Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన సుస్వరగాత్రంతో ఇంటింటా ' సుప్రభాత ' గీతమై వినిపించిన గళం ఆమె సొంతం. తన సంగీతంతో కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార. ఆమె ఎం.ఎస్. సుబ్బలక్ష్మి. ఆమె స్వరం విశ్వవ్యాపితం. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం, భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్న తొలి సంగీత కళాకారిణి ఆమే. తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ఎం.ఎస్ .సుబ్బలక్ష్మి జన్మించారు. తండ్రి ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్. తల్లి ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మల్. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. అమ్మే ఆది గురువు. అమ్మవొడే తొలి సంగీతబడి. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది.సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగారు. పదేండ్ల వయసులో సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉన్నారు. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ రూపొందించారు.
సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ త్యాగరాజన్ సదాశివన్ తో ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ప్రోత్సాహం లభించింది. 1938లో 'సేవాసదనం' సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. 1940లో 'శకుంతలై' సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు. 1945లో నిర్మించబడిన 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా.
గాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది. ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతంతో అలరించేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు ఆమె గళం నుంచి జాలువారాయి. ఏ భాషలో పాడినా అదే తన మాత భాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం!
ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఇచ్చిన ప్రదర్శనలో ఇంగ్లండ్ రాణి ప్రశంసలు అందుకున్నారు.