Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటికి మూలస్తంభంగా బరువుబాధ్యతలన్నీ మోసేది మహిళలే. వీరి ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడంతో అనేక అనారోగ్య సమస్యతో పాటు ఆర్థిక, సామాజిక సమస్యలు వస్తున్నాయి అంటున్నారు డాక్టర్ సాయి లక్ష్మి దయానా. గైనిక్- అంకాలజీలో 15ఏండ్ల పాటు పరిశోధనలు చేసిన ఆమె యుకెలోని ప్రముఖ గైనిక్ అంకాలజీ సర్జన్స్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. క్యాన్సర్ పై అవగాహన లేమితో ఎంతో మంది మహిళలు మృత్యువాత పడటం కలచివేయడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఒకవైపు ప్రముఖ డాక్టర్గా సేవలందిస్తూనే... మరోవైపు సామాజిక కార్యకర్తగా మారి మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వందలాది మంది మహిళలకు ప్రీ-క్యాన్సర్ పరీక్షలతో పాటు చికిత్సను అందించారు. పాతబస్తీలోనూ, మారుమూల గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆమెతో మానవి..
మెడిసిన్ చదవాలన్న ఆసక్తి ఎలా వచ్చింది?
చిన్నతనం నుంచి మన శరీరం ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది. చదివే కొద్ది సైన్సు పై, మానవ శరీరంపై ప్రేమ పెరిగింది. శరీరంలోని ఏ భాగాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలన్న ఉబలాటం ఎక్కువైంది. డాక్టర్ అంటే సమాజంలో ఉండే గౌరవం మెడిసిన్ చదివేలా చేశాయి. యాప్రాన్ వేసుకున్న వారిని ఎంతో గౌరవంగా.. ఆప్యాయంగా చూస్తారు. వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ను జన్మలో మరిచిపోరు. సమాజ సేవలో వైద్యం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే నేను డాక్టర్ కావాలనుకున్నాను.
మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా?
లేదు. మా నాన్న రాజు దయానా సిండికేట్ బ్యాంక్ మేనేజర్. అమ్మ సరోజిని స్కూల్ టీచర్గా పనిచేశారు. ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కల తర్వాత నేను. వారంతా బిజిసెన్, ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్లారు. నేను మాత్రమే మెడిసిన్ వైపు వచ్చాను.
మీ విద్యాభ్యాసం గురించి చెబుతారా?
నాన్నకు ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉండేవి. చిన్నతనంలో చాలా స్కూల్స్ మారాను. హైదరాబాద్లో సెయింటాన్స్ లో పదవతరగతి పూర్తి చేసి కాకినాడలో ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదివాను. ఎంసెట్లో 92వ ర్యాంక్ వచ్చింది. ఉస్మానియాలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాను. మెడికోగా హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేశాను. రెడ్హిల్స్లోని క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేసే సమయంలో క్యాన్సర్పై స్పెషలైజేషన్ చేయాలని పించింది. సర్జర్సీ చేయడం అంటే చాలా ఇష్టం. పి.జీ చేయాలనుకున్నాను.నా ఆసక్తికి తగ్గట్టుగా ఉండే యూనివర్సిటీల గురించి సెర్చ్ చేశాను. మా స్నేహితులు కొంతమంది యూకె ఎంట్రెన్స్ రాశాను. నేను వారితో పాటు ఎంట్రెన్స్ రాసాను. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎం.డీ పూర్తి చేశాను. నూV పై రాయల్ కళాశాలలో రిసెర్చ్ చేశాను. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు గైనీ-ఆంకాలజీని సబ్-స్పెషాలిటీ తీసుకుని రీసెర్చ్ పూర్తి చేశాను. యూరప్లోని అతిపెద్ద క్యాన్సర్ చికిత్స హాస్పిటల్ క్రిస్టీ లో క్లినికల్ లెక్చరర్గా, సెయింట్ జేమ్స్ ఇనిస్టిట్యూట్ల్లో, జిన్నా-ఆంకాలజీలో , యూరోప్లోని అతిపెద్ద టీచింగ్ హాస్పిటల్ లీడ్స్లో పనిచేశాను. దాదాపు 18 సంవత్సరాల పాటు విద్యార్థిగా, డాక్టర్గా, టీచింగ్ ఫ్యాకల్టీగా గైనిక్ అంకాలజీలో పనిచేశాను. అక్కడ చేసిన రీసెర్చ్ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేలా చేసింది.
మరి ఇండియా ఎందుకు రావాలనిపించింది?
విదేశాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా.. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మన సొంత గడ్డపై ఉన్న ప్రేమ తగ్గిపోదు. మన దేశంలో ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రతి గంటకు ఎనిమిది మంది మహిళలు చనిపోతున్నారు. అవగాహన లేకపోవడంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. నా పరిశోధనలు నా దేశానికి ఉపయోగపడాలి అనుకున్నాను.
మీ నిర్ణయం విని ఇంట్లో వారు ఎలా స్పందించారు?
