Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓల్గా కుతుంగర్.. పేరు మాత్రమే కాదు. తెలుగునాట స్త్రీవాదానికి పర్యాయపదం. 'జైలు గది ఆత్మకథ' మొదలు నేటి 'యశోబుద్ధ' వరకు వందల కథలు, పదుల్లో నవలలు రాసిన రచయిత్రి. ఆమె కేవలం రచయిత్రేనా.. సంపాదకురాలు, గొప్ప విశ్లేషకురాలు. సునిశిత విమర్శకురాలు, మంచి అనువాదకురాలు. అన్నింటికీ మించి క్రియాశీల కార్యకర్త. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఓ గొంతుక. ఆమె రాజకీయ కథలు... అమ్మాయిల ఆత్మగౌరవాన్ని మేల్కొలిపాయి. 'స్వేచ్చ'Û ఓ సంచలనం. ఆకాశంలోసగం, సహజ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ప్రయోగం, మృణ్మయనాదం... ఓ పరంపర. 'విముక్త' స్త్రీలకు నిజమైన విముక్తి చెప్పే మేనిఫెస్టో. అసలు పేరు లలిత కుమారిలోని లాలిత్యం... ఆమె అక్షరాల్లో కనిపిస్తుంది. కలం పేరు ఓల్గాలోని ఒరవడి ఆమె భావాల్లో ప్రతిబింబిస్తుంది. రాస్తూ పోతే విశేషణాలు సరిపోవు! అలాంటి అసామాన్య వ్యక్తితో సంభాషణ సారాంశం...
మీ మొదట రచనల నుంచి ఇటీవలి 'యశోబుద్ధ' వరకు ఎంత రాడికల్ విషయాన్నైనా అంత సున్నితమైన భాషలో చెబుతారు. అది ఎలా సాధ్యమైంది మీకు?
రచయిత స్వభావమే శైలి అవుతుంది. అభిప్రాయాల్లో, ఆచరణలో ఎంత బలంగా ఉంటానో, ఏ పనైనా నాదైన రీతిలో చేస్తాను. నా రచన మొదట పాఠకులను చదివింపజేయాలి. తరువాత ఆలోచింపజేయాలి. చదవడం మధ్యలో ఆపారంటే నా పర్పస్ దెబ్బతిన్నట్టే. నాపై కొడవటిగంటి కుటుంబరావు ప్రభావం, చలం ప్రభావం ఉంటుంది. వాళ్లిద్దరి గుణాలు కలిసి ఓ భిన్నమైన శైలి నాకు వచ్చి ఉంటుంది. ఇక భావుకత విషయానికి వస్తే... యశోబుద్ధ రాసేటప్పుడు బుద్ధుడి కాలంనాటి దృశ్యాలను, అందులోని పాత్రల మనసులను, వాళ్ల వ్యక్తిత్వాలను ఊహించడం వల్ల అలా రాయాలనిపించింది. కథకు మరీ అంత భావుకత అవసరం ఉండదు. కానీ చారిత్రక నవల రాయడం చాలా కష్టం. వాళ్ల ఇండ్లు, వేషధారణ ఏమీ తెలియదు. శిల్పాలు చూడటం, కొన్ని ఊహ తప్ప. ఇక ప్రకృతి, పువ్వులు, వెన్నెల అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉంటుంది. బుద్ధుడు ప్రకృతి... ప్రేమికుడు కూడా కాబట్టి అంత భావుకతతో చెప్పాల్సి వచ్చింది.
ప్రయోగం తరువాత మృణ్మయనాదం నుంచి పురాణ పాత్రలతో కథలు వచ్చాయి. ఈ షిఫ్ట్కి కారణం?
