Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరఠ్వాడా రైతులు చేస్తున్న పోరాటం గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసు. ఎందుకంటే ఈ పోరాటం గురించి మీడియాలో ఎంతో కొంత సమాచారం జనం వరకు వెళుతుంది. కానీ అదే రాష్ట్రంలో దళిత మహిళా రైతులు చేస్తున్న పోరాటం గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఎందుకంటే వారు మహిళలు కాబట్టి. మహిళలు హక్కుల కోసం పోరాడుతుంటే పెద్దగా పట్టించుకోరు. అక్కడి మహిళలు వారి (గైరన్) పశువుల మేతకు సాగుచేసే భూమి కోసం ఐక్యంగా పోరాడుతున్నారు. వారిలో కాంతాబాయి ఇచకే కూడా ఒకరు.
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం నిత్యం కరువుతో అల్లాడుతున్నది. అక్కడి రైతులు అప్పుల బాధను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. ఎప్పుడు తమ వారిని కోల్పోతామో అని ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు.
ఎగతాళి చేసినా...
రైతు ఒక దళితుడైతే ఇక అతని పరిస్థితి దుర్భరం. బతుకు కోసం అనుక్షణం పోరాటం చేయక తప్పదు. కాంతాబాయి అనే ఓ దళిత మహిళా పోరాట జీవితం కూడా ఇలాగే మొదలయింది. అక్కడ భూమి హక్కు కోసం పోరాటం చేస్తున్న మహిళా లోకానికి 70 ఏండ్ల ఈ కాంతాబాయి నాయకత్వం వహిస్తున్నది. ఈ మహిళలంతా కలిసి కాంతాబాయి నాయకత్వంలో ఎండి బీడుగా మారిన గైరన్(సాధారణ మేత క్షేత్రాలు) సాగు చేయడం మొదలుపెట్టారు. వీరు చేస్తున్న ఈ పనిని చూసి మొదట్లో చాలామంది ఎగతాళి చేశారు. వెకిలిగా నవ్వుకున్నారు. తమ పనిని ఎంత మంది సరదాగా తీసుకున్నా వీరు మాత్రం గట్టిగా నిలబడ్డారు. కష్టపడి పని చేసి ఎండిన ఆ బీడు భూమిని పచ్చని పంటపొలాలుగా మార్చేశారు. పశువులకు మేత సమకూర్చుకున్నారు.
మహిళలను చైతన్య పరిచి
పట్టుదలతో దళిత మహిళలు సాధించిన ఈ విజయం గ్రామంలోని అగ్రకులం వారి కంటగింపుగా మారింది. ఎలాగైనా ఆ భూములను లాక్కోవాలని దళిత వాడలపై దాడి చేశారు. పండించిన పంటలను నాశనం చేశారు. పిల్లలు, పెద్దలపై విరుచుకుపడ్డారు. అయినా వారిని గైరన్ భూమి నుంచి వేరు చేయలేకపోయారు. అలాంటి సమయంలో కాంతాబాయి భూ హక్కుల పోరాటాన్ని ప్రారంభించింది. మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలలోని దళిత రైతుల భూ హక్కు కోసం ప్రముఖ దళిత నాయకుడైన ఏక్నాథ్్ ఆజాద్ ప్రారంభించిన పోరాటంలో నుంచి బయటకు వచ్చిన ఓ గొంతుక కాంతాబాయి. భూమి హక్కు ఉద్యమంలో ముందంజలో నిలబడింది. మహిళలను చైతన్య పరిచింది. అగ్రకుల పెత్తనానికి ఎదురుతిరిగింది.
భూమి మా హక్కు
తాము చేస్తున్న పోరాటం గురించి కాంతాబాయి మాట్లాడుతూ ''ఇప్పుడు మేం చేస్తున్న పోరాటం కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు. ఈ భూమి మా హక్కు. అంటే మేం మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వానికి మేం భయపడడం లేదు. మా భూమి మాకు దక్కే వరకు ధైర్యంగా పోరాడతాం. ప్రభుత్వం ఈ భూములను మా పేర్లపై మార్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. పశువుల మేత కోసం సాగు చేసే ఈ భూమిని మేం ఏ మాత్రం వదులుకోం. మనుషుల ప్రాణాల కంటే పశువులకు విలువనిచ్చే ఈ ప్రభుత్వాలకు పశువులపై కూడా ప్రేమ పోయిందా?'' అని ప్రశ్నిస్తున్నారు.
చారిత్రక ఆధారాలు
స్వాతంత్రోద్యమ కాలంలో మరఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. ఈ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం నవాబు ఆనాడు దళితులు తమ పశువులను మేపుకోవడానికి గైరన్ భూములను వారికి ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో ఈ భూములు గ్రామ పంచాయితీ పరిధిలోకి చేరాయి. 1990లో జమీన్ అధికార్ ఆందోళన్(జేఏఏ) అనే సంస్థ ఏర్పడి ఈ భూములు దళితులకు చట్టబద్దంగా చేయాలని, భార్య, భర్తలకు సమానంగా పంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జేఏఏ కార్యకర్త అయిన టాంగడే నేతృత్వంలో, కాంతాబాయి నాయకత్వంలో మహిళలు భూమి హక్కు కోసం పోరాటం చేస్తున్నారు.
స్ఫూర్తిదాయకం
ఆ గ్రామంలో కాంతాబాయితో పాటు ఎంతో మంది మహిళలు స్వయం సహాయక గ్రూపుల్లో, మైక్రో ఫైనాన్స్ వారి వద్ద రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలన్నింటికి పరిష్కారం దొరకాలంటే భూమిపై హక్కు సాధించడమే వారి తక్షణ కర్తవ్యం. ఏది ఏమైనా కాంతాబాయి నాయకత్వంలో అక్కడి దళిత మహిళా రైతులు చేస్తున్న పోరాటం భారతదేశానికే స్ఫూర్తిదాయకం. వారు తమ పోరాటంలో విజయం సాధించాలని కోరుకుందాం. మరఠ్వాడా మహిళల పోరాట ఫలితంగా ఇప్పటికైనా దేశంలో దళితుల పట్ల జరుగుతున్న అమానుషాల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాలి.