Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీ, నెహ్రూల స్వాతంత్ర పోరాటపు వార్తల నుండి, రజాకార్ల ఆగడాలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నది. కమ్యూనిస్టుల పోరాటాన్ని దగ్గరనుంచి చూసింది. సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం వెంకట్రామపురం వాసి జలగం రాధమ్మ. వంద సంవత్సరాల వయసులోనూ తన పనులన్నీ తానే చేసుకునేంత ఆరోగ్యంగా ఉంది. ఆమె పంచుకున్న కొన్ని ముచ్చట్లు...
సాయుధ పోరాట జ్ఞాపకాలు...
నశింపేట నుండి కేసముద్రం, బలపాల, బేతోలు, మేడెపల్లిలో వ్యవసాయం చేసుకుంటూ 40 ఎండ్ల కింద వెంకట్రమాపురంలో సెటిల్ అయినం. అప్పట్లో అడవులు నరికి పోడు వ్యవసాయం చేసేటొల్లం. రజాకార్లు ఆరాచకం చేసేటోల్లు. సాయంత్రం పూట మందల్లెక్క వచ్చి మగ, ఆడ తేడ లేకుండ కొట్టుకుంటు ఉన్నకాడికి దోచుకుని పోయేటొల్లు. వీల్ల ఆరాచకాలకు భయపడి చాలమంది ఊర్లు విడిచిపెట్టి వెళ్లేటోళ్లం. కమ్యూనిస్టులు అడవుల్లో ఉంటూ జీతగాళ్ల, కౌలు రైతుల హక్కుల కోసం కొట్లాడేటోల్లు. దొరల భూముల్లో జెండాలు పాతి.. పేద ప్రజలకు పంచి పెట్టేటోళ్లు. వాళ్ల పాటలకు పిల్లల నుండి పెద్దోళ్ల దాకా అందరం వినేది. మీటింగ్లు ఎంత దూరంలో ఉన్నా బండ్లు కట్టుకొని మరీ పొయ్యేది. పార్టీలో ఆడోళ్లు కొంచెం తక్కువే. కానీ జనానికి ఇబ్బంది ఉందని కబురు పెడితే చాలు వచ్చేటోళ్లు. సైనికుల్ని పంపి నిజామ్ని ఓడించిన్రు. ఆ నాలుగైదు రోజులు ఎవరో ఒకరు ఊర్లోకి వచ్చి 'ఇట్లా కొట్లాట జరిగింది అట్లా జరిగింది' అని చెప్పేవాళ్లు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఉంటుండె. ఏం తెలిసేది కాదు. ఇప్పట్లెక్క టీవీలు, పేపర్లు అప్పుడు లేకపాయె గద.
ముస్లింలే జమ్మికాడ పూజ చేస్తుండే...
మాల, మాదిగ,లంబాడ వాల్లతో పాటు పేద వెలమ, రెడ్లు కూడ అప్పట్ల జీతాలు ఉంటుండే. పొలర పనులు, పిట్టలు కొట్టడం, పశువుల కొట్టం శుభ్రం చేయటం లాంటివి చేసేటోల్లు. కొన్ని ఊర్లల్లొ తురక దొరలు వేల వేల ఎకరాలు కౌలు కు ఇచ్చి పేదోళ్లతో వ్యవసాయం చేెపిచ్చెటోళ్లు. వీళ్లకు గుర్రాలు ఉండేవి. ఊర్లళ్లో అపుడపుడు కవాతు చేసెటోళ్లు. ఊర్లల్లో వీల్లే పెద్దమనుషులుగా వ్యవరిహరించేవాళ్లు. దసరా పండుగ కు జమ్మి చెట్టుకు పూజ చేసెటోల్లు. రజకార్ల లెక్క కాకుండ వీళ్లు జనంతో కలిసిమెలిసి ఉండేటోళ్లు. అప్పట్ల హిందూ, ముస్లిం అని గింతగనం కొట్లాటలు లేకుండె.
ఆరోగ్య రహస్యం...
ఇప్పటిలెక్క మాకు అప్పుడు వరి అన్నం ఎక్కడిది. చిన్నప్పటి నుంచి జొన్నన్నం, రాగులు, సజ్జలు గట్క చేసుకోని తినేది. కొర్రలు వండుకుంటే అన్నం లెక్కనే పుల్లలు పుల్లలు ఉంటుండె. పెసర్లు, ఉలవలు, కందులతో గుగ్గిల్లు, కల్తి లేని పాలు. ఇప్పుడున్నట్టు అప్పుడు పురుగుల మందులు, ఎరువులు ఎక్కడివి? ఇంట్ల పందిళ్లకు కాసిన కూరగాయలే తినేదాయె. దిగుబడి తక్కువున్న మంచి వడ్లు, మొక్కజొన్న, పసుపు ఇట్లా ఎన్నో పండేయి. వడ్లు దంచుకొని తినెటోళ్లం. ఇప్పడంతా వరి అన్నం, రుచి పచిలేని కూరలు. అప్పుడు గోంగూర గోలిచ్చి నూరుకోని తిన్నా ఎంత కమ్మగుండేది. ఇప్పుడు ఎన్నేసి వండినా రుచి, పచి ఉండదు. మా పనులన్నీ మేమే చేసుకునేది. ఇప్పట్లాగా అన్నింటికీ మిషిన్లు లేవు. బండ్లు లేవు. ఎంతదూరమైనా నడక, లేదంటే ఎడ్లబండి. ఇప్పటిలెక్క టీవీలే, రాత్రి పదకొండు పన్నెండింటిదాకా మెలకతోని ఉండుడు ఎక్కడిది? మంచిగ నిద్రపొయ్యేది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉండే గుండె ధైర్యం.. ఇవన్ని కొంత కారణం కావచ్చు. నేను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఆ తిండే కారణం కావచ్చు. నాకు ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. అందరు మంచిగనే ఉన్నరు. చిన్న కోడలు చనిపోవటం వల్ల కొడుక్కి వండిపెట్టుకుంటు ఇక్కడే ఉంటున్న.