Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాదేవీ వర్మ
(26.03.1907-11.09.1987)
మహిళలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్యూడల్ చట్రంలో చిక్కుకుని ఉండే రోజులు. స్వతంత్రంగా వ్యవహరించడానికే వీలు లేని ఆ దశలో స్వతంత్ర ఆలోచనలకు తావు ఉంటుందని ఊహించనైనా లేం. అలాంటి కాలంలో కలం చేతబట్టారు ప్రసిద్ధ హిందీ రచయిత్రి మహాదేవీ వర్మ. గద్య, పద్య రచనలో విశేషమైన కృషి చేసి ఆధునిక మీరాగా పేరు సంపాదించుకున్నారు.
మహాదేవీ వర్మ ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్లో 1907లో న్యాయవాదుల కుటుంబంలో జన్మించారు. తల్లి శ్రీమతి హేమరాణీదేవి. తండ్రి శ్రీ గోవింద ప్రసాద్ వర్మ. తన 11 వ ఏటనే ఈమె డా.స్వరూప్ నారాయణ వర్మతో వివాహం అయ్యింది. ఆయన విద్యాభ్యాసం చేస్తున్నందువల్ల వైద్య విద్య పూర్తి చేసే దాకా మాహాదేవి వర్మ పుట్టింట్లోనే ఉండి పోయారు. పెళ్లి అయినా ఆమె విద్యాభ్యాసం కొనసాగించారు.
బాల్యంనుంచే రచన...
తల్లి పూజ చేసుకునేటప్పుడు విన్న శ్లోకాలు, తులసీదాస్, మీరాబాయి కీర్తనలు ఆమెకు కవిత్వం రాయడానికి ప్రేరణ ఇచ్చాయి. అందుకే ఆమె చిన్ననాటే కలం పట్టారు. కళాశాలలో చేరే నాటికే ఆమె రచనలు ప్రచురితమైనాయి. అయితే ఆమెకు పూజలు, అర్చనల వంటి బాహ్య ప్రదర్శనలపై ఎక్కువ ఆసక్తి లేదు. ప్రయాగలోని క్రస్టవేట్ గరల్స్ కాలేజీలో బి.ఎ. ఫిలాసఫీతోనూ, సంస్కృంలో యమ్.ఎ. చదివి, అక్కడే మహిళా విద్యాపీఠంలో కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమితురాలయినారు.
వచనం సైతం కవిత్వంలా...
ఆమె 30 కవితా సంకలనాలు, కనీసం పది గద్యరచనలతో పాటు, వ్యాస సంకలనాలు వెలువరించారు. కాని ఆమె ప్రధానంగా గుర్తింపు పొందింది కవయిత్రిగానే. ఒక దశలో వేదాలనుంచి, ఉపనిషత్తులనుంచి అనువాదాలు కూడా చేశారు. ఆమె వచనం సైతం కవిత్వంలా పరుగెడుతుంది. ఆమె రచనల్లో నీహార్ , రశ్మి , నీరజా , సాంధ్యాగీత్ మరియు దీపశిఖ, ముఖ్యమైనవి.మహాదేవి వర్మ స్త్రీ విముక్తికోసం తన రచనలను వినియోగించారు.
సంఘ సంస్కర్తగా....
మహిళాభ్యున్నతితో పాటు సంఘ సంస్కరణకు కూడా ఆమె పాటుబడ్డారు. మహిళలకోసం ప్రత్యేక మహిళా విద్యాపీఠ్ స్థాపించి, నిర్వహించారు. మొదట ఆ పాఠశాలకు ప్రధానాచార్యులుగా ఉన్న మాహాదేవి వర్మ ఆ తర్వాత దానికి కులపతి అయిపోయారు. కుటుంబ బాధ్యతల కారణంగా చదువు కొనసాగించలేని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ విద్యా సంస్థలో చదువుకునే వారు. కొంత మంది దూర విద్యాభ్యాసం కూడా కొనసాగించారు. ఆమెకు రచనలతోనే కాక చిత్రలేఖనంలో కూడా మంచి అభినివేశం ఉంది. జంతువులంటే ఆమెకు విపరీతమైన అభిమానం. పశు పక్ష్యాదుల మీద రాసిన రచనలకు ఆమే చిత్రాలు గీసే వారు.
సేవకు గుర్తింపుగా...
సాహిత్య, సామాజిక, విద్యా రంగాలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా స్వాతంత్య్రం తర్వాత 1952లో ఆమెను ఉత్తరప్రదేెశ్ శాసన మండలి సభ్యురాలిగా నామినేట్ చేశారు. సాహిత్యరంగంలో ఆమె చేసిన సేవకు అనేక బహుమానాలు వచ్చాయి. యమ కావ్యానికి 1982లో జ్ఞానపీఠ్, 1981లో సాహిత్య అకాడమీ ఫెలో, 1956లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ మహాదేవి వర్మకు డి.లిట్ ప్రదానం చేసింది. ఆమె నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో నిమగమై ఉండే వారు. 1930లోనే అఖిల భారత మహిళా కవయిత్రుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. సాహిత్యకార్ సన్సద్ ఏర్పాటు చేయడం కోసం అలహాబాద్ లో ఓ భవనం కొన్నారు. 1950లో అఖిలభారత రచయితల మహాసభ ఏర్పాటు చేశారు. తన రచనలకు లభించిన పారితోషికాన్ని రచయితల, కవుల శ్రేయస్సుకోసం ఖర్చు చేసేవారు. 1987 సెప్టెంబరు 11 వ తేదీన ఈ కరుణామూర్తి కన్ను మూశారు. ప