Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదో మహా సముద్రం. ఆవేదన కోపంగా మారి పోటెత్తిన సందర్భం. అక్కడ ఉన్నవాళ్లందరి మానసిక పరిస్థితి అదే. యశ్వంతపురలో ట్రైన్ దిగి బెంగూళూర్ సిటీ స్టేషన్కి వచ్చేటప్పటికి అప్పటికే అక్కడ ఉద్వేగం గుమికూడి నినాదమై ఉంది. కళ్లతోనే అపరిచితులు ఒకరినొకరు పలకరించుకొంటున్నారు. దేశంలో ఎక్కడెక్కడి నుండో ఉరకలెత్తి వచ్చి క్రమశిక్షణతో నిలబడి ఉన్నారక్కడ. 'ఏమి చేయమన్నా చేస్తాము.' అనే వాగ్దానం ఓపిగ్గా ఎండలో నిలబడిన ఆ దేశభక్తులలో కనిపిస్తుంది.
ఉద్రిక్తమూర్తులు...
నేను మొదట పలకరించింది ఒక ట్రాన్స్ జండర్ ను. ఆమె తన సమూహాన్ని నాకు పరిచయం చేసింది. వాళ్లు ఒక వందమంది పైనే ఉన్నారు. 'అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో ఉంటున్నాము. కానీ ఇప్పటి సందర్భం వేరు ...' దిగులు వినిపించింది ఆమె గొంతులో. పక్కనే ఉన్న ఆమె నేస్తం శూన్యంలోకి చూస్తూ ఉంది. మా సంభాషణను పట్టించుకొనే మూడ్ ఆమెకు లేదు. తరువాత ఊరేగింపులో ఆమెను నేను ఉద్రిక్త మూర్తిగా చూశాను.
ఛాలెంజింగ్గా...
వేల మనుషులు... కొందరు సమూహాలుగాను, కొందరు వ్యక్తులుగాను వారికే వారే వచ్చారు. 'హౌసూర్ నుండి వచ్చాము. మాకు తెలుగు వచ్చు' పలకరించి చెప్పారు కొందరు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ నినాదాలు మార్మోగుతున్నాయి. డప్పుతో ఒక అమ్మాయి ( పేరు నేమి చంద్ర. ఒక కన్నడ కవి పేరు. ఆ పిల్ల నాకు తెలుసు) నినాదాల హౌరెత్తిస్తుంది. ఇంతలో అక్కడికి గణేశ్ డేవి ప్రత్యక్షం అయ్యారు. ఆయన ఆర్టికల్స్ 'ద వైర్' లో ఎక్కువ వస్తాయనీ, కల్బుర్గి చనిపోయాక ఆయన అదే ప్రదేశంలో చాలెంజింగ్ గా నివాసం ఉంటున్నారనీ, నా పక్కనే ఉన్న జ్యోతి వడ్లమూడి చెప్పింది. ఆమె, పైలా అరుణ హైదారాబాద్ నుండి వచ్చిన జర్నలిస్టులు. గణేష్ డేవి 'ఇదే కోపం మీకు ఇంకో సంవత్సరం తరువాత ఉంటుందా' అని సమూహాన్ని ప్రశ్నిస్తున్నారు. 'హా హా' అనే ప్రతిస్పందనలు వినబడుతున్నాయి. ఊరేగింపు ప్రారంభం అయ్యింది.
ఒక్కొక్కరుగా, సమూహంగా...
అదో అపురూపమైన అనుభవం. సమూహంలో ఒక్కరిగా, ఒక్కళ్ళమే ఒక సమూహంగా మన ఉనికి పోగొట్టుకొన్న సంతోషం. విద్యార్ధులు, జర్నలిస్టులు (వీళ్లే తక్కువ ఉన్నారు) మహిళలు, మేధావులు, దళితులు, ముస్లిములు ... వీళ్ళందరు కాకుండా విడివ్యక్తులు 'నాను గౌరి' అనే ప్లకార్డ్ పట్టుకొని ఒంటరిగా సమూహానికి దగ్గరగా నిలబడి ఉన్నారు.
