Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరగతి గదుల్లో పుస్తకాలలోని పాఠాలు బోధిస్తే.. ఎన్సిసి క్యాంపులలో నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొన్నే ధైర్యాన్నిస్తారు. విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దుతారు. గత 22ఏండ్లుగా లక్ష మంది విద్యార్థులకు ఎన్సిసి ట్రైనింగ్ ఇచ్చారు సరోజ్ బాలా ఠాకూర్. ఎన్నో పోటీల్లో తమ విద్యార్థులు విజేతలుగా నిలుస్తుంటే గర్వపడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్గా ఉండే తన టీమ్ను చూసి గర్వపడుతున్నారు. మేటి శిక్షణ బోధకురాలిగా బంగారు పతకాన్ని సాధించారు. పోటీ ప్రపంచంలో ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్సిసి ఎంతో ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు. ఆమె మానవితో పంచుకున్న ముచ్చట్లు..
తాత సత్యనారాయణ సింగ్ ఠాకూర్ భాగ్యనగర్ ఖాదీ బోర్డులో పనిచేసేవారు. నాన్న ప్రకాష్ సింగ్ ఠాకూర్ ఖాదీలోనే ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. అమ్మ నర్మదాబాయి. మేం ఐదుగురం పిల్లలం. అన్న, ముగ్గురు అక్కల తర్వాత నేను. నాన్న నల్లగొండ జిల్లా ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ.. జిల్లా వ్యాప్తంగా 36 అంబర్ చరఖా కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎంతో మందికి ఉపాధి కల్పించారు. చిన్నతనంలో కొద్దిరోజులు నల్లగొండలో ఉన్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్కు వచ్చాం.
సెయింట్ మారియా స్కూలులో పదవ తరగతి వరకు, ఇంటర్ అగర్వాల్ కాలేజీలో పూర్తి చేశాను. ఖాదీ బోర్డులో తక్కువ జీతాలు ఉండేవి. ఐదురుగు పిల్లలను చదివించడం కష్టంగా ఉండేది. ఏడవ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పి.. నా పుస్తకాలు, ఫీజులకు కావల్సిన డబ్బులు నేనే సమకూర్చుకునేదాన్ని. వనితా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో ఎన్సిసిలో చేరాను. ఆ మూడేండ్ల కాలంలో 15 క్యాంపులకు వెళ్లాను. జాతీయ స్థాయిలో అండమాన్, ఢిల్లీ నగరాలలో నిర్వహించిన క్యాంపులకు హజరయ్యాను. సి సర్టిఫికేట్ హౌల్డర్ అయ్యాను. డిగ్రీ తర్వాత దూరవిద్య ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ తెలుగు, బి.ఎడ్, గ్వాలియర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్సీ(ఇకాలజీ, ఎన్విరాన్మెంట్) పూర్తిచేశాను. మూడు సంవత్సరాలు సైన్సు టీచర్గా ప్రైవేటు స్కూల్లో పనిచేశాను. ఈ సమయంలోనే రమణానాథ్ తోడెతో పెండ్లి అయ్యింది. మాకు ఇద్దరు అమ్మాయిలు అదితినాగ్ తోడె, అభనాగ్ తోడె.
గర్ల్ కెేడెట్ ఇన్స్ట్రక్టర్గా..
పి.జీ పూర్తి చేసిన తర్వాత గర్ల్ కేడెట్ ఇన్స్ట్రక్టర్ జాబ్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా 235 పోస్టులు ఉన్నాయి. అమ్మనాన్న ప్రోత్సాహంతో ఈ పోస్టుకు దరఖాస్తు చేశాను. 'సి' సర్టిఫికేట్ హౌల్డర్ను కావడంతో నాకు ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభించింది. రాతపరీక్షలో ఆల్ ఇండియా టాపర్స్లో నేను ఒకదాన్ని. ఫిట్నెస్, రిటెన్ టెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ వన్ బెటాలియన్ గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఈ నెల 7వ తేదీకి సరిగ్గా 22 ఏండ్లు అయ్యింది.
లక్షలాది మందికి ట్రైనింగ్..
టీచర్ 40 నిమిషాలు క్లాసులో ఉంటారు. అదే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ అంటే పిల్లలతో పాటు క్యాంపులకు వెళ్లాలి. విద్యార్థులను 24 గంటలు గమనిస్తూ.. వారికి క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యత ఇలా చాలా విషయాలను చెప్పాలి. జాబ్లో చేరిన మొదట్లో పదిపదిహేను రోజులు క్యాంపులకు వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అర్థం అయ్యేకొద్ది ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. గత 22 సంవత్సరాలుగా ఇప్పటి వరకు లక్షమందికి పైగా విద్యార్థులకు ఎన్సిసి ట్రైనింగ్ ఇచ్చాను. మా బెటాలియన్ పరిధిలో తొమ్మిది కాలేజీలు, 17 స్కూల్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరిగే పోటీలలో మా బెటాలియన్ విద్యార్థులే ఎక్కువగా విజేతలుగా ఉంటున్నారు. దేశంలో ఉన్న 774 యూనిట్లలో మా యూనిటే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనిట్.
అంతర్జాతీయ క్యాంపులకు..
