Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు దశాబ్దాలుగా మహిళల, చిన్నారుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు డాక్టర్ మమతా రఘువీర్. ఏండ్ల పాటు మహిళా, శిశు సంక్షేమంపై పని చేయడంలో ఎదురైన అనుభవాలు ఆమెను 'తరుణీ' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలిగా మార్చాయి. ఆమె సంకల్ప దీక్ష పోలీసువ్యవస్థ ఎన్జీవోలతో కలిసి పనిచేసేలా ప్రేరేపించింది. బాధితులకు బాసటగా 'భరోసా' ప్రారంభమైంది. మహిళల, చిన్నారుల హక్కులకు ఎక్కడ భంగం కలిగినా.. అక్కడ ఆమె ఉంటారు. సమస్యను వినడమే కాదు.. చట్టపరమైన పోరాటం చేస్తున్నారు. బాధితులు బాధతో కుంగిపోకుండా తమ కాళ్లపై నిలబడేలా విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో శిక్షణనిస్తూ.. అతివలకు అండగా నిలుస్తున్నారు. ' నో ఉమెన్.. నో వరల్డ్ ' అన్న స్లోగన్తో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటం చేస్తున్న ఆమెతో మానవి..
నేను పుట్టింది నల్లగొండలో. నాన్న ఆచంట సద్గురు ప్రసాద్ న్యాయాధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అమ్మ డాక్టర్ హేమలత దేవి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహిళా కాలేజీలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా రిటైర్ట్ అయ్యారు. నా చదువంతా హైదరాబాద్లోనే కొనసాగింది. స్కూల్లో ప్రతి క్లాస్లో నేనే లీడర్, నేనే క్లాస్ ఫస్ట్. చదువుల్లోనూ, ఆటల్లోనూ, ఇతర పోటీల్లోనూ ఎప్పుడు ఫస్ట్ వచ్చేదాన్ని. డాక్టర్ కావాలనుకున్నారు. కానీ నిజాం కాలేజీలో జెనెటిక్స్లో పిజీ పూర్తి చేశాను. సివిల్స్ రాశాను. కానీ రాలేదు. అటవీశాఖలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారి రఘువీర్తో పెండ్లి అయ్యింది. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా పనిచేశాను. దాని ద్వారా హైదరాబాద్లోని మురికివాడల్లో పనిచేసే అవకాశం, వారి సమస్యలు తెలుసుకునే వీలు కలిగింది. మా వారికి వరంగల్కు బదిలీ కావడంతో జాబ్కు రిజైన్ చేసి వరంగల్కు వెళ్ళిపోయాం.
ఇంటి నుంచే ప్రారంభం..
ఇంట్లో ఉన్నా నా మనసు మాత్రం ఏదో చేయాలని ఆరాటపడేది. ఒకరోజు మా ఇంట్లో పనిచేసే ఆమె తన 12ఏండ్ల బిడ్డను తనతో పాటు పనికి తీసుకువచ్చింది. 'పిల్లను ఎందుకు తీసుకువచ్చావు?' అని అడిగాను, 'మాకు ముగ్గురు ఆడపిల్లలు.. ఇంకా చిన్నవాళ్లు ఇద్దరు ఉన్నారు. వారిని సాకాలంటే నేను ఒక్కదాన్ని పనిచేసే సరిపోదు కదమ్మా. నాకు తోడుగా పనిచేస్తదని పిల్లను కూడా తీసుకువచ్చిన' అంది. వెంటనే నేను ఆ పిల్లను బడిలో చేర్చుదామని గవర్నమెంట్ స్కూలుకు వెళ్ళిన. అక్కడ ఆడపిల్లల పరిస్థితి చూసి ఆరోగ్యం, ఆహారం విషయంలో వారికి కౌన్సిలింగ్ అవసరం అనిపించింది. వరంగల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్ళి ఉచితంగా కౌన్సిలింగ్ క్లాసులు తీసుకోవడం ప్రారంభించాను. 10 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా పనిచేసేలా మా అమ్మతో కలసి చర్చించి 'తరుణి' స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. బడి మానేసిన ఆడపిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి బడిలో చేర్చడం, ఆడపిల్లలో ఎనీమియాను అరికట్టేలా వారికి ప్రభుత్వ సహకారంతో ఐరన్ మాత్రలు ఇవ్వడం, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునేలా ప్రోత్సహించాం. మా ఇంట్లో పనిచేసే అమ్మాయితో ప్రారంభించిన 'తరుణి' ద్వారా ఇప్పుడు వేలాది మంది ఆడపిల్లలు చదువుకుంటూ తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు.
బాల్యవివాహాలు..
