంచుకొని పంపమన్నారు. దానికి అందరూ ఒప్పుకున్నారు.
తర్వాత బాధ్యులు శేఖర్ తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతూ 'పెళ్ళి సమయంలో ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు కోడలు కావాలని మీరే మాదగ్గరకు వచ్చారు. కాబట్టి పాత విషయాలన్నీ మర్చిపోండి. కోడలు కావాలి, వాళ్ళ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండొద్దంటే కుదరదు. మీ అబ్బాయినిమీకు దూరం చేయాలని చూస్తే మీకు మాత్రం బాధగా ఉండదా? ఎవరికైనా అంతే. లేనిపోని మొండిపట్టుదలకు పోవద్దు. మీ రెండు కుటుంబాలు కలిసి మెలిసి ఉంటేనే మీ పిల్లలిద్దరూ సంతోషంగా ఉండగలరు. ఇకపై మీ మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా మా దగ్గరకు రండి. మీలో మీరు మాత్రం గొడవలు పెట్టుకోవద్దు' అని చెప్పి అందరితో రిజిస్ట్రర్లో సంతకం చేయించుకొని పంపారు.
-షాయి