Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపికా పడుకునే. తన నటనతో, అందంతో బాలీవుడ్లోనే కాదు... హాలీవుడ్లోనూ కీర్తి గడించిన హీరోయిన్ హీరోలకే పరిమితమైన వందకోట్ల రికార్డులను ఐదు వరుస సినిమాలతో తన పరం చేసుకున్న నటి. వ్యక్తిగత విషయాలనెప్పుడూ వృత్తి జీవితంలోకి రానివ్వలేదు. ప్రేమలో విఫలమైతే జీవితమే అయిపోయిందనుకునే సగటు అమ్మాయిలా ఆలోచించక... తనకంటూ జీవితం ఉందని సాగిపోయింది. అందుకే సక్సెస్ వచ్చి ఆమె సరసన చేరింది. స్టార్ హీరోయిన్గా మారింది. అలాంటి నటి ఇప్పుడు బెదిరింపులకు గురవుతోంది. పద్మావతి సినిమాలో నటించినందుకు గాను 'ముక్కు కోస్తాం' అన్న హెచ్చరికలను ఎదుర్కొంటోంది. అయినా 'ఎవరికీ భయపడను, వేటికీ వెరవను' అని ధీమాగా చెబుతోంది.
సంజరులీలా బన్సాలీ దర్శకత్వంలో, దీపికా పడుకొనే, షాహిద్కపూర్, రణ్వీర్సింగ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా పద్మావతి. శ్రీ రాజ్పుట్ కర్ణిసేన తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నది. ఇదే ఏడాది జనవరి నెలలో షూటింగ్ స్పాట్పై దాడి కూడా చేసింది. సెట్లను తగులబెట్టింది. అసలు చిత్రం పేరు 'రాణి పద్మిని'. వ్యతిరేకత వచ్చిన తరువాత డైరెక్టర్ పేరును 'పద్మా వతి'గా మార్చాడు. అఫీషియల్ ట్రయలర్ రిలీజ్ అయిన తరువాత... రాజ్పుట్లను అగౌరవపరిచేవిధంగా ఉందంటూ రాద్ధాంతం చేస్తున్నది సంఫ్ుపరివార్. వాళ్లు సినిమానూ చూడలేదు. స్కిప్ట్ర్ చదవలేదు. నిజాలేమిటన్నది వాళ్లకు అవసరం లేదు. ఫేస్బుక్లో ఎవరైనా పోస్టు పెడితేనో, వాట్సప్లో ఇంకెవరైనా మెసేజ్ పంపితేనే అదే నిజమని నమ్మే రోజులు. అలా పద్మావతి సినిమా ఫస్ట్లుక్, తరువాత ట్రయలర్ విడుదలైంది. అందులో రాణి పద్మిని పాత్రలో దీపిక అందరి ప్రశంసలు అందుకుంటోంది. కానీ రాజ్పుట్ కర్ణిసేన మాత్రం దీపికను 'బజారు'ది, 'నాట్యకత్తె', 'రామాయణంలో శూర్పణఖలాగా నీ ముక్కుకోస్తాం' అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంకొందరైతే భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే ఐదు కోట్ల రూపాయలు బహుమతి ఇస్తామని రెచ్చిపోయి ప్రకటిస్తున్నారు. తమ మహారాణి పద్మిని వ్యక్తిత్వాన్ని పలుచన చేశారని, రాజ్పుట్ల చరిత్రను వక్రీకరిస్తున్నారని వాపోతున్నారు.
పెచ్చుమీరిన అసహనం
మహిళగా రాణి పద్మినికి కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. కానీ... మహారాణి గౌరవం అంటూ... దీపిక కూడా ఒక మహిళే అన్న విషయాన్ని మర్చిపోతున్నది సంఘపరివార్. శూర్పణఖలా ముక్కు చెవులు కోస్తామని బెదిరిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్లారు. రెండు కోర్టులు కేసును కొట్టివేసిన తరువాత ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది దేశం సిగ్గుపడాల్సిన చర్య. దేశంలో ఎంత అసహనం నెలకొని ఉందో చెప్పడానికి ఉదాహరణ. తమకు కాస్త వ్యతిరేకంగా ఉందనిపిస్తే పుస్తకాలను నిషేధించాలంటారు. సినిమా విడుదలను అడ్డుకుంటారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ప్రజాస్వామిక వాదులపైనా, కళాకారులపైనా ఈ దాడి పునరావృతమవుతోంది. అందులో భాగమే దీపికపైనా దాడి. ఇందులో కేవలం ఒక భావజాలం మీద వ్యతిరేకతే కాదు... ఎన్నో వేల ఏండ్లుగా పాతుకుపోయిన పురుషాధిక్యత కనిపిస్తోంది.
