Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా స్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం.. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె జీవితం ప్రజాసేవకే అంకితం. ఆమె రాసే ప్రతి అక్షరం మహిళా చైతన్యానికి అంకితం. అన్న నుంచి అభ్యుదయ భావాలు పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి ఉద్యమ నాయకురాలిగా ఎదిగారు. ముగ్గురు పిల్లల తల్లిగా జీవితంతో ఒంటరి పోరాటం చేశారు. మహిళా సంక్షేమ శాఖ ఉద్యోగిగా స్త్రీలను చైతన్య పరిచారు. 87 ఏండ్ల వయసులోనూ అదే ఉత్సాహం. ఉరకలెత్తే ఉత్తేజం. ఆమే అలుపంటూ ఎరుగని నిరంతర శ్రమజీవి నంబూరి పరిపూర్ణ. ఆమె జీవిత విశేషాలు మానవి పాఠకుల కోసం...
రిపూర్ణ సొంతూరు కృష్ణాజిల్లా, గన్నవరం తాలుకా బండారిగూడెం. లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు 1931లో పుట్టారు. ఆమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, ఓ తమ్ముడు. పెద్దన్నయ్య శ్రీనివాస్ ఐదో తరగతిలో ఉన్నప్పుడే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. కొంత కాలానికి ఆయన కమ్యూనిస్టుపార్టీలో చేరారు. దాంతో కార్మిక సమ్మెలు, ఆకలి బాధలు, ఉద్యమాల గురించి ఇంట్లో తరుచూ వింటుండేవారు. పరిపూర్ణ తల్లి కూడా మహిళా ఉద్యమంలో పాల్గొనేవారు. అన్నల సహకారంతో చిన్నతనంలో లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేవారు. వీరిది కళాకారుల కుటుంబం. హరిశ్చంద్ర నాటికను ప్రదర్శించే వారు. వాటిని వింటూ పెరిగిన పరిపూర్ణ కూడా కంఠస్థం చేశారు. అలా అనుకోకుండా ఓ సారి ఆమె ఓ నాటికలో చిన్న పాత్ర వేశారు. ఎంతో మధురంగా పద్యాలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సినిమా అవకాశం
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో పరిపూర్ణ పాఠశాలలో చదువుతున్నారు. యుద్ధ విరాళాలు వసూలు చేయాలని స్కూలు టీచర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపింది. దాంతో పాఠశాల ఉపాధ్యాయులంతా ఆలోచించి పిల్లలతో ఓ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దానికి టికెట్లు పెట్టి అమ్మారు. మధురమైన స్వరం, చురుకుదనం ఉన్న పరిపూర్ణకు ఆ ప్రోగ్రామ్లో పాల్గొనే అవకాశం వచ్చింది. 'పాదుకా పట్టాభిషేకం' అనే నాటికలో భరతుడి వేషం వేశారు. ఆ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత మిర్జాపూర్ జమిందార్ కూడా వచ్చారు. అందులో పరిపూర్ణ నటన చూసి ముచ్చట పడ్డారు. తర్వాత ఆయన తీసిన 'భక్త ప్రహ్లాద' సినిమాలో నటించాల్సిందిగా కబురు పంపారు. సినిమాల్లోకి వెళితే కూతురి చదువు ఎక్కడ పాడవుతుందో అని ముందు తండ్రి అంగీకరించలేదు. కానీ తెలిసిన పెద్దలు బతిమలాడడంతో చివరకు ఒప్పుకున్నారు. అలా పరిపూర్ణ ఆరు నెలల పాటు చెన్నైలో ఉండి ఆ సినిమాలో చిన్న ప్రహ్లాదుడిగా నటించారు. అక్కడ పెద్ద పెద్ద వారిని కలిసే అవకాశం వచ్చింది.
విద్యార్థి ఉద్యమంలో...
ఆ సినిమా తర్వాత పాఠశాల విద్యను కొనసాగించారు. పదమూడేండ్ల వయసులో రేడియోనాటికల్లో నటించారు. ప్రతి దాంట్లో తనే హీరోయిన్గా. ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి కాకినాడ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశారు. అన్న ప్రభావంతో చిన్నతనం నుంచి కమ్యూనిస్టు అభిమానిగా మారిన పరిపూర్ణ విద్యార్థి ఉద్యమంలో పాల్గొనేవారు. అప్పట్లో డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నో పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అక్కడ జరిగిన విద్యార్థి రాష్ట్ర మహాసభల్లో అందరికంటే చురుగ్గా పాల్గొన్నారు. జిల్లా విద్యార్థి సంఘం కార్యదర్శిగా మహాసభ ఏర్పాట్లు చూడటానికి దాసరి నాగభూషణం అక్కడికి వచ్చారు. ఎంతో చురుకైన పరిపూర్ణని చూసిన ఆయన ఆమెను పెండ్లి చేసుకోవటానికి ముందుకు వచ్చారు. ఓ కమ్యూనిస్టు కార్యకర్త స్వయంగా అడగటంతో పరిపూర్ణ కూడా అంగీకరించారు. ఇంట్లో ఒప్పించి దండలు మార్చుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో పార్టీపై నిషేధం ఉండడం వల్ల పెండ్లి తర్వాత కొంత కాలం అజ్ఞాతంలో జీవించారు.
