Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడ్చల్కు చెందిన మేఘన అందరిలాగే చిన్నప్పడు తల్లి రమాదేవి చెప్పిన నీతి కథలు వినేది. అప్పటికప్పుడు వాటితో ఆనందించి అందరిలా ఉల్లాసపడేది. ఆ కథలు తనే కాదు, తనతో పాటు సమాజంలో అందరూ ఎదగాలని నేర్పించాయి. 14 ఏళ్ల వయసులో ఐటీ హబ్స్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూకు వెళ్లి, ఈ సొసైటీకి తానేం చేయదలచుకున్నదో స్పష్టంగా చెప్పింది. ఆమె వయసు చిన్నదే. కానీ సంకల్పం గొప్పది. అందుకే ఆ సంస్థ నిర్వాహకులు ఆమెకు సపోర్ట్గా నిలిచారు.
మేడ్చల్ మండలం కండ్లకోయ అనుబంధ గ్రామమైన సుతారిగూడ శివారులో రింగురోడ్డుకు ఆనుకుని, ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నది మేఘన. అందులోనే తన కలల ప్రపంచానికి పునాది వేసుకున్నది. 'మేక్ ది వరల్డ్ వండర్ఫుల్ 'పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. ఐటీ హబ్స్ సంస్థ సహకారంతో, స్నేహితులు సౌమ్య, ప్రణీత, ఖ్యాతిలతో కలిసి ఒక టీమ్ను ఏర్పాటు చేసింది. ఓ పక్క చదువుతూనే, 50 మంది నిరుపేద విద్యార్థులను అక్కున చేర్చుకుని, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. ఈ 50 మంది గిరిజన పిల్లలు. కొంతమందికి అమ్మానాన్నలు లేరు. మరికొందరు తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్నవారు. కేవలం మార్కులు సాధించిపెట్టే చదువులు కాదు. సమాజంలో విలువలతో బతుకడం ఎలాగో.. పిల్లలకు నేర్పిస్తున్నారిక్కడ. తాను ఉన్నతంగా ఎదుగడమే కాదు, ఇతరుల శ్రేయస్సును కోరుకునే తత్వాన్ని అలవర్చుకునేలా బోధనలు చేస్తున్నారు. మామూలు విద్యకు భిన్నంగా నేర్పిస్తారిక్కడ. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ పాఠ్యప్రణాళికని స్థూలంగా అనుసరిస్తూ కమ్యూనికేషన్ నైపుణ్యాలూ, విభిన్న రీతిలో సైన్స్ పాఠాలు బోధిస్తున్నారు . నెలకోసారి ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు! ఆరు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు వీళ్లు. అదే వయసులో ఓ పబ్లిక్ స్కూలు చదువుతున్న పిల్లలకి దీటుగా ఉంటుందీ వీరిలోని నైపుణ్యం.. ఆత్మవిశ్వాసం! అంతేకాదు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల పోటీల్లో రాణించేవారిలో ముందు వరుసలో ఉంటున్నారు. ఏడాదికి ఒక్కో విద్యార్థిపై సుమారు 40 వేల రూపాయలు ఖర్చుపెట్టి దీన్ని నడుపుతున్నారు.
టీమ్లో సభ్యులంతా దూరవిద్యను అభ్యసిస్తూనే సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశవిదేశాల్లో సెమినార్లు నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా ఆరుగురు టీచింగ్ ఫ్యాకల్టీ, మరికొందరు వలంటీర్లు సహాయకులుగా ఇక్కడ సేవలందిస్తున్నారు.
సమాజ శ్రేయస్సు కోసం 2023 లోపు ఇలాంటి కేంద్రాలను 2500 వరకు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని టీమ్ స్పిరిట్తో ముందుకు సాగుతున్నారు.