Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానా కాలంలో ఏ కూర తిన్నా నోటికి రుచిగా ఉండదు. అలాంటి సమయంలో కాస్త పులుపు, కారం, తీపి కలగల్సిన పదార్థాలు నాలుకకి తగిలితే చాలు కడుపు నిండా తింటారు. ఈ పులుసులను రాత్రి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పులుసులు మర్నాడు ఉదయం కూడా తింటే రుచి మరింత కమ్మగా ఉంటుంది. అలాంటి తెలంగాణ పులుసులు ఈ వారం మీ కోసం... మరెందుకు ఆలస్యం నోరూరించే కమ్మటి పులుసులను ఓ సారి ప్రయత్నించి చూడండి...!
ఉల్లిగడ్డ పులుసు...
కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డలు- చిన్నవి ఏడు లేదా ఎనిమిది, చింతపండు-మూడు రెబ్బలు, మెంతులు-సగం చెంచా, జీలకర్ర-సగం చెంచా, ధనియాల పొడి-సగం చెంచా, పసుపు-చిటికెడు, కొబ్బరి పొడి-సగం చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద, ఎండు మిర్చి-రెండు, పచ్చిమిర్చి-రెండు, గుడ్డు-ఒకటి, కరివేపాకు రెబ్బలు, ఉప్పు-రుచికి తగినంత, కారం పొడి-ఒక చెంచా.
తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డల పొట్టు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి జీలకర్ర, మెంతులు దోరగా వేయించుకోని మెత్తగా దంచుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చింత పండును పది నిమిషాలు నానబెట్టి పులుసు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరొ ప్యాన్ పెట్టి దాంట్లో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, పసుపు వేసి కాస్త మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలను వేసి ఐదు నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. పుసులు బాగా మరుగుతుంటే కొబ్బరి పొడి లేదా నువ్వుల పొడి, ఒక గుడ్డు పగులకొట్టుకుంటే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తురుము, జీలకర్ర, మెంతులు పొడి వేసుకుంటే చాలు ఉల్లిగడ్డ పులుసు రెడీ !
వంకాయ పులుసు...
కావలసిన పదార్థాలు: చింతపండు పులుసు-ఒక కప్పు, పచ్చిమిర్చి-రెండు, వంకాయలు-రెండు, ఉల్లిముక్కలు-సగం కప్పు, ఉప్పు-తగినంత, నువ్వులు-రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు-రెండు, పసుపు-చిటికెడు, జీలకర్ర, ఆవాలు-సగం చెంచా, ఎండుమిర్చి-రెండు.
తయారీ విధానం: ముందుగా వంకాయలను, పచ్చిమిర్చిని కట్ చేయకుండా దాని మీద నూనె రాసి స్టవ్ మీద బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయలను, పచ్చిమిర్చిని మెత్తగా చేసుకోవాలి. చింతపండు పులుసులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిముక్కలను, ఉప్పు, ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో పాత్రలో నూనె పోసుకోవాలి. ఇది కాస్త వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని పులుసులో కలుపుకుంటే సరిపోతుంది. చివరగా దాంట్లో నువ్వుల పొడి కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది
చింతపండు పులుసు...
కావలసిన పదార్థాలు: చింతపండు పులుసు-రెండు కప్పులు, నూనె-నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి- మూడు, చక్కెర-ఒక చెంచా, నువ్వులు-సగం కప్పు, జీలకర్ర,ఆవాలు-సగం చెంచా, కరివేపాకు రెబ్బలు రెండు, పసుపు-చిటికెడు, ఎండుమిర్చి-ఒకటి.
తయారీ విధానం: ముందుగా చింతపండు పులుసును తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో రెండు చెంచాల నూనె పోసుకొని పచ్చిమిర్చి, నువ్వులు వేయించుకోవాలి. ఇలా చేసుకొన్న వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసులో ఒక చెంచా చక్కెర, ఉప్పు, గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, పచ్చిగా ఉన్న ఉల్లిముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో పాత్రలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు వేసి, వేయించుకొని పులుసులో కలుపుకుంటే సరిపోతుంది.
కోడిగుడ్డు పులుసు...
కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు-మూడు, ఉల్లిముక్కలు-ఒక కప్పు, పచ్చిమిర్చి-నాలుగు, కారం-రెండు చెంచాలు, ఉప్పు-రుచికి తగినంత, పసుపు-సగం చెంచా, చింతపండు పులుసు-ఒక కప్పు, కొత్తిమీర-సగం కప్పు, కరివేపాకు-రెండు రెబ్బలు, నూనె-నాలుగు చెంచాలు, ధనియాల పొడి.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే ఉడికించిన గుడ్లకు కొద్దిగా పసుపు పట్టించి ఆ నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో ఉల్లిముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లోనే కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు, ఒక చెంచా చక్కెర, నూనెలో వేయించుకున్న గుడ్లను వేసి పదినిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.