Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్మత్ చుగ్తారు.. భారత చరిత్రలో ప్రముఖ స్త్రీవాది. మరోలా చెప్పాలంటే స్త్రీవాదానికి భారతదేశంలో భాష్యం చెప్పిందామె అని చెప్పినా అతిశయోక్తి కాదమో. ప్రపంచ ఉర్దూ సాహిత్యంలో ఆమె పేరు తెలియనివారు వుండరు. భారత ఉపఖండంలో మహిళా రచయితలకు పునాదిని వేయడమే కాదు.. దిశానిర్దేశం చేసిన రచయిత్రి ఆమె. అమె కలం నుంచి జాలువారిన ప్రతీ అక్షరం ఆయుధమై పురుషాధిక్య సమాజం వైపు దూసుకెళ్లింది.
ఉర్దూ సాహిత్యంలో శిఖరాయమానమైన ఇస్మత్ చుగ్తారు 1915 ఆగస్ట్లో ముస్లిం కుటుంబంలో జన్మించారు. అనుకున్నది నిర్భయంగా చెప్పడం, ఏదైనా సాధించడం, దాని కోసం పోరాడటం ఈమెలో చిన్నతనం నుంచే ఉన్న లక్షణాలు. ఈమెకు పర్షియన్ నేర్పించాలని ఇంట్లో చాలా ప్రయత్నం జరిగింది. కానీ ఇది ఇష్టం లేక తండ్రి మీద కూడా తిరుగుబాటు చేశారు. బహుశా ఇదే అమె జీవితంలో అమె చేసిన తొలి తిరుగుబాటు అయి ఉంటుంది.
చదువుకోసం పోరాటం
చుగ్తారుకి వంటపని ఇంటి పని చేయడమంటే ఇష్టం ఉండేది కాదు. మహిళలు వంటింటికే పరిమితం కావడం ఎంతమాత్రం సరికాదని ఏడెనిమిది దశాబ్దాల కిందటే గట్టిగా వాదించారామె. అమెకు పుస్తకాలంటే ప్రాణం. కూతరురి ప్రవర్తన చూసిన తల్లికి కడుపు మండిపోయేది. అలీగడ్ మిషనరీ స్కూల్లో చేర్చించమని పెద్ద అల్లరి చేశారు. చదువు కొనసాగించకుంటే ఇంట్లోంచి పారిపోతానని బెదిరించి మరీ స్కూల్లో చేరారామె. పదిమంది సంతానంలో చుగ్తారు మాత్రమే ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రదర్శించేది. అమెకు తల్లి మద్దతు లేకున్నా తండ్రి, ఒక సోదరుడి సహకారం లభించింది.
మతాచారాలకు దూరంగా...
దేశంలో బీటీ పట్టా తీసుకున్న తొలి మహిళ చుగ్తారు. ఆగ్రాలో చదువుకుంటున్నప్పుడే అక్కడ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న షాహిద్ లతీఫ్తో పరిచయమైంది. అది ప్రేమగా మారి, వివాహం చేసుకున్నారు. ఇస్మత్ ముస్లిం మతచారాలకు చాలా దూరంగా వుండేవారు. ముస్లిం మతాచారాలను నూటికి నూరు శాతం పాటించే అగ్రా లాంటి ప్రాంతానికి వెళ్లినా బురఖా మాత్రం ధరించలేదు. ఇలా అమెలో ఎన్నో అభ్యుదయ భావాలు వుండేవి. అవే అమె కలం నుంచి జాలువారి రచయిత్రిని చేశాయి.
పోరాడి గెలిచారు
తొలినాళ్లలో ఇస్మత్ చాలా రహస్యంగా తన రచనలను రాశారు. ఖురాన్తోపాటు భగవద్గీత, బైబిల్ను కూడా అద్యయనం చేశారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన, వివాదాస్పదమన రచన లిహాఫ్. ఇందులో హౌమో సెక్సువాలిటీ గురించి చర్చించినందుకుగాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. కోర్టు మెట్లెక్కి, క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితిని కల్పించారు. కానీ ఆమె క్షమాపణలు చెప్పలేదు సరికదా... పోరాడారు. చివరకు ఆమే గెలిచారు.
స్ఫూర్తిగా నిలిచారు
ఇస్మత్ చుంగ్తారు చాలా దూరదృష్టి ఉన్న వ్యక్తి. తనకాలంకంటే ఎంతో ముందున్నారు. తన జీవిత కాలం మొత్తంలో ఎక్కడా వెనుకడుగువేయలేదు. నిర్మొహమాటంగా తన భావాలను వ్యక్తీకరించారు. నమ్మిన వాటికోసం నిలబడిన స్వతంత్ర వ్యక్తిత్వం ఆమెది. ఆమె, ఆమె రచనలు ఇచ్చిన స్ఫూర్తి ఇతర స్త్రీవాద రచయితలు అందిపుచ్చుకున్నారు. ఆమె లేవనెత్తిన ఎన్నో అంశాలపై రచనలు చేశారు.
లక్నో సమావేశం
అయితే ఆమె రచనకు ఒక దృక్పథం ఏర్పడడానికి కారణం 1936లో జరిగిన లక్నో అభ్యుదయ రచయితల సమావేశం. ఉర్దూ మహా రచయిత మున్షీ ప్రేమ్చంద్ రోజులను లెక్కిస్తూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశమే భారతీయ సాహిత్యానికి కొత్త దిశను చూపించింది. ఎన్నో నవలలు, కథలు, రేడియో నాటికలు రాశారామె. 'జిద్ది', 'తేడీ లకీర్', 'ఏక్బాత్', 'మాసూమా', 'దిల్ కీ దరియా', 'ఏక్ ఖత్రా ఏ ఖూన్', 'ఇన్సాన్ ఔర్ ఫరిష్టే (నవలలు, నవలికలు), 'ధనీ బాంకే', షైతాన్ (నాటికలు, రేడియో నాటికలు), 'కలియా', 'దో హాథ్', 'చోటే'(కథా సంకలనాలు), 'కాగజి హై పైరహన్' (ఆత్మకథ) ఆమె రచనలలో కొన్ని. గరం హవా, అర్జూ, మైడ్రీమ్స్, లీహాఫ్ ఆమె కథల ఆధారంగా తీసిన చిత్రాలే.
నిషేధానికి గురయ్యాయి
పురుష ఆధిపత్యం, అన్యాయం, లైంగికత, పురుషాధిపత్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, చేస్తున్న పోరాటాలు.. అనాటి పరిస్థితుల్లో మహిళలు అనుసరించాల్సి వచ్చిన అనాచారాలు, దురాచారాలపై అమె తన కలాన్ని ఎక్కుపెట్టారు. సమస్య ఏదైనా.. ఎక్కడున్నా.. అమె స్త్రీవాదాన్ని బలంగా వినిపించేలా ఎన్నింటినో అక్షరీకరించారు. నిస్సంకోచంగా, ధైర్యసాహసాలతో రాసినందుకు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అమె రాసిన పలు పుస్తకాలు నిషేధానికి గురయ్యాయి. ఇలా ఎన్నో రచనలను భావితరాలకు అందించిన అమె 1991 అక్టోబర్లో కన్ను మూశారు.