గౌరవం కాదు, ఆధిపత్యం...
రాణి పద్మిని పాత్రపై వాళ్ల అభ్యంతరం... చరిత్ర మీద గౌరవంగా కనిపించడం లేదు. 'సినిమాలో రాణి పద్మిని పాత్ర డ్యాన్స్ చేసింది. రాజ్పుట్ వంశ మహారాణులు డ్యాన్స్ చేయరు' అన్నది వారి వాదన. అంటే వీళ్లకు డ్యాన్స్ చేసినవాళ్లంటే చాలా చిన్నచూపు. రెండోది మహారాణి డ్యాన్స్ చేయకూడదు. అంటే ఆమెకు ఓ ఇష్టం ఉండకూడదు. అసలు అటువైపుగా ఆలోచనలు చేయకూడదు. ఏ స్థానంలో ఉన్న మహిళ అయినా ఆయా పురుషులు నిర్ణయించే గౌరవ, మర్యాదల మేరకు మాత్రమే నడుచుకోవాలి. ఒకవేళ తానుతానుగా ప్రవర్తిస్తే ఏ బజారుదానివంటారు. నాట్యకత్తెను చేసి తక్కువగా చూస్తారు. మహిళలు ఎలా ఉండాలో? ఏం మాట్లాడాలో? ఎలాంటి బట్టలు ధరించాలో అన్నీ వీళ్లే నిర్ణయిస్తారు.
బెదరకుండా...
ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నవాళ్లంతా విశృంఖలంగా నిర్మితమవుతున్న అశ్లీల చిత్రాల గురించి ఏనాడూ నోరు మెదపరు. సినిమాల్లో పొంగిపొర్లుతున్న అశ్లీల బురద గురించి ఏనాడూ మాట్లాడలేదు. మహిళలను కేవలం ఆటబొమ్మల్లా చిత్రీకరిస్తున్న వైనాన్ని ఏనాడూ ప్రశ్నించలేదు. ప్రశ్నించరు. కానీ... చారిత్రతాత్మక, సందేశాత్మక చిత్రాలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరిస్తారు. అయితే వీటికి ఎక్కడా బెదరడం లేదు దీపిక. హెచ్చరికల నేపథ్యంలో దీపికాకు ముంబై పోలీసులు భద్రత పెంచారు. సినిమా విడుదల రోజున సొంత రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రత ఏర్పాటు చేస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కలలో కూడా ఊహించలేదు...
దీపిక కోపెన్హాగన్లో పుట్టింది. బెంగళూరులో పెరిగింది. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. తండ్రి ప్రకాశ్ పడుకొనే, తల్లి ఉజ్వలా పడుకొనే. తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్. దాంతో చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ మీద ఇష్టం పెంచుకుంది. తరువాత గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని కలలు గన్నది. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు పూర్తిగా అంగీకరించారు. కింగ్ ఫిషర్ నుంచి 'మోడల్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్న తరువాత దశ తిరిగింది. హిమేష్ రేషమియాతో కలిసి 'నామ్ హై తేరా' వీడియో ఆల్బమ్ చేసింది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో మెరుగులు దిద్దుకుంది. క్యాలెండర్ మోడల్గా కెరీర్ మొదలుపెట్టి, తరువాత మ్యూజిక్ వీడియోల్లో నటించి... షారుక్ఖాన్తో మొదటి సినిమా చేసింది. 'ఓమ్ శాంతి ఓమ్' నుంచి త్వరలో విడుదల కాబోతున్న 'పద్మావతి' వరకు సెల్యులాయిడ్పై తనదైన మార్క్ వేసింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. సంజరులీలా బన్సాలీ హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించలేదు. అలాంటిది.. ఒక్క సంజరులీలా బన్సాలీ ఏంటి? బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ... ప్రతి డైరెక్టర్ తన సినిమాలో ఉండాలని కోరుకునే హీరోయిన్గా మారిపోయింది. తెల్లగా ఉండటమే అందం అనుకునే ఇండిస్టీ మూస ధోరణిని బద్దలు కొట్టింది. దక్షిణాది చామనఛాయతో మ్యాగజైన్ కవర్స్, బ్యూటీ ప్రాడక్ట్స్కు ప్రచార కర్తగా మొదలుపెట్టి స్ట్టార్ హీరోయిన్గా ఎదిగింది.
