Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఝల్కారిబాయి
(22 నవంబరు 1830 - 1858)
శతాబ్దాల నుంచి ఆమె వీరత్వాన్ని బుందేల్ఖండ్ ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఆమె ధైర్యపరాక్రమాలు, రాణిని రక్షించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంతో పోరాడిన ఆమె హీరోయిజం దళిత మహిళా సైనికురాలుగా ఆమె పరాక్రమం నేటికీ ప్రజల మధ్య చర్చించ బడుతున్నాయి. ఝుల్కారి బాయి దళిత మహిళ సైనికురాలు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మహిళా సైన్యంలో ఆమె పనిచేశారు. అంతేకాదు ఝాన్సీ రాణికి ప్రముఖ సలహాదారుగా విశిష్టసేవలందించారు. ఝాన్సీ కోటను శత్రువుల నుంచి రక్షించే క్రమంలో ఆమె రాణిగా మారువేషం ధరించి సైనికులకో యుద్ధం చేస్తూ.. రాణి కోట నుండి సురక్షితంగా తప్పించుకునే వీలు కల్పించారు.
ఝాన్సీ సమీపంలోని భోజ్లా గ్రామంలో నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో ఝల్కారిబాయి జన్మించారు. ఆమె తల్లిదండ్రుల కు ఒక్కతే కుమార్తె. చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అడవిలో పశువులను మేపుతున్న ఆమెపై దాడి చేసిన చిరుత పులితో పోరాడి.. చాకచక్యంగా తన చేతికర్రతోనే హతమార్చిన సంఘటన ఆమెను ఆ గ్రామంలో పరాక్రమశాలిగా నిలిపింది.
ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో పనిచేస్తున్న పూరణ్సింగ్తో ఝల్కారి బాయి పెండ్లి జరిగింది. చిన్నతనం నుంచే యుద్ధవిద్యలు నేర్చుకున్న ఆమె భర్త శిక్షణలో విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీలో నైపుణ్యం సాధించారు. శత్రువుల బాణాలనుండి తప్పించుకోవటం, తిరుగుబాటు చేయటం వంటి సైనిక విద్యలన్నీ బాగా నేర్చు కున్నారు. సైన్యంలో చేరి మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించారు.
సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఝల్కారీ బాయి తానే ఝాన్సీలక్ష్మీ బాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్ప తిప్పలు పెట్టారు. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా ఆమె యుద ్ధరంగంలో మారువేషంతో పోరాటం చేశారు.
ఆ యుద్ధంలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు ఆమెను చంపేశారా, వదిలేశారా అన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లేవు. స్వాతంత్య్రం తర్వాత భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన కొందరు ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి క్షేత్రస్థాయిలో ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ు