Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల నగరాలలో ఒకటిగా పేరుగాంచింది ముంబయి. ఇక్కడి మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పబ్లిక్ టాయిలెట్స్. ఆర్థిక, రాజకీయ, విద్య,ఉద్యోగాల్లో వివక్షను ఎదుర్కొంటున్న మహిళలు మలమూత్రవిసర్జన విషయంలోనూ వివక్షను ఎదుర్కొంటున్నారు. ముంబయి నగరంలో పబ్లిక్ టారులెట్స్ మగవారు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మహిళలు మాత్రం రుసుము చెల్లించాలి. పేద, రోజూ కూలీ మహిళలు డబ్బులిచ్చే స్తోమత లేక మలమూత్రవిసర్ణలను ఆపుకోవడంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. రోజువారీ జీవితంలో అతి మామూలుగా కనిపించే ఈ విషయం మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపే అతి పెద్ద సమస్య. దీనిని గుర్తించారు ముంతాజ్ షేక్. ముంబయి మురికివాడల్లో పుట్టిపెరిగిన ఆమె తన ఉద్యమం ద్వారా బిబిసి గుర్తించిన వందమంది ప్రతిభావంతులైన మహిళల్లో ఒకరుగా నిలిచారు.'డాటర్ ఆఫ్ మహారాష్ట్ర'గా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. రైట్ టూ పీ అంటూ గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యమిస్తూ.. సమాజంలోనూ.. ప్రభుత్వంలోనూ కదలిక తీసుకువస్తున్నారు. ఇప్పుడు ముంబయిలో పైలట్ ప్రాజెక్టుగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 'రైట్ టూ పీ' ఉద్యమకర్త ముంతాజ్ షేక్ తో మానవి..
మీరు ఈ ఉద్యమం వైపు ఎలా వచ్చారు?
నేను ముంబయిలోని అహ్మద్నగర్లో పుట్టి పెరిగాను. ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను. కనీస సదుపాయాలు లేకుండా ఎన్నో వేల మంది బతుకుతున్నారు. 70ఏండ్లు స్వతంత్య్ర భారతంలో మహిళలకు సమానహక్కుల మాట విషయం అటుంచితే మలమూత్రవిసర్ణన విషయంలో చూపించే వివక్ష చాలా పెద్ద సమస్యగా నాకు కనిపించింది. ఇక్కడ ఇంట్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉండవు. పబ్లిక్ టాయిలెట్స్పై ఆధారపడాల్సిందే! పబ్లిక్ టాయిలెట్స్ మగవారు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.. మహిళలు మాత్రం డబ్బులు ఇవ్వాలి. ఇదేంటి అని అడిగితే వారు చెప్పిన సమాధానం మహిళలకు అదనపు సదుపాయాలు కల్పించాలి కాబట్టి డబ్బులు ఇవ్వాల్సిందే! ఈ ప్రభుత్వాలు మహిళకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేవా? అన్న ప్రశ్న ఈ ఉద్యమానికి నాంది అయ్యింది.
మీరు ఈ ఉద్యమాన్ని గత ఆరెండ్లుగా చేస్తున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి మారిందా? ప్రభుత్వం మహిళలకు పబ్లిక్ టాయిలెట్స్ను ఉచితంగా ఏర్పాటుచేసిందా?
మేం ఈ ఉద్యమాన్ని 2011లో మొదలుపెట్టాం. మొదట్లో రెండుమూడేండ్లు ప్రభుత్వం పట్టించుకోలేదు. మహిళకు సదుపాయాలు కల్పించడం, రక్షణ ఇవ్వడం అదనపు బాధ్యతగా భావిస్తున్న ప్రభుత్వాన్ని మా ఉద్యమం ద్వారా నిలదీశాం. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాం. ఇప్పుడు ముంబయి నగరంలో ప్రతి ఇరవై కిలోమీటర్లకు మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. పబ్లిక్ ప్లేస్ల్లోనే కాకుండా మురికివాడల్లోనూ టాయిలెట్స్ను నిర్మిస్తున్నారు. ముంబయిలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన అంబుజావాడిలోనూ 500సీట్ల వరకు టాయిలెట్స్ను కడుతున్నారు.
ఈ ఉద్యమం ప్రారంభంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు? మీకు సహకరించిన వ్యక్తులు, సంస్థలు?
