Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మావతి సినిమా ప్రారంభించిననాటి నుంచి వివాదాలమయం అవుతూనే ఉంది. అక్కడి రాజ్పుట్లు సినిమాలోని ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేస్తూనే ఉన్నారు. రాణి పద్మావతిని అగౌరవపరుస్తున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. 'రాణులను గౌరవించాల్సిందే. మహిళల పట్ల ఆపాటి గౌరవం ఉండాల్సిందే! అయితే ఎప్పుడో గతించిపోయిన మహారాణి గురించి మాట్లాడుతున్నారు.. కానీ ఇప్పుడు రాజస్థాన్లో నెలకొన్న ఎన్నో మహిళా సమస్యలపై ఎందుకు గొంతు విప్పట్లేదు' అని ప్రశ్నిస్తున్నారు.
మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ శశిథరూర్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. 'వందల ఏండ్ల కిందటి మహారాణుల కంటే.. ఇప్పుడు ఉన్న మహిళల గురించి ఆలోచించండి. వాళ్ల సమస్యలమీద దృష్టి సారించండి. వాళ్లెంత దయనీయమైన స్థితుల్లో బతుకుతున్నారో చూడండి. ఆయా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి' అని సూచించారు. ఆయన ట్వీట్కు మంచి స్పందన వస్తున్నది. ఆరువందల ఏండ్ల కిందట రాణిగురించి మాట్లాడుతున్నారు... కానీ రాజస్థాన్లోని మహిళా అక్షరాస్యత దేశంలోని అత్యంత తక్కువగా ఉన్నది. గత వైభవం కంటే.. ఇప్పటి మహిళల విద్య ప్రధానం అంటున్నారు. అలాగే లింగ నిష్పత్తి కూడా ఈ రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఉంది. రాజస్థాన్లో వెయ్యి మంది అబ్బాయిలకు గాను కేవలం 888 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 29 రాష్ట్రాలున్న దేశంలో రాజస్థాన్ 22వ స్థానంలో ఉంది. ఇదే భవిష్యత్లో కొనసాగితే ప్రమాదంగా మారుతుంది. కేవలం జనాభాలోనే కాదు... విద్యలోనూ చాలా తారతమ్యాలున్నాయి. పురుష అక్షరాస్యత కంటే... మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. దేశంలోనే అత్యంత తక్కువ స్థానంలో ఉన్నది రాజస్థాన్లోనే. ఇటీవలి గణాంకాల ప్రకారం... పురుషుల అక్షరాస్యత 79.19 శాతం ఉంటే.. మహిళల అక్షరాస్యత కేవలం 52.12శాతం మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో మహిళల స్థితి చాలా విషాదంగా ఉంది. 15 నుంచి 17 ఏండ్ల వయసున్న అమ్మాయిలు ఎక్కువగా చదువుకోవడం లేదు. పాఠశాలల్లోనే చేరడం లేదు. 2011-12 సంవత్సరానికి గాను పాఠశాలల్లో చేరిన అమ్మాయిల శాతం కేవలం పదకొండు. ఇందులో కూడా మధ్యలోనే ఆపేసినవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. వీళ్లంత బాల కార్మికులుగానో, బాల్య వివాహాలకో బలవుతున్నారు. ఇక ప్రతి లక్ష మంది మహిళలకు... 244 మంది మహిళలు ప్రసవ సమయంలో చనిపోతున్నారు. దేశంలోనే ఇది అత్యధిక స్థానం.
ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే ఎన్ని తరాలైనా ఇవే గణాంకాలు ఉంటాయి. పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. మన మధ్యలో లేని మనుషుల కోసం సమయాన్ని, శక్తిని వెచ్చించే కన్నా... ఇలాంటి సమస్యలపై మాట్లాడేందుకు వెచ్చిస్తే పరిస్థితుల్లో కాస్తయినా మార్పు వస్తుందని సూచిస్తున్నారు.