ప్రతి ఏడాది యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ అంతర్జాతీయ స్థాయిలో 11దేశాలలో జరుగుతుంది. ఇందులో మన దేశం నుంచి పాల్గొనే బృందంలో ప్రతిసారి మా బెటాలియన్ విద్యార్థులు ఒకరైనా తప్పనిసరిగా ఉంటారు. 2012లో రికార్డు స్థాయిలో ఐదురుగు విద్యార్థులు మా బెటాలియన్ నుంచి ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం బ్రహద షాన్బాగ్ రష్యాలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రతినిధిగా హజరయ్యారు.
జాతీయ సమగ్రతలో..
జాతీయ స్థాయిలో జరిగే రైఫిల్ షూటింగ్, మౌంటనేరింగ్ వంటి అనేక పోటీల్లో మా విద్యార్థులే ఎప్పుడు ఛాంపియన్గా ఉంటారు. మా బెటాలియన్ను ఛాంపియన్ బెటాలియన్ అని పిలవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. నేషనల్ ఇంటిగ్రేషన్ అవేెర్నెస్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ప్రతిసారి ఒక కొత్త థీమ్తో మేం పాల్గొంటాం. ఓటు హక్కు, ట్రాఫిక్, విద్యాహక్కు చట్టం ఇలా అనేక అంశాలపై ప్రోగ్రామ్స్ చేశాం. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని చాటేలా అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రదర్శిస్తాం. రిపబ్లిక్ డే పరేడ్లో వరుసగా రెండుసార్లు 2008, 2009లో ప్రైమ్ మినిస్టర్ బ్యానర్ మా గ్రూప్ విద్యార్థులు గెలుచుకున్నారు. అన్నీ పోటీల్లో మా టీమ్ ముందువరుసలో ఉంటుంది.
ఎందరో విద్యార్థులు త్రిదళాలలో..
ఎన్సిసిలో చేరడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుంది. 22ఏండ్ల నా సర్వీస్లో లక్ష మందికి పైగా విద్యర్థులకు శిక్షణ ఇచ్చాను. వారిలో చాలామంది ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లలో చేరారు. ఎన్సిసి ఆఫీసర్స్గా తమ కెరీర్ను మలుచుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనూ రాణిస్తున్నారు.
ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది..
ఎన్సిసి అంటే కేవలం మార్చ్, డ్రిల్ మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ, ఎన్సిసిలో చేరిన విద్యార్థులకు మిగతా విద్యార్థులకు చాలా తేడా ఉంటుంది. ఎన్సిసిలో ఉన్నవారు చదువుతో పాటు ఎలాంటి కష్టసమయంలోనైనా నిబ్బరంగా ఉండే మానసిక పరిపక్వత వస్తుంది. విద్యార్థి దశలోనే వారికి క్యాంపులకు తీసుకువెళతాం. అక్కడ 24గంటలు వారు ఇన్స్ట్రక్టర్ పర్యవేక్షణలో ఉంటారు. ఈ సమయంలో వారి ప్రవర్తన, మనస్తత్వం తెలుసుకుని.. వారిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. ఎన్సిసితో చేరిన వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ఆత్మస్ధైర్యంతో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో అవసరం. ఇప్పుడు ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అన్ని స్కూల్లలో సిబిఎస్సి కరిక్యులంలో ఒక సబ్జెక్ట్గా చేసే ఆలోచనలో ఉంది.
కళలను చేరువ చేసేలా..
లలిత కళలు అంటే డబ్బులు ఉన్నవారు నేర్చుకునేవిగా మారాయి. పేద, మధ్యతరగతివారికి నేర్చుకోవాలని ఉన్నా సరైన ప్రోత్సాహం లేదు. ఎంతో కష్టపడి మా అమ్మాయిలిద్దరికీ కూచిపూడి నాట్యం నేర్పించాను. ఇప్పుడు వాళ్లు మా ఇంటి చుట్టుపక్కల ఉండే వారికి నేర్పిస్తున్నారు. 2014లో ఆర్యన్ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసి పేద పిల్లలకు పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్, వ్యక్తిత్వవికాస కోర్సులు అందిస్తున్నాం. అంతేకాదు కళల ప్రాధాన్యతను తెలియజేసేలా షార్ట్ ఫిల్మ్ 'ఓ అపర కళ' రూపొందించాం. ఈ ఫిల్మ్ను మా చిన్నమ్మాయి అభనాగ్ తోడె డైరెక్టర్ చేసింది. చైల్డ్ డైరెక్టర్ కేటగిరిలో ఈ షార్ట్ఫిల్మ్ 19వ అంతర్జాతీయ పిల్లల చలనచిత్రోత్సవంలో జ్యూరీ అవార్డు అందుకుంది.
నేర్చుకోవడంలో ఆనందం...
ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏడాది చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నాను. ఈ సయమంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేదు అనేక షార్ట్టైమ్ కోర్సులు చేశారు. హౌమియోపతి, నేచరోపతి, గార్డెనింగ్, పెయింటింగ్ కోర్సులు పూర్తి చేశాను. మన ఆలోచనలు నూతనంగా ఉండాలంటే ఎప్పుడు నిత్య విద్యార్థిగా మారాలి అన్నది నా అభిప్రాయం.
- వి. యశోద