పురాణ పాత్రలు తీసుకోవడమనేదే షిఫ్ట్ గానీ.. విషయంలో షిఫ్ట్ కాలేదు. స్త్రీల లైంగికత్వాన్ని సమాజం, కుటుంబం ఎలా అదుపు చేస్తుంది? మగవాడు నీతి సూత్రాలను తయారు చేసి ఏ విధంగా మహిళలపై బలవంతంగా రుద్దారు? అనేదే ప్రధాన విషయం. పురాణ పాత్రలు మామూలు ప్రజలను చాలా ప్రభావితం చేస్తాయి. సీత, అహల్య తెలియని వాళ్లు ఉండరు. ఏదో ఒక రూపంలో వాళ్ల కథ, పేరు వినే ఉంటారు. వాళ్ల ద్వారా నా భావాలు చెప్పిస్తే... ఆమోదం తేలికగా జరగుతుంది. సీత మీద అందరికీ సానుభూతి ఉంటుంది. కానీ సీత చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ. సీత గట్టి పడటానికి ఆమె చుట్టూ స్త్రీల స్నేహ సమూహం ఉంది. స్త్రీల మధ్య సహకారం అది చాలా అవసరం. ఈ రెండింటికోసం నా భావాలను ఈ పాత్రల ద్వారా చెప్పించాను. ఒక స్థాయి పాఠకులు ప్రయోగం, స్వేచ్ఛ చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. కానీ తీసుకోలేని సమాజం ఎక్కువగా ఉంది. వాళ్లను కూడా ఈ ఆలోచనల్లోకి తీసుకురావాలి. పెండ్లి, పిల్లలు, సంసారం అనేవి స్త్రీలను ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి.. అని చెప్పడంలో భాగమే ఈ కథలు. ఇక సమాజ పురోగతికి, తాత్విక ఆలోచనకు స్త్రీలు కంట్రిబ్యూట్ చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా కనబడదు. యశోబుద్ధ నవలకే వస్తే... యశోధర అనగానే హాయిగా ఆమె, పిల్లలు నిద్రపోతుంటే.. బుద్ధుడు వదిలేసి వెళ్లిపోయిన దృశ్యం గుర్తుకు వస్తుంది. ఆమె మనకు బాధితురాలిగానే పరిచయం. నిజానికి పురాణ, చారిత్రక పురుషులందరితో పోల్చుకుంటే బుద్ధుడు చాలా గొప్ప మానవుడు. చిన్నతనం నుంచి అతని ప్రవర్తన చాలా కరుణతో ఉంటుంది. అలాంటి వ్యక్తి తన భార్యతో ఇన్సెన్సిటివ్గా ఉండడు. ఆమెను బాధించి అతడు వెళ్లిపోయేంత కఠినమైన బంధం వాళ్లిద్దరిది కాదు. ఇల్లు వదిలి అతడు వెళ్లిపోయిన రోజు ఆమె హాయిగా నిద్రపోయిందంటే... ఆవిడ ముందే బుద్ధత్వాన్ని సాధించింది. సిద్ధార్థుడు ఎవరితో మాట్లాడినా తాత్వికత ఉంటుంది. యశోధరలో కూడా ఆ జిజ్ఞాసే ఉండి ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండి ఉంటుంది?' అని రాసిందే యశోబుద్ధ నవల. చతురలో వచ్చింది చాలా ఎడిట్ అయ్యింది. ముగింపు కూడా అలా ఉండదు. త్వరలో పూర్తిగా పుస్తక రూపంలో రాబోతోంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీ జీవనవిధానమే మారిపోయింది. వస్తున్న సమస్యలు మారిపోయాయి. వాటిని ప్రతిబింబిస్తూ ఎక్కువ కథలు రావడం లేదనిపిస్తుంది?
