Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమించాలంటూ వేధింపులు. ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు. ఇలా ఎందరో అమ్మాయిలు ఉన్మాదులు బారిన పడుతున్నారు. దాడి జరిగితే ఇక జీవితం ముగిసిపోయినట్టు అనుకుంటున్నారు. తాము కన్న కలలన్నీ కల్లలైపోయాయని కుంగిపోతున్నారు. అయితే తమకంటూ ఉన్న మరో కొత్త జీవితాన్ని తమకు తాముగా ఆవిష్కరించుకుంటున్నారు కొందరు. ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ దాడులను ఖండిస్తూ కొన్ని సంస్థలను స్థాపించి తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మరికొందరు. అలాంటి వారి జీవిత గాథలు కొన్ని...
లక్ష్మీ 15 ఏండ్ల వయసులో యాసిడ్ దాడికి గురయ్యింది. ఆమెను ప్రేమించిన వ్యక్తి, అతని స్నేహితుడితో కలిసి ఈ దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె ముఖంతోపాటు శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా కాలిపోయాయి. ముఖం భయంకరంగా తయారయింది. కోలుకున్న తర్వాత తనపై దాడిచేసిన వారికి శిక్ష పడాలని చాలా ప్రయత్నించింది. తనకు నష్టపరిహారంతో పాటు, ఇలాంటి దాడులకు కఠిన శిక్షలు ఉండాలని, అవసరమైతే దీనికోసం కొత్త చట్టాన్ని రూపొందించాలని పోరాటం చేసింది. ఇప్పుడు ఆమె 'స్టాప్ యాసిడ్ అటాక్' అనే సంస్థను స్థాపించి దాని ప్రచార కర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. యాసిడ్ దాడులకు నిరసనగా తన స్వరాన్ని ఈ ప్రపంచానికి వినిపిస్తోంది.
సమస్యను అంతం చేయాలని
మౌనికా సింగ్ది మరో విషాధ గాధ.ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. 2005లో ఆమెకు పందొమ్మిదేండ్లు. పెండ్లికి నిరాకరించిందని ఇంటిపక్కన ఉండే వ్యక్తి ఆమెపై యాసిడ్ పోశాడు. చికిత్స తీసుకున్న తర్వాత తను జీవితంలో ఎవరి సానుభూతినీ కోరకుండా తనకు నచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్ నే కెరీర్గా ఎంచుకుంది. అయితే ప్రపంచంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యను అంతం చేయాలనే దృఢసంకల్పంతో 'మహేంద్రసింగ్' అనే ఫౌండేషన్ స్థాపించి కార్యక్రమాలు చేస్తోంది.
చనిపోవాలనుకుని...
17 ఏండ్ల వయసులో రేషమ్ ఖురీషీపై బావ వరస అయ్యే వ్యక్తి యాసిడ్ దాడి చేసి పారిపోయాడు. అయితే అతను యాసిడ్ పోయాలనుకుంది రేషమ్ అక్కపై. దాడి తర్వాత రేషమ్ తన ముఖాన్ని తానే చూసుకోలేకపోయింది. ఆ బాధ భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. చివరకు ధైర్యం తెచ్చుకుని 'మేక్ లవ్ నాట్ స్కార్స్' (మచ్చలు చేయడం కాదు ప్రేమించండి) అనే సంస్థలో చేరింది. ఇప్పుడు ఆమె ఓ మోడల్గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఆన్లైన్లో బ్యూటీ ట్యూటోరియల్ కూడా మొదలుపెట్టింది.
కుంగిపోయినా...