రిస్క్తోనే సక్సెస్...
పెద్ద పెద్ద హీరోలకు మాత్రమే పరిమితమైన వందకోట్ల మార్కెట్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఆమె నటించిన ఐదు సినిమాలు వందకోట్లను దాటాయి. హీరోయిన్లు అనగానే ఐటమ్సాంగ్స్, సెక్సీ దుస్తులు, చూడచక్కగా కనిపించడమే అనే విమర్శను తప్పని నిరూపించింది. కాక్టెయిల్లో వెరోనికాగా, యే జవానీ హై దివానీలో నైనా తల్వార్గా, చెన్నై ఎక్స్ప్రెస్లో మీనమ్మగా తనదైన నటనను ప్రదర్శించింది. హిందీ సినిమాలతో ఇండియాలో స్టార్డమ్ సంపాదించుకున్నా... తన టాలెంట్ తెలియని హాలీవుడ్లోకి ప్రవేశించింది. అలా ప్రయోగాలెందుకు చేయాల్సివచ్చిందంటే... 'రిస్క్ తీసుకోకుండా సక్సెస్ ఎప్పుడూ ఉండదు. చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి చేస్తూ పోతుంటేనే, అడుగు ముందుకు వేస్తుంటేనే వ్యక్తిగతంగా అభివృద్ధి అవుతాం. రిస్క్ చేయడానికి సిద్ధంగా లేకపోతే నువ్వెప్పుడూ కొత్తవి నేర్చుకోలేవు. ఏదైనా సాధించగలవని ఎప్పటికీ తెలుసుకోలేవు' అని చెబుతుంది.
కథకు కనెక్ట్ అయితేనే...
సక్సెస్ వచ్చినప్పుడు తలకెక్కించుకోను. గర్వపడటం కంటే ఆనందపడటం మంచిది. సక్సెస్తో బాధ్యత పెరుగుతుంది. విజయం తాత్కాలికమే. కష్టపడితే చాలు ఫలితం దానంతట అదే వస్తుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తోచేశాను, కొత్తవాళ్ల సినిమాల్లోనూ నటించాను. డైరెక్టర్స్ను బట్టి సినిమా ఎప్పుడూ ఎంచుకోను. కథకు కనెక్ట్ అయితేనే ఒప్పుకుంటాను. నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు. 'అది వేసుకోకు, అక్కడికి వెళ్లకు' అంటూ నిబంధనలు పెట్టలేదు. అలాగని పిల్లలను వదిలేయాలని కాదు. తల్లిదండ్రులు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే పిల్లలు వాళ్లుగా ఎదుగుతారు.
న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
'మనదేశంలోని న్యాయవ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహిళగా, నటిగా నేను ఆ సినిమా కోసం రెండేండ్ల జీవితాన్ని వెచ్చించాను. ఇప్పుడు సినిమా చూడక ముందే దాడి చేస్తుంటే బాధగా ఉంది. కోపం కూడా వస్తోంది. మన దేశం తిరోగమిస్తున్నదా? పురోగమిస్తున్నదా అర్థమవ్వడం లేదు. ఒక్కోసారి వీళ్ల ప్రవర్తన నవ్వు తెప్పిస్తోంది. ఏదేమైనా సరే.. సినిమా విడుదలను మాత్రం ఎవ్వరూ ఆపలేరు. 'దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ సృజనకారులకు కళాకారులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ప్రజలకు కూడా తమ భావాలను ప్రకటించే స్వేచ్ఛ ఉంది. కానీ సినిమా చూడకుండానే ఎలా ఓ నిర్ణయానికొచ్చి సినిమాను వ్యతిరేకిస్తారు. రాణి పద్మిని చరిత్రను ఈ దేశానికే కాదు... ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి సినిమాలో నటిస్తున్నందుకు నేను గర్వ పడతాను. ఏదేమైనా నేను భయపడేది లేదు'
- కట్ట కవిత