గ్లోబలైజేషన్ వచ్చిన తరువాత నేను కొన్ని కథలు రాశాను. చాలా మంది కూడా రాశారు. ప్రపంచీకరణ తరువాత మహిళలు అనుకోని రంగాల్లోకి వెళ్లడం, అనుకోని మలుపులు తిరగడం, అనుకోని పరిస్థితులు తారసపడటం.. వీటన్నింటి మీద రాస్తూనే ఉన్నారు. అయితే స్త్రీవాదం ఓ పెద్ద సంచలనంగా వచ్చింది. ఇప్పటి రచనలు అంత సంచలనంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు సంచలనాలు రచయిత్రులు సృష్టించలేరు. మీడియా సృష్టిస్తోంది. దానిముందు రచయిత్రులు సృష్టించేవి తక్కువ. ఎంత కొత్త భావం చెప్పినా కూడా అది తక్కువగానే అనిపించే సంఘటనలు బయట జరుగుతున్నాయి. మీడియా వల్ల అందరికీ తెలుస్తున్నాయి. అదే ప్రధాన కారణం అనుకుంటున్నా. ఏదేమైనా స్త్రీవాద ముఖ్యోద్దేశం స్త్రీలు శాంతితో, హింసకు, బాధకు గురికాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడం. అలా గడపగలిగిన పరిస్థితులు రోజురోజుకు తక్కువైపోతున్నై. గందరగోళం పెరిగిపోతున్నది. స్త్రీలు కూడా అయోమయం, గందరగోళంలో చిక్కుకుపోతున్నారు. స్వేచ్ఛను ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని బాధ్యతగా ఎలా తీసుకోవాలి? చాలా విషయాల్లో గందరగోళం ఉంది. ఈ గందరోగాళాన్ని రచయిత్రులు అర్థం చేసుకోవాలి. రాయాలి.
కుల, మత అసహనం పెట్రేగిపోతున్న ఈ పరిస్థితుల్లో రచయితల మీద ఉన్న బాధ్యత?
మతసహనం పాటించాల్సిన అవసరం గురించి ఎక్కువ రాయాలి. అది ఒక ఉద్యమం లాగా రాయాలి. విరివిగా, సృజనాత్మకంగా పాఠకులకు కనువిప్పు అయ్యేలా రాయాల్సిన అవసరం ఉంది. దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీవాదం చారిత్రక అవసరంతోనే ఉద్భవించాయి. ఇప్పుడు అట్లాంటి అవసరం భిన్నత్వం కోసం, సహనం పాటించడం కోసం రావాల్సి ఉంది. 'అనేక విషయాల్లో భిన్నత్వం ఉంటుంది. కులం, మతం, సెక్సువల్ ప్రిఫరెన్సెస్.. అన్నింట్లో. దీన్ని అంగీకరించడం మానవుని బాధ్యత' అని అంగీకరింపజేయడం కోసం పూనుకొని రాయాలి. సాహిత్యంలో చాలా వాదాలైపోయినయి. కవిత్వం కోసం కొందరు, కథలకోసం కొందరు.. ప్రక్రియాపరంగానూ విడిపోయారు. సహనం పెంపొందించడం కోసం రచయితలు ఒకబృందంగా ఏర్పడి పనిచేసినా తప్పు లేదంటాను. అభ్యుదయ సాహిత్యం, సంస్కరోణద్యమ సాహిత్యం రావడానికి కారణం... అది ఆ కాలపు అవసరం. కవిత్వం రాయాలి, పాటలు రాయాలి. కథలు రాయాలి. సినిమాలు తీయాలి. ఏదైనా కానీ.. బలంగా భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీదాఉంది. ప్రజలు ఒక విశ్వాసంతో ఉంటున్నారు. ఆ విశ్వాసాలను గౌరవించాలి. వాళ్లను దానినుంచి బయట పడేయాలి. ఇది చాలా కష్టమైన పని. నేను దేవుడిని నమ్మును. మతాన్ని నమ్మను. ఎవరు ఏ మాంసమైనా తినొచ్చు. అయితే ముస్లింలు ఫోర్క్ తినరు... అట్లాగే కొందరు బీఫ్ తినరు. వాళ్లను కూడా గౌరవించాలి. ఎవ్వరినీ నొప్పించకుండా, గాయపరచకుండా మతాలకు అతీతంగా రాయడం అంటే... చాల శ్రమతో కూడిన పని. కానీ చేయాలి. మొదట్లో సింపుల్ గా పైపై కథలే రావచ్చు. రానురాను దానిలో ఉన్న సూత్రాలన్నీ అర్థం అవుతాయి. రచనలైనా, ఉద్యమాలైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే కాకుండా... రోజువారీ కార్యాచరణలో భాగంగా ఉండాలి. మళ్లీ ఇంకో సంఘటన కోసం ఎదురుచూస్తున్నారా? అనిపించేలా కాకుండా... 24 గంటలు పనిచేసేవారి సంఖ్య పెరగాలి.
