Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్. ప్రపంచ ఆరోగ్య సంస్థకి డిప్యూటీ డైరెక్టర్గా ఎంపికైన తొలి భారతీయ మహిళ. డబ్యూహెచ్వోలో ఇది రెండో అత్యున్నత పదవి. గత వందేండ్లలోలో ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ సౌమ్య. తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొంది, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, అరుదైన గౌరవం పొందారు. ఆ ఘనతని సాధించిన సౌమ్య స్వామినాథన్ ప్రస్తుతం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి డైరెక్టర్ జనరల్.
చెన్నైలో 1959 మే 2వ తేదీన పుట్టిన సౌమ్య... డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, మీనా స్వామినాథన్ ముగ్గురు కుమార్తెల్లో ఒకరు. తల్లి మీనా విద్యావేత్త. తండ్రి అందరికీ సుపరిచితుడైన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు. తల్లిదండ్రులిద్దరే ఆమెకు స్ఫూర్తి. ఆయనకి ఏమాత్రం సంబంధం లేని రంగాన్ని ఎంచుకున్నది. కానీ పని పట్ల అంకిత భావం, నిబద్ధతను మాత్రం ఆయననుంచే పుణికి పుచ్చుకున్నది. 58 ఏళ్ల సౌమ్యా స్వామినాథన్ బాల్యమంతా మేధావుల సాంగత్యంలోనే గడిచింది. ఈమె తండ్రి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కావటంతో ఇంటికి నోబెల్ గ్రహీత సి.వి రామన్, మరో ప్రైజ్ విన్నర్ నోర్మన్ బోర్లాగ్ వచ్చిపోతూ ఉండేవారు. సౌమ్య మీద ఆ మహానుభావుల ప్రభావం చిన్నతనం నుంచే మొదలైంది.
పరిశోధనలతో...
పుణేలో మెడిసిన్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో ఎమ్డి చదివి, తర్వాతి శిక్షణ కోసం అమెరికా వెళ్లారామె. లాస్ ఏంజిల్స్లోని పిల్లల ఆస్పత్రిలో నియో నాటాలజీ, పీడియాట్రిక్ పల్మనాలజీలో ఫెలోషిప్తో కూడిన శిక్షణ తీసుకున్నారు. 1992లో చెన్నైలోని ట్యుబర్క్యులోసిస్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధకురాలిగా చేరారు. అక్కడే దాదాపు 23 ఏళ్లపాటు పరిశోధనల్లో గడిపారు. పీడియాట్రిషియన్గా, క్లినికల్ సైంటిస్ట్గా ఆమె గుర్తింపు పొందారు. అలా వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఫలితంగా, భారతీయ హెల్త్ డిపార్ట్మెంట్ (రీసెర్జ్)లో సెక్రటరీగా, ప్రతిష్టాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐ.సి.ఎం.ఆర్)కు డైరెక్టర్ జనరల్గా అత్యున్నత పదవులు అలంకరించారు. తిరుగులేని తన సామర్థ్యంతో 32 పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. టీబీ వ్యాధిపై చేసిన పరిశోధన సౌమ్య స్వామినాథన్కు మంచిపేరు తెచ్చింది. ఐసీఎమ్మార్ వందేళ్ల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన రెండో మహిళ సౌమ్యే!
అవార్డులు...
చదువుకునే రోజుల్లోనే 1980లో అండర్ గ్రాడ్యుయేట్ లెవల్లో 'ఆల్రౌండ్ ఔట్గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'గా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ను పొందారు. 2008లో ఐసిఎమ్ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నుంచి క్షణిక ఆరేషన్ అవార్డు అందుకున్నారు. 2012లో తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు పొందారు.
గొప్ప అవకాశం..
''క్షయలాంటి జబ్బులు పేదరికం వల్లనే వస్తాయి. దేశంలో పేదరిక నిర్మూలనే నా ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రజల్ని అక్షరాస్యులను చేయాలి. ఈ ఉద్దేశంతోనే ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలకు సూచనలు, సలహాలు ఇస్తుంది. మిగతా వారికన్నా భిన్నంగా పనిచేసే సామర్థ్యం నాకుంది. ఎందుకంటే మిగతావారికి థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. జబ్బుల సంగతి, అవి ఎందువల్ల వస్తున్నాయి? నిర్మూలించడానికి అనుసరించాల్సిన విషయాలేంటి? అనేవి ప్రాక్టికల్గా నాకు అనుభవంలో ఉన్నాయి. ఇప్పటివరకూ డబ్యూహెచ్వో పరిశోధన కోసం మద్దతు అందిస్తోంది. ఇండియాలో పేదలకు మందులు అందుబాటులో లేవు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా అవసరమైన చొరవ తీసుకుంటాను. భారత దేశాన్ని రోగాలు లేని దేశంగా ఉంచటానికి కృషి చేస్తాను. . ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన వనరులను కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకనే అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదదేశాలుగానే ఉంటున్నాయి. మౌలిక సదుపాయాల్ని కల్పించగలిగితే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టే. ఔషధాల విస్తరణ వ్యాపార ప్రయోజనాలకు సంబంధించింది. ఔషధాలను మెరుగుపరచడానికి, వినియోగాన్ని మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తా. క్షయ వ్యాధి నివారణపై గతంలో పరిశోధనలు చేశాను. టీబి వ్యాప్తిని నియంత్రించడానికి ఇపుడు మరింత అవకాశం వచ్చినట్టే'' అంటారామె.