ఒంటరి పోరాటం...
తర్వాత కాలంలో విద్యార్థి ఉద్యమ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన భర్త ఎప్పుడూ కలకత్తా, అహ్మదాబాద్లో ఉండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇల్లు గడవడం కష్టమయ్యేది. అత్తగారి కుటుంబం అప్పుడప్పుడు కొంత సాయం చేసేవారు. కానీ అది సరిపోయేది కాదు. దాంతో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ పూర్తి చేసి పిల్లల కోసం ఓ పాఠశాలలో టీచర్గా చేరారు. కొన్నాళ్ళకు ఆ ఉద్యోగం పోయింది. తెలిసిన వారి ద్వారా సోషల్ ఎడ్యుకేషన్లో పోస్టులు ఉన్నాయని తెలిసి దరఖాస్తు చేశారు. 'మనం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం, అలాంటిది నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో చేరతావా వీల్లేదు'' అని భర్త అంగీకరించలేదు. 'మీరు ఎటూ ఆర్థికంగా సహకరించరు, నేనూ ఉద్యోగం చేయకపోతే ఎలా? ఇప్పటి వరకు నేను చేసిన టీచర్ ఉద్యోగం కూడా ప్రభుత్వానికి సంబంధించినదే' అని ఆమె ఆయన మాటను ఎదిరించారు. పిల్లల భవిష్యత్ కోసం ఆ ఉద్యోగంలో చేరాలనుకున్నారు. వెళ్ళేందుకు డబ్బులు లేకపోతే ఇతరుల దగ్గర తీసుకున్నారు. పదిహేను రోజులకు పోస్టింగ్ లెటర్ వచ్చింది. భర్త దాన్ని చించిపడేశాడు. ప్రశ్నించిన అత్తగారిని కొట్టబొయ్యారు. ఆర్థికంగా సహకరించని భర్త. కనీసం ప్రేమగా పలకరించడు. ఎప్పుడో ఓసారి ఇంటికి వచ్చినా పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోడు. తనకోసం ప్రత్యేకంగా ఓ గది. అందులో తనకూ, పిల్లలకు చోటే లేదు. ఇలాంటి స్థితిలో ఒకానొక దశలో ఆమె చనిపోవాలనే నిర్ణయానికొచ్చారు. కానీ పిల్లల భవిష్యత్ కోసం ధైర్యం తెచ్చుకున్నారు. చివరకు సంబంధిత అధికారులను బతిమలాడి, పోస్టింగ్ లెటర్ పోయిందని అబద్దం చెప్పి ఉద్యోగంలో చేరారు.
మనసులోని భావాలే వ్యాసాలు
నెలకు 200 రూపాయలు జీతం. అందులోనే ఇంటి అద్దె, పిల్లల చదువులు, మిగిలిన ఖర్చులు.ఉద్యోగరీత్యా గ్రామాలకు తిరగాల్సి వచ్చేది. ఆ ఖర్చులు కూడా ఇందులోనే. ఇలా ఎంతో కష్టపడి జీవితాన్ని నెట్టుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత బిజీగా ఉన్న తన మనసులోని భావాలను మాత్రం వ్యాసాల రూపంలో రాసుకునేవారు. వాసిరెడ్డి సీతాదేవిగారు మహిళా సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విజయవాడ వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత పరిపూర్ణ రచనలు బాగా పెరిగాయి. స్త్రీల సమస్యలపై రేడియోలో ప్రసంగించే అవకాశం కూడా వచ్చింది. తన వ్యాసాలను ప్రగతి, ప్రతిభ పత్రికలకు పంపేవారు. ఉద్యోగం చేస్తూనే బీఏ పూర్తి చేశారు. నవోదయ నుంచి శరత్, బంకించంద్ర, ఠాగూర్ నవలలు, శ్రీపాద, చిలకమర్తి, విశ్వనాథ, త్రిపురనేని గోపిచంద్, త్రిపురనేని రామస్వామిల అద్భుత రచనలు, కందుకూరి ప్రహసనాలు ఇంటికి తెచ్చుకుని తను చదువుతూ పిల్లలతో చదివించే వారు. ముఖ్యంగా చలం రచనలు, 'అమ్మ' నవల ఆమెలో స్ఫూర్తినింపాయి.ఉద్యోగం చేసే సమయంలో స్త్రీలను చైతన్య పరచడం కోసం వృత్తిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. సమస్యలపై అనర్గళంగా ప్రసంగించేవారు. 27 ఏండ్లు చేసిన ఆ వృత్తిని వదిలి 1981లో మున్సిపల్ ఉద్యోగిగా డిప్యూటేషన్పై హైదరాబాద్ వచ్చేశారు.