స్కూళ్లకు వెళ్ళి ఆడపిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో బాల్యవివాహాల సమస్య నా దృష్టికి వచ్చింది. ఐదోతరగతి చదువుతున్న అమ్మాయికి పెండ్లి చేస్తే ప్రయత్నం చేసే మేం వెళ్ళి ఆపాం. ఈ సమస్యపై పనిచేసేలా 'బాలికావేదిక' ను ఏర్పాటుచేసి అవగాహన కల్పించాం. దాంతో ఎక్కడ బాల్యవివాహాలు జరిగినా మాకు సమాచారం వచ్చేది. మూడు నెలల్లోనే దాదాపు 40పెండ్లిలను ఆపాం. చాలా మంది నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నా.. ప్రజల్లో అవగాహన లేదు. అంతేకాదు ఆ చట్టం ప్రకారం శిక్ష, జరిమానా చాలా తక్కువగా ఉన్నాయన్న విషయం తెలుసుకున్నాం. ముందుగా చట్టాన్ని బలోపేతం చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూ.. మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించాం. జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి.. పార్లమెంటరీ కమిటీ వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి 2006లో కొత్తచట్టం వచ్చే వరకు పోరాటం చేశాం. ఈ చట్టం ద్వారా బాల్యవివాహాలకు ఎవరు సహకరించినా.. చివరకు మంత్రాలు చదివే బ్రాహ్మణుడిపై కూడా కేసు పెట్టవచ్చు. ఈ చట్టంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి బాల్యవివాహ నిరోధక కమిటీలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం. దాంతో చాలావరకు బాల్యవివాహాల సంఖ్యను తగ్గించాం. అయితే పెండ్లి ఆపగానే సరిపోదు.. ఆ అమ్మాయికి ఆర్థికంగా నిలబడే భరోసా ఇచ్చేలా వరంగల్లోని ఎన్ఐటీ, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వృత్తివిద్యాకోర్సులు నేర్పించాం.
బాల్యవివాహాల సమస్యపై పనిచేస్తున్నప్పుడే వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా నియమించారు. వందలాది గ్రామాల్లో తిరిగి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాం. ముఖ్యంగా ఇటుక, జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న పిల్లలకు విముక్తి కల్పించాం. మైనర్ బాలికల ప్రేమవివాహాలు, అక్రమ రవాణా వంటి సమస్య పరిష్కారానికి కృషి చేశాం.
మహిళ, బాలల హక్కుల పరిరక్షణపై యుఎస్ ప్రభుత్వం నిర్వహించిన మూడువారాల శిక్షణకు నేను ఎంపికయ్యాను. ఈ శిక్షణ 'భరోసా' సెంటర్ ఏర్పాటు చేయడానికి నాకు ఎంతో ఉపయోగపడింది. అక్కడ చిన్నారులపై లైగింక దాడులు జరిగినప్పుడు వారికి కోర్టుకు తీసుకువెళ్లరు. జడ్జియే వారి వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుంటారు. చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో వారితో ఇంటరాక్ట్ అవుతారు. ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు భరోసా సెంటర్లో కూడా ఈ విధమైన వాతావరణం క్రియేట్ చేశాం. త్వరలోనే పిల్లల కోసం ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేస్తున్నాం. ఈనెల 20న(బాలల హక్కుల దినోత్సవం) బాలబాలికలతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నాం.
గర్ల్స అడ్వకసీ అలయెన్స్
సమాజంలో నేరాల సంఖ్య పెరిగింది. రూపు మారింది. కొత్త చట్టాలు వచ్చినా.. లీగల్ ప్రోసీజర్ డిలే అవుతోంది. ఈ కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. వీటిని నివారించడానికి గర్ల్స్ అడ్వకసీ అలయెన్స్ ఏర్పాటుచేశాం. దాదాపు 500 ఎన్జీవోలతో కలిసి మహిళ సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. పెండ్లి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కచోటే లభించేలా ఏర్పాటుచేసిన భరోసా ద్వారా ఇప్పటివరకు దాదాపు 2800 కేసులు నమోదు చేశాం. వాటిలో మూడువందల కేసులు లైంగిక దాడులకు సంబంధించినవే.
తరుణీ స్వేచ్ఛ..
కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ బాలికలు కాలినడకన స్కూలుకు వెళ్తూ కనిపించారు. 500మంది బాలికలకు సైకిళ్లు ఇవ్వాలనుకున్నాం. ఇప్పటివరకు వందమందికి ఇచ్చాం. సైకిల్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లల్లో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. వారి జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. దీనిని గమనించి పట్టణ ప్రాంతాల్లో కాలేజీ పిల్లలకు టూవీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గత వారం తరుణీ స్వేచ్ఛ పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ వారం 36మంది తన పేర్లు నమోదు చేసుకున్నారు. హీరోహౌండా సహకారంతో ఈ శిక్షణ ఇస్తున్నాం.
కుటుంబ సహకారంతోనే..
న్యాయాధికారిగా పనిచేసిన నాన్న ఇచ్చే సూచనలు, జర్నలిజం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసిన అమ్మ ప్రోత్సాహం, సివిల్ సర్వెంట్గా పనిచేసిన భర్త సహకారం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదిగిన కొడుకులు చేసే సాంకేతిక సహాయం అన్నీ కలిసి సమాజంలోని సమస్యలపై పోరాడే శక్తిని ఇస్తున్నాయి.
- వి. యశోద