'రైట్ టు పీ' ప్రచారాన్ని మొదలెట్టినపుడు చాలామంది 'ఇది కూడా సమస్యనా?' అంటూ హేళనగా నవ్వారు. మమ్ముల్ని వింతగా చూసారు. మరికొందరు మగవాళ్లు ఎగతాళి చేశారు. అయితే మేం చిన్న విషయంగా కనిపించే ఈ అంశం వారి కుటుంబంలోని ఆడవాళ్ల విషయంలో ఎంత పెద్ద సమస్యగా మారుతుందో వివరించాం. ఆ తర్వాత వారంతా మాకు మద్దతుగా నిలిచారు. మేం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలో కూడా పాల్గొనడం ప్రారంభించారు.నేను పనిచేస్తున్న 'కోరో' సంస్థతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు మా ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఇప్పుడు ముంబాయిలో ప్రతి మహిళ కూడు, గుడ్డ, నీడతో పాటు తనకు గౌరవం కావాలని, వివక్ష వద్దని పోరాడుతున్నారు.
మీ గురించి చెప్పండి..
నాన్న అబుబక్కన్. డ్రైవరు. అమ్మ మదీనా. తమ్ముడు ఉన్నాడు. నేను ఎక్కువగా చదువుకోలేదు. చిన్నతనంలోనే పెండ్లి చేశారు. 16ఏండ్లకే పాప పుట్టింది. పెద్ద కుటుంబం. ఇంటెడు చాకిరీ చేయాల్సిందే! బానిస లాంటి బతుకు. కనీసం టాయిలెట్కు వెళ్లాలన్నా పెద్ద సమస్యే. మనసారా ఏడుద్దామన్నా.. తీరిక లేని జీవితం. అప్పుడు మా వాడకు 'కోరో' సభ్యులు వచ్చారు. ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ.. అవగాహన కల్పిస్తున్నారు. మా సమస్యలు చెప్పడానికి నేను ముందుకు వచ్చేదాన్ని. అలా వారి మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఇంట్లోవారిని ఎదిరించి నేను కోరోలో సభ్యురాలిగా చేరాను. నా సమస్యలు తీరాలన్నా.. నా బిడ్డ భవిష్యత్ బాగుండాలన్నా ఆ ఇంటి నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను. కోరో నాకు అండగా నిలబడింది.
మీరు బిబిసి వరకు ఎలా వెళ్లగలిగారు?
కోరోలో చేరిన తర్వాత చాలా వరకు నా జీవితం మారిపోయింది. లీడర్స్ క్వీస్ట్లో ఫెలోషిప్ కోసం ఎంపికయ్యాను. దీనివల్ల నా చుట్టూ ఉన్న సమాజం గురించి తెలుసుకునే వీలు కలిగింది. నామాదిరిగా సమస్యల సుడిగుండంలో ఉన్న ఎంతో మంది మహిళలను కలుసుకుని వారి గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతమైన మహిళల వివరాలు సేకరణ కోసం కోరో సంస్థకు ఒక అప్లికేషన్ వచ్చింది. స్నేహితులు, కోలిగ్స్ నా వివరాలతో ఆ అప్లికేషన్ నింపి పంపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బిబిసి నుంచి ఉత్తరం వచ్చింది. లండన్ రమ్మని.
డాటర్ ఆఫ్ మహారాష్ట్రగా గుర్తింపు వచ్చినందుకు ఎలా ఫీలయ్యారు?
బిబిసి ద్వారా వచ్చిన గుర్తింపుతో ' రైట్ టూ పీ' నినాదానికి మంచి ప్రచారం లభించింది. బిబిసి లో రావడంతో స్థానిక మీడియా ఫోకస్ పెరిగింది. రైట్ టూ పీ ఉద్యమం ఇప్పుడు ప్రజల చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మేము కేవలం ఉద్యమంలో భాగం మాత్రమే. అప్పటి వరకు మేం చేసిన ఉద్యమాన్ని పట్టించుకోని మీడియా, ప్రభుత్వం బిబిసితో వచ్చిన తర్వాత గుర్తించారు. ఇది నా వ్యక్తిగత గుర్తింపుగా నేను అనుకోను. రైట్ టూ పీ ఉద్యమానికి వచ్చిన గౌరవం. ఇది ప్రజలలో అవగాహనను విస్తరించడానికి సహాయం చేస్తుంది. మహిళల కనీస సదుపాయాలు కల్పించాలన్న ఉద్యమం ఇప్పుడు ముంబయి సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు పాకుతుంది.
మహిళల గౌరవం కోసం ప్రతి మహిళా ఉద్యమించాల్సిందే. ప్రతి మహిళకు గౌరవంగా, సురక్షితంగా ఉండే హక్కు ఉంది. త్వరలో ఈ ఉద్యమం దేశమంతటా వ్యాపిస్తున్నది..స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల నుంచి అదనపు పన్నులను వసూలు చేస్తున్న ప్రభుత్వం వివక్షకు తావు లేకుండా ప్రజలందరికీ సమాన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే.
- వి. యశోద