Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూస్ ప్రజెంటర్గా స్క్రీన్పై కనిపించిన ఆమె ఆ తర్వాత యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా బహుముఖ ప్రక్రియల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. రెండు దశాబ్దాలుగా టెలివిజన్ పరిశ్రమలో ఉంటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కార్యవర్గ సభ్యురాలిగా తోటి ఆర్టిస్టుల సంక్షేమం గురించి ఆలోచించారు. ఆమే రమ్య నాయుడు. టూరిజంపై మక్కువతో ఆమె రూపొందించిన డాక్యుమెంటరీలు ఆయా దేశాలలోని అద్భుతమైన ప్రదేశాలతో పాటు అక్కడి సంస్కృతి, ప్రజల జీవనవిధానాన్ని కూడా పరిచయం చేస్తున్నాయి. తెలుగు నేలపై ఉన్న గిరిజనుల జీవనవిధానంపై, వారికి జరుగుతున్న అన్యాయాలపై డాక్యుమెంటరీలు తీయబోతున్న ఆమెతో మానవి..
నాన్న వి.వి. నాయుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. రెండు దశాబ్దాల పాటు ఎయిర్ఫోర్స్లో పనిచేసిన తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి వచ్చారు. అమ్మ గృహిణి. నాన్నకు ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉండేవి. చిత్తూరు జిల్లా ఉదయగిరిలో నేను పుట్టాను. ఆ ఊరికి కరెంటు కూడా ఉండేది కాదట. నాకు ఇద్దరు అక్కలు. మేం ముగ్గురం అమ్మాయిలమే అయినా అమ్మనాన్న ఏనాడూ అబ్బాయి లేడే అని బాధపడలేదు. మా ముగ్గురికి చిన్నతనం నుంచే సొంతంగా మా పనులు మేం చేసుకోవడం అలవాటు చేశారు. చాలా క్రమశిక్షణతో పెంచారు.
ఉదయగిరిలో నాన్న పనిచేసే సమయంలో రైతుల కోసం ఒక బ్యాంకు ప్రారంభించారు. దేశంలోని చాలా ఊర్లు తిరగడంతో మా చుట్టుపక్కల వారే మంచి మిత్రులు అయ్యేవారు. బంధువుల కన్నా స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. అనేక ప్రాంతాల సంస్కృతి తెలుసుకునే వీలు కలిగింది.
కళలపై మక్కువ...
చదువు ఒక చోట కాకుండా చాలా స్కూల్స్ మారాను. ఇతరులతో త్వరగా కలిసిపోయే స్వభావం చిన్నతనంలోనే అలవాటైంది. ఉత్తర భారత్లో చాలా రోజులు ఉండటంతో అక్కడి సంస్కృతి, కళలపై అభిరుచి పెరిగింది. సంగీతం, డాన్స్ అంటే ఇష్టం ఉన్నా.. నేర్చుకోలేకపోయాను. పుస్తకాలు చాలా చదివేదాన్ని. డిగ్రీ, కంప్యూటర్ సైన్సులో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత గుంటూరులో టాటా టెలికమ్యూనికేషన్స్లో టెలీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్గా చేరాను.
న్యూస్ ప్రజెంటర్గా..
మార్కెటింగ్కు సంబంధించిన ఉద్యోగం కాబట్టి అన్ని పత్రికల వారితో, ఎలక్ట్రానిక్ మీడియాతో పరిచయాలు ఉండేవి. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే రెండు మూడు లోకల్ చానల్స్.. అంతే. న్యూస్ కవరెజ్ కోసం ఒకసారి సిటీ కేబుల్ ఆఫీస్కు ఫోన్ చేశాను. ఆ తర్వాత కొద్ది రోజులకు సిటీ కేబుల్ ఆఫీస్ నుంచి కాల్ చేసి.. 'మీ వాయిస్ చాలా బాగుంది. వాయిస్ ఓవర్గా చేస్తారా' అని అడిగారు. సరే చూద్దామని ఒక రోజు సిటీకేబుల్ ఆఫీస్కు వెళ్లాను. నన్ను చూసిన తర్వాత 'వాయిస్ఓవర్ కాదు న్యూస్ ప్రజెంటర్గా చేయండి' అని అడిగారు. మీడియా అంటే ఉన్న క్రేజ్ .. నన్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు అన్న ఆలోచన నాతో సరే అనిపించేలా చేసింది. దాంతో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్గా ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ.. గుంటూరు సిటీ కేబుల్లో న్యూస్ ప్రజెంటర్గా పార్ట్టైమ్ జాబ్ చేశాను. ఆ తర్వాత న్యూస్ కో ఆర్డినేట్ చేసుకుంటూ న్యూస్ ఎడిటర్గా కూడా పనిచేశాను.
సుమతో కలిసి...
