Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భికాజీ రుస్తుం కామా
24.9.1861- 13.8.1936
భారత స్వాతంత్య్ర సమరంలో మేడం కామాది ప్రత్యేక స్థానం. 24 సెప్టెంబర్1861న బొంబాయిలోని సంపన్న పార్శీ కుటుంబంలో జన్మించింది. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజి పటేల్. తల్లి జైజిబారు సొరాబ్జీ. 24ఏళ్ళ వయసులో రుస్తుం కామాతో వివాహం జరిగింది. ఆయనకు రాజకీయాలంటే మక్కువ. ఈమె సేవాకార్యక్రమాలు , దాన ధర్మాలతో సమయం గడిపేది.
1896లో బొంబాయిలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ తర్వాత బుబానిక్ ప్లేగు(బొబ్బలతో వచ్చే ప్లేగు వ్యాధి ) ప్రబలింది. సేవా ద క్పధం ఉన్న భికాజీ గ్రాంట్ మెడికల్ కాలేజి తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. ప్లేగు వ్యాధి సోకిన వారికి సేవచేస్తూ, మిగిలినవారికి వ్యాధి రాకుండా టీకాలు వేస్తూ నిర్విరామ కృషి చేసింది. దీంతో ఆమెకూ ప్లేగు సోకింది. చికిత్స కోసం 1901లో ఆమెను బ్రిటన్ పంపారు .
లండన్లో భారతీయులతో సత్సంబంధాలున్న జాతీయ నాయకుడు స్వామి కృష్ణ వర్మ ఉపన్యాసాలకు ప్రేరణ పొందింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో దాదాభాయి నౌరోజీకీ సెక్రటరీగా పని చేసింది. 1905ఫిబ్రవరిలో వర్మ ఏర్పాటు చేసిన ఇండియన్ హౌమ్ రూల్ ను బలపరచింది . 1908లో ఇండియాకు తిరిగి వచ్చే ప్రయత్నం చేసింది.కాని 'జాతీయ ఉద్యమంలో పాల్గొనను' అని హామీ రాసి ఇస్తేనే ఆమెను ఇండియాకు పంపుతామంది బ్రిటిష్ ప్రభుత్వం. నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ ఏడాదే ఫ్రాన్స్ కు వెళ్లి పారిస్లో 'పారిస్ ఇండియన్ సొసైటీ'ని స్థాపించింది. భారత దేశ విముక్తికోసం పుస్తకాలు రాసింది. నెదర్లాండ్స్, స్విట్జర్ లాండ్లలో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులూదింది. ప్రముఖ విప్లవ వీరుడు మదన్ లాల్ ఢింగ్రాను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. దీనిని నిరసిస్తూ 'మేడమ్స్ తల్వార్' రాసి ప్రచురించింది. 22-8-1907లో జర్మనీలోని షట్గార్డ్ లో జరిగిన 'అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్'లో పాల్గొని భారత దేశంలో కరువు వలన ఏర్పడిన తీవ్ర సంక్షోభాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చింది. గ్రేట్ బ్రిటన్ కబంధ హస్తాలనుండి భారత్కు విముక్తి కలిగించాలని ఎలుగెత్తి చాటింది. 'భారత స్వాతంత్య్ర పతాక'ను వేదికపై ఆవిష్కరించింది. ఆ నమూనా నుంచే అనేక మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడున్న మన జాతీయ పతాకం ఆవిర్భవించింది .ఈ జర్మనీ సమావేశం తర్వాత అమెరికా వెళ్లి భారత దేశానికి స్వతంత్రం అవసరాన్ని వెలుగెత్తి చాటింది. అందుకే కామాను అమెరికాలో 'భారతదేశ తొలిసాంస్క తిక ప్రతినిధి' అన్నారు. ఆమె మీద కోపంతో బ్రిటిష్ ప్రభుత్వం కామా వారసత్వ ఆస్తినంతటినీ వశపరచుకొన్నది. క్రిస్టబెల్ పాంక్ హర్స్ట్, ప్రభావంతో పురుషులతో బాటు స్త్రీలకూ సమానావకాశాలకోసం కామా ఉద్యమించింది .
1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూటమిగా ఏర్పడగానే మేడం కామా, రేవాభారు రాణా తప్ప మిగిలిన 'పారిస్ ఇండియా సొసైటీ'లోని సభ్యులంతా దేశం విడిచి వచ్చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వం రాణా కుటుంబాన్ని మార్టినిక్లోని 'కరేబియన్ దీవి'కి ప్రవాసంగా పంపింది. మేడం కామాను 'విచీ'కి పంపింది. అక్కడ ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. 1935వరకు కామా యూరప్లో ప్రవాసంగా ఉంది. తరువాత తీవ్రమైన గుండెపోటు వచ్చి శరీరం పక్షవాతానికి గురైంది. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఇండియాకు వెళ్లేందుకు అనుమతి లభించింది. జహంగీర్ సహాయంతో 1935నవంబర్లో భారత్ చేరి బొంబాయిలో కాలు పెట్టింది. తొమ్మిది నెలల తర్వాత 74వ ఏట బొంబాయి లోని పార్సీ జనరల్ హాస్పిటల్లో ఆమె మరణించింది. స్వాతంత్య్ర ఉద్యమంలో తనదైన రీతిలో సేవలందించి, ఉద్యమ నిర్మాణానికి సాయపడింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆమె పోరాటం చిరస్మరణీయం.