దళిత స్త్రీల, ఇతర వర్గాల స్త్రీల గురించి ఎక్కువ రాయలేదన్న విమర్శ వస్తే దానికి మీ సమాధానం?
నేను పట్టించుకోలేదంటే ఒప్పుకోను. నేను రాయగలిగినంత రాశాను. దళితుల గురించి రాయాలంటే అథెంటిసిటీ ఉండాలి. నేను వచ్చిన మధ్య తరగతి స్త్రీల విషయాలను ప్రధానంగా రాశాను. నాకు తెలిసినంత వరకు దళిత స్త్రీల జీవితాన్ని నాకథల్లోనూ, రెండు మూడు నవల్లోనూ చిత్రీకరించగలిగాను. ఇంకా దాని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాను. అర్థం చేసుకోవడనికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. రచనావ్యాసంగమే కాకుండా మాట్లాడటం, చర్చించడం, ఉపన్యాసాలివ్వడం చేస్తున్నా. సహజంగా అగ్రవర్ణాల వాళ్లకిది ఎదురవుతుంది. దానికి బాధ పడను. పోనిలే అననీ అనుకుంటా. ఇన్ని శతాబ్దాలు కోపాన్ని మనసులో అణచుకున్నారు. ఇప్పుడు నన్ను కాకపోతే ఎవరిని అంటారు. నాకంటే వాళ్లని ఇంకెవరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటాను. కోపం తెచ్చుకోను. నా నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. వాళ్లు ఆశించినమేరకు ఇవ్వలేకపోవడం నా తప్పు కావచ్చు.
సినిమాల్లో మహిళల చిత్రీకరణ దారుణంగా ఉంది. దీనిపై పోరాటం చేయకపోవడానికి, ఓ ఉద్యమం రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
సినిమాలకు సంబంధించిన ఈ బాధ్యతంతా మహిళల మీదే వేయడం సరైనది కాదు. మహిళలు కూడా పట్టించుకోవాలి. అలాగే బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు.. పట్టించుకోవాలి. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. మన దేశంలో, రాష్ట్రంలో పొలిటికల్ ఎకానమీని ప్రభావితం చేసే రంగం సినిమా. కేవలం స్త్రీలకు సంబంధించిన విషయంగానే చేయడం... సినిమా సాధించిన సక్సెస్. సినిమా మహిళలను కించపరచడం, చిన్నచూపు చూడటం, హింస మాత్రమే కాదు... అది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తోంది. సినిమా ఓ సాంస్కృతిక దాడి. అలాంటి సినిమాల మీద పోరాటం కూడా చాలా పదునైన ఆయుధాలతో ఉండాలి. కానీ ఒకరి చేత సారీ చెప్పించో.. ఒక సినిమాను బ్యాన్ చేయిస్తేనే సరిపోదు. సినిమా రంగం రాజకీయంగా, ఆర్థికంగా బాగా పాతుకుపోయింది. మరోవైపు బావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ఏది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ? ఏది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద దాడి అని సున్నితంగా చూడాలి. అలాగే మహిళలు కూడా సినిమాల్లో వాళ్ల విషయమే కాకుండా మొత్తం విషయాన్ని పట్టించుకోవాలి. సినిమా ఎట్లా రూపొందుతోంది? దాని పెట్టుబడి ఎక్కడినుంచి వస్తోంది? దాని స్వభావమేమిటి? ఆ పెట్టుబడే ఎట్లా శాసిస్తోంది? ఇవన్నీ అర్థం చేసుకుని ఒక ఉద్యమాన్ని నిర్మించాలి. ప్రత్యామ్నాయ సినిమా ప్రచారం చేయాలి. కానీ మనం కూడా ఒక పెద్ద సినిమాకు డబ్బులు పెట్టడానికే ఉత్సాహం చూపిస్తాం. భిన్నంగా వచ్చిన సినిమాను.. 