ఈటీవి హర్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం కోసం గుంటూరు వచ్చారు. అక్కడ నేను స్టేజిపై యాంకరింగ్ చేశాను. ఆ టీమ్ ఇచ్చిన ప్రోత్సహంతో ఈటీవి కోసం మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. హైదరాబాద్కు వచ్చి ఈటీవిలో ప్రసారమయ్యే సినీరంజనీ, మనోరంజనీ కార్యక్రమాలకు యాంకర్గా చేశాను. ప్రముఖ యాంకర్ సుమతో కలిసి ఈటీవికి 'రాముడు మంచి బాలుడు' సీరియల్లో నటించాను. హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థల కార్యక్రమాలకు యాంకరింగ్ చేశాను. అప్పుడే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో పరిచయమైంది. ఆమెతో కలిసి ఎల్.వి. ప్రసాద్ ల్యాబ్కు వెళ్లాను. అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ నాయకులు కలిశారు. నా వాయిస్ బాగుంటుందని అభినందించారు.
సూర్యవంశంలో మూడు పాత్రలకు....
నేను డబ్బింగ్ చెప్పిన మొదటి సినిమా సూర్యవంశం. ఈ సినిమాలో మూడు పాత్రలకు నాతో డబ్బింగ్ చెప్పించారు. ముందు ఒక పాత్రకే అనుకున్నాం. అయితే మరో రెండు పాత్రలకు కూడా డబ్బింగ్ అవసరం కావడంతో గొంతు మార్చి.. ఒక రకంగా చెప్పాలంటే మిమిక్రి చేయించారు (నవ్వుతూ) అలా నాకు డబ్బింగ్ చెప్పే అవకాశాలు వచ్చాయి.
నిర్మలమ్మగారితో..
న్యూస్ ప్రజెంటర్గానే కాకుండా యాడ్స్లోనూ నటించాను. డాక్టర్స్ బిస్కెట్స్ యాడ్లో ప్రముఖ నటి నిర్మలమ్మ గారితో కలిసి స్క్రీన్ పంచుకునే అదృష్టం దొరికింది. ఆ తర్వాత దూరదర్శన్ రూపొందించిన 'వైదేహి' సీరియల్లో డాక్టర్ పాత్రలో కనిపించాను. జెమిని టీవి వారి 'స్మైల్ ప్లీజ్', 'సంసారంలో సరిగమలు' లో లీడ్ రోల్ చేశాను. దూరదర్శన్ వారి వసంతరాగాలు, బంధం సీరియల్స్లో నటించాను. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నాను.
టూరిజం కాన్సెప్ట్తో..
చిన్నతనంలో చాలా ఊర్లు తిరగడంతో టూరిజంపై ఇష్టం ఏర్పడింది. ఒకవైపు డబ్బింగ్ మరోవైపు యాక్టింగ్ చేస్తూనే విశ్రం విజువల్స్ సంస్థను ఏర్పాటుచేశాం. టూరిజం కాన్సెప్ట్తో విశ్వం పేరుతో ఎన్నో వీడియోలను పర్యటనలు చేయాలనుకునేవారి కోసం అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ సందర్భంగా అనేక దేశాలలో పర్యటించాను. చాలా తక్కువ బడ్జెట్లో విదేశాలు చేసేలా గైడెన్స్ ఈ వీడియోల ద్వారా ఇచ్చాం. టూరిజం స్పాట్లను హైలైట్ చేయడంతో పాటు ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవనవిధానం తెలియజేసేలా వీడియోలు రూపొందించాం. వీటికి యాంకరింగ్తో పాటు ఎడిటింగ్ కూడా నేనే చేశాను. ఎప్పటికైనా ఎడిటింగ్ టెక్నిషియన్గా పరిశ్రమలో నిలబడాలన్నదే నా లక్ష్యం.
గిరిజనుల జీవితాలను..
'విశ్వం' చేస్తున్నప్పుడు రకరకాల మనుషులను, వారి వైవిధ్య భరితమైన జీవితాలను చూశాను. ప్రతి దేశంలో విభిన్న సంస్కృతి, ప్రజల జీవనవిధానం ఉంటుంది. మనదేశంలోనూ అడవిబిడ్డల జీవితాలను చూసినప్పుడు 70ఏండ్ల స్వతంత్య్రభారతంలోనూ వారు కనీస సదుపాయాలకు నోచుకోని దుస్థితి చూసి బాధ కలుగుతుంది. ఇప్పటికీ ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే కేవలం కాలి నడక ద్వారానే చేరుకోవాలి. వైద్యం, విద్య ఇప్పటికీ వారికి అందడం లేదు. చీకట్లో మగ్గుతున్న వారి జీవితాలపై డాక్యుమెంటరీలు తీయబోతున్నాను. పేపర్లో వస్తున్న వార్తలను కూడా ఫాలో అవుతాను. గిరిజనులపై జరిగిన దాడులు చాలా బాధకలిగించాయి. వాస్తవ పరిస్థితులపై డాక్యుమెంటరీ చేయాలని ఉంది.
జానపదాల సేకరణ..
ఇటీవల ఏటూరునాగారం (మావారి సొంతూరు) వెళ్లివచ్చాం. అక్కడ 75 నుంచి 90 ఏండ్ల మధ్య వయసు వారు చెప్పే మాటలు, పాడే జానపదగేయాలు కొత్త ఆలోచనకు రూపం ఇచ్చాయి. గ్రామీణులు పాడే పాటలను రికార్డు చేయడంతో పాటు విజువలైజ్ చేసే ప్రయత్నం ప్రారంభించాను.
వి. యశోద