Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైద్యులంటే మనిషికి తల్లి తర్వాత మళ్ళీ జన్మనిచ్చేవారు. వైద్య వృత్తి అంటే ప్రజలకు సేవ చేస్తున్నట్లు భావిస్తారు. అందుకే వైద్య వృత్తికి అంతటి ప్రాధాన్యం. వైద్యులన్నా సమాజంలో మంచి గుర్తింపు. శరీరానికి, మనసుకు ఎలాంటి కష్టం వచ్చినా మందులతో, తమ మాటలతో ఉపశమనాన్ని కలిగిస్తారు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తి నేడు వ్యాపారంగా మారిపోయింది. అయితే ఒకప్పుడు ఎంతో మంది వైద్య వృత్తిని ఒక దీక్షగా భావించేవారు. అలాంటి వారిలో కాదంబినీ గంగూలీ ఒకరు. నేడు డాక్టర్స్ డే సందర్భంగా ఆమెను ఒక్కసారి మననం చేసుకుందాం...
బ్రిటిష్కాలంలో మొదటి తరం మహిళా పట్టభద్రురాలే కాక పాశ్చాత్య వైద్య శాస్త్రంలోశిక్షణ పొందిన మొదటి తరం డాక్టర్ శ్రీమతి కాదంబినీ గంగూలీ.1861జులై 18న బీహార్లోని భాగల్పూర్లో జన్మించారు. తండ్రి కిషోర్ బాసు. ఈయన హెడ్ మాస్టర్గా పని చేసేవారు . భాగల్పూర్లో మహిళా విమోచనోద్యమాన్ని నడిపేవారు.
కాదంబినీ ప్రాధమిక విద్య వంగ మహిళా విద్యాలయంలో అభ్యసించారు. తర్వాత బెతూన్ స్కూల్ నుండి కలకత్తా విశ్వ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష రాసిన తొలి మహిళగా కాదంబినీ గుర్తింపు పొందారు . ఆమె ప్రయత్న ఫలితంగానే బెతూన్ కాలేజీలో మొదట ఇంటర్, 1883 డిగ్రీ కోర్సులను ప్రారంభించారు. బెతూన్ కాలేజి నుండి కాదంబినీ, చంద్ర ముఖిబసులు మొదటి సారిగా డిగ్రీ సాధించి రికార్డు నెలకొల్పారు. దీనితో బ్రిటిష్ ప్రభుత్వకాలంలో మొట్ట మొదట డిగ్రీ పొందిన భారతీయ మహిళలుగా చరిత్ర సృష్టించారు .
కాదంబినీ కలకత్తా మెడికల్ కాలేజిలో చేరి మెడిసిన్ పూర్తి చేశారు.1886లో బెంగాల్ మెడికల్ కాలేజి డిగ్రీని పొందారు.ఈ ఘన విజయాన్ని అప్పుడు సాధించిన వారు ఇద్దరే ఇద్దరు మహిళలు. ఒకరు కాదంబినీ , రెండవవారు ఆనంది గోపాల్ జోషి. పాశ్చాత్య వైద్య శాస్త్రం అభ్యసించడానికి ఎంపికైన వీరిద్దరూ దేశానికి గర్వకారణంగా నిలిచారు. 1881లో అబలాబోస్ అనే ఆమె కూడా ప్రవేశ పరీక్ష పాసయినా మెడికల్ కాలేజిలో ప్రవేశం లభించక పోవటం వలన మద్రాస్ వెళ్లి అక్కడ చేరారు. అయినా కూడా మెడిసిన్ పూర్తి చేయలేక పోయారు. మొదట్లో ఉపాధ్యాయుల నుంచి, చాందసభావాల నుంచి కాదంబినీకి ఎన్నో అడ్డంకులేర్పడ్డాయి. అయినప్పటికి ఆమె అచంచల విశ్వాసం, పట్టుదల, దీక్షలతో వాటిని అధిగమించారు. 1882లో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఎడింబర్గ్లో 'ఎల్.ఆర్.సి.ప' ను ,గ్లాస్కోలో 'ఎల్.ఆర్.సి.ఎస్'ను, డబ్లిన్ నుండి 'జి.ఎఫ్.పి.ఎఫ'్ను సాధించారు. లేడి డిబిన్ ఆస్పత్రిలో కొద్దికాలం వైద్య సేవలందించి తర్వాత సొంతగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
సంఘ సంస్కర్త, స్త్రీ విముక్తి ఉద్యమ నాయకుడు బ్రహ్మ సమాజ అనుచరుడైన ద్వారకా గంగూలీని కాదంబినీ 1883లో వివాహమాడారు.తూర్పు భారతంలోని బొగ్గుగని కార్మికుల జీవన పరిస్థితులు మెరుగు పరచటానికి, మహిళా విముక్తి సాధనకు ఈ దంపతులు చిరస్మరణీయమైన సేవలు చేశారు.1889లో భారత జాతీయ కాంగ్రెస్కు హాజరైన ఆరుగురు మహిళల్లో కాదంబిని ఒకరు. కాదంబినీ గంగూలీకి ఎనిమిది మంది పిల్లలు. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేసేవారు కాదు. వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలు అందించిన కాదంబినీ 63ఏళ్ళ వయసులో 1923లో అక్టోబర్ మూడున కన్ను మూశారు.