భవిష్యత్ మీద ఆశ...
ఒకామెను గమనించాను. చాలా బలహీనంగా ఉన్నారామే. ఎవరితో కలిసి లేరు. అలా ఊగులాడుతూనే ఊరేగింపు అంతా నడిచారు. నేను దగ్గరకు వెళ్ళి పలకరించాను. 'ఒక్కదాన్నే వచ్చాను. రావాలని అనిపించింది' అన్నారు ఆవిడ. అలా రావాలని అనిపించి అక్కడకు వచ్చిన వాళ్ళు నాకు చాలా మంది కనిపించారు. బళ్లారి నుండి ఒక కుర్రాడు ఒక్కడే వచ్చాడు. స్టేజ్ మీద ఉన్న చాలా మంది గురించి మాకు చెప్పాడు. ఎంత ఆశ కలిగిందో భవిష్యత్ మీద.
చేతులెత్తి నినదిస్తూ..
ఒక పక్క విద్యార్ధులు గొంతులు తెగేలా నినాదాలు యిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో భావాలు వర్ణించనలవి కాదు. తెచ్చుపెట్టుకొన్న కోపాలు కావవి. గొంతు నాళాలు గట్టిపడి, ఊపిరి ధ్వనిగా ఉరకలెత్తుతోంది. ఆవేశం ముఖ కవళికల్లో ప్రతిబింబిస్తుంది. ఊరేగింపు ఫ్రీడం పార్క్ దగ్గరకు చేరుకొనే సమయానికి అక్కడ మహిళలు చేతులెత్తి నినదిస్తున్నారు 'గౌరి అమర్ రహే' అంటూ. జర్నలిజం కాలేజ్ నుండి వచ్చిన విద్యార్ధులు వీధి నాటకం వేస్తున్నారు, గౌరి మరణం గురించి.
అద్భుత దృశ్యం..
బహిరంగసభ స్థలంలో కుర్చీలు చూసుకొని సెటిల్ అయ్యాక తెలిసింది. వేదికకు చాలా దూరంగా ఉన్నామనీ, ఫోటోలు తీయలేమనీ. అయినా ఫర్వాలేదు. ఆ సందర్భం మనసులో ముద్ర పడినంత ఏ ఫోటో రూపు దిద్దుకోలేదు.ఏ కెమెరా కన్ను బంధించలేనంత దృశ్యం మా ముందు ఉంది. వేదిక మీద తీస్తా సెతల్వాద్, జిగేశ్ మేవాని, కవితా కృష్ణమూర్తి, సీతారాం ఏచూరి, స్వామి అగ్నివేశ్, మేధా పాట్కర్, గణేశ్ డేవీ, సాయి చంద్, ప్రకాష్ రాజ్, హరగోపాల్ లాంటివారందరూ ఉన్నారు. పీవోడబ్ల్యూ సంధ్య ను కూడా వేదిక మీదకు పిలిచారు. వీరు కాకుండా క్రిస్టియన్ ఫాదర్స్, ముస్లిం నాయకులు, ఏ ఏ పీ నాయకులు, కొంతమంది అభ్యుదయ లింగాయత్ పీఠాధిపతులు కూడా ఉన్నారు.
ఆర్తి అర్థమైంది...
కొన్ని అద్భుత గీతాల తరువాత (వాటి భావం నాకు అర్ధం కాలేదు. కానీ వాటిలో ఆర్తి నన్ను తాకింది) గౌరి తల్లి ఇందిరా లంకేష్ మాట్లాడారు. ''నా కూతురు గౌరి తన అణువణువుతో పోరాటం (హిందుత్వాతో) చేసి చనిపోయింది. ఇప్పుడు, ఇక్కడ అనేక మంది గౌరీలు కనిపిస్తున్నారు''అని. సభాస్థలం నుంచి బయటకు వస్తుంటే నిలువెత్తు గౌరీ ఫొటో. 'నాను గౌరీ' అనుకొంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చాను.
- రమాసుందరి, పీఓడబ్ల్యూ