18 ఏండ్ల అర్చనను ఇంటిపక్క వ్యక్తి పెండ్లి చేసుకోమని రోజూ వేధించేవాడు. అయితే అర్చన అతని మాటలు పట్టించుకునేది కాదు. దాంతో ఆ వ్యక్తి కొన్ని రోజులకు 'నన్ను ప్రేమించపోతే మీ నాన్నను చంపేస్తా' అని బెదిరింపులు మొదలుపెట్టాడు. అయినా అర్చన స్పందించకపోవడంతో ఓ రోజు ఆ వ్యక్తి అర్చన ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు. ఆస్పత్రిలో చేరిన ఆరుగంటల తర్వాత ఆర్చనకు స్పృహ వచ్చింది.అప్పటికే ఆమె ముఖం పూర్తిగా కాలిపోయింది. అనుకోని ఈ ఘటనకు ముందు కుంగిపోయినా తర్వాత మెల్లగా కోలుకుంది. ధైర్యం తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె కూడా 'మేక్ లవ్ నాట్ స్కార్స్' క్యాంపెయిన్లో పనిచేస్తున్నది. తన చదువును కొనసాగించింది. కంప్యూటర్లో ట్రైనింగ్ తీసుకుంది. ప్రస్తుతం ఓ మంచి ఉద్యోగం చేస్తోంది.
హింస భరించలేక...
యాసిడ్ దాడికి గురైన వారిలో మమత కూడా ఉంది. ఆమె కూడా 'మేక్ లవ్... నాట్ స్కార్స్' క్యాంపెయిన్లో చురుగ్గా పని చేస్తున్నది. యాసిడ్ దాడికి గురైన మమతకు ఓ బిడ్డ కూడా ఉంది. దాడికి గురైనా ఆమెను భర్త నానా రకాలుగా హింసించేవాడు. అతను పెట్టే హింసను మమత భరించలేకపోయింది. చివరకు బిడ్డను తీసుకుని ఇంటి నుంచి బటయకు వచ్చి బ్యూటీషియన్ కోర్స్ చేసింది. ఇప్పుడు ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్గా పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లలో ఉద్యోగం చేస్తున్నది.
కంటి చూపు కోల్పోయినా...
హసీనా హుస్సేన్ 1999లో ఓ ఆఫీస్లో ఉద్యోగంలో చేరింది. తన బాస్ ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. అతను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక భరించలేక ఆమె వేరే ఉద్యోగంలో చేరింది. దాంతో అతను హసీనాపై యాసిడ్ దాడి చేశాడు. అయితే మొదట ఆమె ఆస్పత్రిలో చికిత్స చేయించుకోడానికి కూడా నిరాకరించింది. చివరకు మూడు రోజుల తర్వాత వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది. కంటి చూపు కూడా కోల్పోయింది. అయినా హసీనా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలని, తన కాళ్ళపై తాను నిలబడాలని నిర్ణయించుంది. తనకు తెలిసిన కంప్యూటర్ విద్యలోనే మరింత నైపుణ్యం పెంచుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలబడింది. ఎవరి సాయం లేకుండా తన పని తాను చేసుకుంటున్నది.
ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విషాధ గాధ. వీరు అనుభవించిన బాధ వర్ణనాతీతం. ఆ క్షణం వారు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేనిది. ఉన్మాదుల పైచాచికత్వానికి బలై బతికున్న శవాలయ్యారు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే. మళ్ళీ తామేంటో నిరూపించుకుంటున్నారు. తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ముఖంపై మచ్చలు పడినంత మాత్రాన తమ జీవితమే అంధకారమైనట్టుగా భావించలేదు. ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. ఎవరికి తోచినట్టు వారు తమ గళాలను వినిపిస్తున్నారు. తమలా మరే అమ్మాయి బలికాకూడదని బలంగా కోరుకుంటున్నారు. 'మచ్చలు చేయడం కాదు ప్రేమను పంచండీ' అంటూ తమ స్వరాలను ఈ ప్రపంచానికి వినిపిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.
చట్టం వచ్చినా రక్షణ ఏది?
2013కు ముందు మన చట్టంలో యాసిడ్ దాడులను ప్రత్యేక నేరంగా గుర్తించలేదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాతనే యాసిడ్ దాడులను చట్టం సీరియస్గా తీసుకుంది. అయితే మన భారత దేశంలో 2012లో 106, 2013లో 116, 2014లో 225 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. బయటకు రానివి మరెన్ని ఉన్నాయో. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఈ దాడుల ఏడాదికేడాదికి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం 2015లో 249 కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగేండ్లతో పోల్చితే 2015లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ లెక్కల ప్రకారం చట్టాలు అమ్మాయిలకు ఏ మాత్రం రక్షణగా నిలుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
- సలీమ