Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోలెపాళ్యం మంగమ్మ
(12 సెప్టెంబర్ 1925 - 1 ఫిబ్రవరి 2017)
మారుమూల గ్రామంలో పుట్టి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు జోలెపాళ్యం మంగమ్మ. ఆలిండియా రేడియోలో తొలి మహిళా న్యూస్రీడర్గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యంతో పాటు బోధన రంగంలో విశేషానుభవం ఉంది. సరోజినీ నాయుడు స్నేహితురాలైన మంగమ్మ ఆంధ్రానైటింగేల్ అనే బిరుదు అందుకున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు మంగమ్మ. ఆమె తల్లిదండ్రులు జే.లక్ష్మమ్మ, సుబ్బయ్య. ఎం.ఎ., బి.ఎడ్ పూర్తి చేసిన మంగమ్మ తొలితరం విద్యావంతురాలు. వీధిబడి చదువులతో మొదలై.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకునేవరకు ఆమె తన చదువు కొనసాగించారు. ఆలిండియా రేడియో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్గా తమ పేరు నమోదు చేసుకున్నారు. న్యూఢిల్లీలో పదేండ్లు ఎడిటర్గా, న్యూస్ రీడర్గా పనిచేశారు. చిన్నతనం నుంచే చురుకునైన అమ్మాయిగా పేరుతెచ్చుకున్న ఆమె తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత 35 ఏళ్లపాటు ప్రయోగాత్మక విద్యాకేంద్రం, టీచర్ ట్రైనింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు.
1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనా రంగంలో విశేషకృషి చేశారు. మంగమ్మ కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో లైఫ్టైమ్ మెంబర్గా ఉన్నారు. అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ఆమె అనిబీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఉపాధ్యక్షు రాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలిగా, లోక్అదాలత్లో సభ్యురాలిగా, వివిధ సంస్థల్లో కీలక హౌదాల్లో సేవలను అందించారు.
బహుభాషల్లో ప్రావీణ్యం గల మంగమ్మ ఆంగ్ల, తెలుగు భాషల్లో మూడువందలకు పైగా వ్యాసాలు రాసారు. అనేక పుస్తకాలను ప్రచురించారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో మదనపల్లె రచయితల సంఘం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఆమె రాసిన పుస్తకాలలో తెలుగులో 'ఇండియన్ పార్లమెంట్', 'శ్రీ అరబిందో', 'విప్లవ వీరుడు అల్లూరిసీతారామరాజు', 'అనిబీసెంట్' తదితర పుస్తకాలు ఎంతో పేరు తెచ్చాయి. ఇంగ్లీష్లో ఆమె రాసిన' ప్రింటింగ్ ఇండియా', 'అల్లూరి సీతారామరాజు', 'లాస్ట్ పాలెగార్ ఎన్కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1846-1847', 'ది రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి' తదితర పుస్తకాలు ఆమెకు గుర్తింపు తీసుకు వచ్చాయి.
సాహిత్యరంగంలో ఆమె సేవలకు గాను 2002లో న్యూఢిల్లీ 'తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం', కుప్పం' రెడ్డెమ్మ సాహితీ అవారు' ్డ, విజయవాడ 'సిద్ధార్థ కళాపీఠం విశిష్ట అవార్డు'లు మంగమ్మని వరించాయి.
92 ఏండ్ల వయసులో మదనపల్లెలోని తన ఇంటిలో 1ఫిబ్రవరి 2017న ఆమె మరణించారు.