'ఆర్టిస్టిక్ విలువలు లేవు, బోర్ కొడుతోంది, డాక్యుమెంటరీలాగా ఉంది...' అని విమర్శిస్తాం. దాన్ని బాగు చేయడం ఎలా? అని అస్సలు ఆలోచించం. ఈ ధోరణిలో మార్పు రావాలి. పబ్లిక్ ఫండింగ్తో సినిమాలు రావాలి. థియేటర్లు లేకుండా సినిమాలు విడుదల చేయగలిగేలా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి, రెండు మూడు మంచి సినిమాలతో వచ్చినవాళ్లను కూడా కమర్షియల్ లాగేసుకుంటోంది. నేను, కుటుంబరావుగారు కలిసి క్రౌడ్ ఫండింగ్తో పిల్లల సినిమాలను చేశాం. 39 మంది కలిసి 'భద్రం కొడుకో', 10 మందిమి కలిసి 'పాతనగరంలో పసివాడు', 'గులాబీలు' వంటివి తీసినప్పుడు ఎవ్వరూ గుర్తించలేదు. సత్యజిత్రే, మృణాల్సేన్, శ్యామ్బెనగల్, గోవింద్ నిహ్లానీ వంటివాళ్లు అన్నింటినీ తట్టుకుని చివరకంటా తము నమ్మినదానికోసమే నిలబడ్డారు. బెంగాల్వాళ్లు సత్యజిత్రేను ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ మన తెలుగులో ఆ గుర్తింపు కొరవడింది. దాంతో ప్రత్యామ్నాయ సినిమా వైపు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. వచ్చినవాళ్లు నిలబడలేకపోతున్నారు.
యువ రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
రచయితలైనా, రచయిత్రులైనా ఇప్పుడున్న పరిస్థితులపై ఒక ఉద్యమంలాగా రాయాలి. అర్థం చేసుకుని, అధ్యయనం చేసి రాయాలి. ఈ క్రమంలో సహనం చాలా అవసరం. కేవలం రచనల్లోనే కాదు... ప్రత్యామ్నాయ సినిమాను ఎలా రాయాలి? ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? తమిళంలో, బెంగాలీ, మలయాళీలో, మరాఠీలో ప్రత్యామ్నాయ సినిమా ఉంది. తెలుగులోనే లేదు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఆలోచించాలి. ఒకప్పుడు స్త్రీవాదం వస్తున్న సమయంలో 24 గంటలూ పనిచేసినం. ఉద్యమంలాగా రాశాం. ఇప్పుడు రాస్తున్న యువతరం కూడా ఎక్కువ సమయం రచనల కోసం ఉపయోగించాలి.
నిజమైన స్వేచ్ఛ...
సమాజం పట్ల, తమ పట్ల ఒక భాధ్యతతో మెలగగలిగిన అవకాశాలను కలిగి ఉండటం స్వేచ్ఛ. వ్యక్తిగా తనకు కావాల్సింది సాధించుకోవాల్సిన అవకాశాలు ఉండటం, సమాజంలో తను ఏం చేయాలనుకుంటుందో చేయగలిగే అవకాశాలు ఉండటం స్వేచ్ఛ. ఈ రెంటిని పొందటం కోసం స్త్రీలు ఎప్పటికప్పుడు పోరాటం చేయగలగాలి. అదే నిజమైన స్వేచ్ఛ!
- కట్ట కవిత