Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆరోగ్యానికి అరటిపండు' అనుకుంటూ పండును తిని, తొక్కను పడేస్తారు. కానీ దాని తొక్క కూడా మొక్కలకు ఎంతో మేలుచేస్తుందని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. మొక్కలకు ఉపయోగపడే పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి పలు రకాలైన మూలకాలు అరటిపండు తొక్కలో సమృద్ధిగా ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందామా..?
ఒక తొట్టిలోమట్టి వేసి అందులో అరటిపండు తొక్కలను కలిపేయాలి. వారం రోజుల్లోపే వీటిలో ఉండే పోషకాలు మట్టిలో కలిసిపోతాయి. అందులో మొక్కను లేదా విత్తనాన్ని నాటితే ఏపుగా పెరుగుతుంది.
ఒక బకెట్టులో నాలుగు మగ్గుల నీళ్లు పోసి అందులో అరటిపండు తొక్కలను వేసి మూతపెట్టాలి. రెండు మూడు రోజులకు నీళ్లలో తొక్కలు బాగా వూరిపోతాయి. దీన్ని వారానికోసారి పెరట్లో మొక్కలకు పోయాలి. మొక్కలకు పోసే ప్రతీసారీ ఈ నీటికి అయిదు రెట్లు సాధారణ నీరు కలపాలి. దీంతో పొటాషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా అంది, మొక్కలు బలంగా ఎదుగుతాయి.
అరటిపండు తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకుని తొట్టిలో నెలకొకసారి వేసుకుంటే మొక్కలకు మంచి ఎరువు అవుతుంది.
ఈ తొక్కలకు కోడిగుడ్ల పెంకులను కలిపి ఎండబెట్టి రెండింటినీ కలిపి పొడి చేయాలి. ఇందులో కొంచెం ఉప్పూ, నీరు కలిపి స్ప్రే సీసాలో తీసుకుని మొక్కలపై చల్లితే పురుగుల బాధ తగ్గి పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
అరటిపండు తొక్కలను ముక్కలుగా చేసి, వాటికి నారింజపండు తొక్కలను కలిపి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. తొట్టెలోని మట్టిలో, మొక్కలు నాటే ప్రాంతంలో ఈ పొడిని ముందుగా చల్లుకుని, ఆ తరువాత మొక్కలు నాటుకోవాలి. అటు అరటి, ఇటు నారింజ వీటిలోని మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు ఏ మొక్కనైనా ఏపుగా ఎదిగేలా చేస్తాయి. ౖ