అందరూ సంతోషించారు. ముఖ్యంగా మా వారు డాక్టర్ సంజరు. ఆయన యూరో అంకాలజిస్ట్. యుకె వెళ్లిన రెండు సంవత్సరాల తర్వాత పరిచయం. పెద్దల అనుమతితో పెండ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరూ పిల్లలు. మేం తల్లిదండ్రులతో, స్నేహితులతో చర్చించాం. తర్వాత మా ఇద్దరి నిర్ణయం ఒకేటే కావడంతో అనేక సంవత్సరాల పరిశోధన ఫలితాలతో తర్వాత తిరిగి ఇండియాకు వచ్చాం. ఇద్దరం అపోలో ఆసుపత్రిలో సీనియర్ కన్సలెంట్స్గా చేరాం.
ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పరిశోధనలకు, ఆలోచనలకు అనుగుణంగా చేసిన కార్యక్రమాలు?
ప్రపంచవ్యాప్తంగా రెండువందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వాటిలో ఐదు క్యాన్సర్లను మాత్రమే ముందుగా గుర్తించి.. మెరుగైన వైద్యం అందించవచ్చు. వీటిలో గర్భాశయ, బ్రెస్ట్, కోలన్, లంగ్స్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నాయి. మహిళల మరణానికి కారణమవుతున్న ఈ రెండు రకాల క్యాన్సర్లను ముందుగా గుర్తించవచ్చు. కానీ, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు వీటి బారిన పడుతున్నారు. లాస్ట్ స్టేజీలో మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. నేను ఇన్ని రోజులు మారుమూల గ్రామాల వారిలో, నిరక్షరాస్యులలో మాత్రమే అవగాహన లేదు అనుకున్నాను. కానీ, అపోలోలో చేరిన తర్వాత వచ్చిన మొదటి మూడు కేసులను చూసి నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. నేను చికిత్స చేసిన మొదటి ముగ్గురిలో ప్రొఫెసర్, బ్యాంక్ మేనేజర్, డాక్టర్ ఉన్నారు. వీళ్లు అడ్వాన్స్ స్టేజీలో వచ్చారు. వారు విద్యావంతులైనప్పుటికీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలన్న అవగాహన లేకపోవడంతో వారికి అడ్వాన్స్ స్టేజీలో క్యాన్సర్ బయటపడింది. అందుకే అందరికీ అవగాహన కల్పించేలా హెల్త్టాక్స్, వర్క్షాపులు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్లోని ఐటి కంపెనీల్లో, కాలేజీల్లో, కార్యాలయాల్లో ఒకేసారి వందలాది మందికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలను రూపొందించాం. ఇందుకు కావల్సిన స్లైడ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ సిద్ధం చేసుకున్నాం.
ఇటీవల నిజామాబాద్లోనూ మీరు ప్రీ క్యాన్సర్ చికిత్స అందించారు. ఒకరితో ఎలా సాధ్యమైంది?
హైదరాబాద్లో చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా(ఇప్పుడు హైదారాబాద్ కలెక్టర్)ప్రోత్సాహంతో మేం ఈ కార్యక్రమం నిర్వహించాం. నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో ఒక రోజు క్యాంప్ నిర్వహించాం. 20మంది డాక్టర్లకు, 30మంది నర్సులకు శిక్షణతో పాటు కిట్స్ ఇచ్చాం. వారి సహాయంలో ఒకేరోజు 50మందికి చికిత్స అందించాం. శిక్షణ పొందిన ఈ బృందం జిల్లా వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తూ.. ప్రీక్యాన్సర్ లక్షణాలున్న వారికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. పాతబస్తీలో సామాజిక కార్యకర్త జమీలా నిషాత్ సహాకారంతో రెండు, మూడు వారాలకు ఒకసారి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైన 'మా వద్ద వందమంది ఉన్నారు.. వారి కోసం అవగాహన సదసు ఏర్పాటుచేయండి' అంటే చాలు హెల్త్టాక్ నిర్వహిస్తాం. అంతేకాదు హెల్త్టాక్ ద్వారా వచ్చిన వారికి అలోపో హాస్పిటల్లో డిస్కౌంట్తో వైద్య పరీక్షలు చేస్తున్నారు.
మహిళల్లో ఈ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా రావడానికి కారణం?
మన దేశంలో మహిళలు రెండవ శ్రేణి పౌరులుగా ఉన్నారు. ఇంట్లోని వారంతా తిన్నతర్వాత మిగిలిందే వారి ఆహారం. ఉద్యోగాలు చేసే మహిళలు.. ఉన్నతస్థాయిలో ఉన్న మహిళలు కూడా తన కోసం, తన ఆరోగ్యం కోసం డబ్బులు పెట్టడం అనవసరపు ఖర్చుగా భావిస్తారు. నాకెందుకు? నాకేమైౖంది? నాకేం కాదు? ఇలాంటి మాటలతో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్నచిన్న మాత్రలతో తగ్గే సమస్యలను కూడా పెద్దవి అయ్యేవరకు తీసుకువస్తున్నారు. ఒక మహిళ అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది. ఈ విషయం ప్రతి మహిళ గమనించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు.. నిజమే..అయితే దాన్ని ఆడవారి ఆరోగ్యం ఆ ఇంటి భాగ్యం అని గుర్తుంచుకోవాలి.
- వి. యశోద