స్త్రీ సమస్యలే కథావస్తువులు
తల్లి ప్రభావంతో కూతురు శిరీష కూడా బాగా రాసేవారు. ఆమె కథలు, నవలలు, గేయాలు వారపత్రికల్లో వచ్చేవి. వాటిని చూసి కూతురి వలె తను కూడా కథలు రాయాలని భావించారు. అలా ఆమె రాసిన మొదటి కథ 'మాకు రావు సూర్యోదయాలు'. ఇక అప్పటి నుంచి తన చుట్టూ జరుగుతున్న ఘటనలు, స్త్రీ సమస్యలు ఆమె కథా వస్తువులుగా మారాయి. పెద్ద కొడుకు అమరేంద్ర చక్కగా రాసేవారు.
కథా పరిపూర్ణం
1989లో రిటైర్మెంట్ తర్వాత విరివిగా రాసేవారు. స్త్రీ విద్య, ఉద్యోగ, వివాహ సమస్యలు, ఇతర సామాజిక రంగాలన్నింటిలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పురుషాధిక్యత గురించి రెగ్యులర్గా వ్యాసాలు రాసిపంపేవారు. తను రాసిన కథలను 'ఉంటాయి మాకు ఉషస్సులు' పేరుతో 1998లో ఆవిష్కరించారు. రచనలకే పరిమితం కాకుండా తన నివసిస్తున్న కుకట్పల్లి, సంగీత్నగర్ కాలనీలో మంచినీరు, మరుగుదొడ్ల సమస్యపై మహిళలను పోగు చేశారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. దీనికోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పరిపూర్ణ 75వ పుట్టిన రోజు సందర్భంగా 'కథా పరిపూర్ణమ్' పేరుతో తన ముగ్గురు పిల్లలు కలిసి ఓ పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే ఆమె రాసిన కథలు, వ్యాసాలు 'శిఖరారోహణ' గా పుస్తక రూపం దాల్చింది. తన జీవిత అనుభవాలను 'వెలుగు దారులలో' పేరుతో ఆమె స్వీయ చరిత్రను నేటి తరానికి అందించారు.
ప్రస్తుతం ఆమెకు 87 ఏండ్లు. అయినా తన రచనలను కొనసాగిస్తున్నారు. స్త్రీలను చైతన్య పరిచే సాహిత్యాన్ని సమాజానికి అందిస్తూ పేరుకు తగ్గట్టు పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె నేటి తరానికి ఓ ఉత్తేజం.
స్వేచ్ఛగా రాసుకుంటాను
ప్రస్తుతం నేను రాసిన 'పొలిమేర' నవల త్వరలో రాబోతున్నది. ఓపిక ఉన్నన్ని రోజులు రాస్తూనే ఉంటాను. రంగనాయకమ్మ గారు నా కథలను ఎంతో మెచ్చుకుంటారు. అర్ధరాత్రి కూడా కండ్ల జోడు లేకుండా చదవగలను. శారీరక కష్టం చేయడం వల్ల ఇప్పటి వరకు నాకు షుగర్ రాలేదు. ఇప్పటికీ నా వంట నేను చేసుకుంటాను. పెద్దబాబు అమరేంద్ర ఢిల్లీలో, చిన్నవాడు శైలేంద్ర బెంగుళూరులో ఉంటారు. మా అమ్మాయి శిరీష ఇక్కడే ఉంటుంది. వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమంటారు. కానీ నాకు స్వతంత్య్రం కావాలి. ఒంటరిగా ఉంటే స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోగలను. అందుకే ఒక్కదాన్నే ఉంటున్నాను. చేతనైనంత కాలం ఇలాగే ఉంటాను.
ఆచరణ ముఖ్యం
1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సభల్లో నేనూ పాల్గొన్నాను. అణిచివేతకు గురైన కులాలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తున్నారో అలాగే మహిళలకు కూడా ఇవ్వాలి. ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీలు తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నారు. ఇది పోవాలంటే మహిళలకు రిజర్వేషన్లు కావాలి. ఆ సభలో మొదటి సారి మహిళలకు రిజర్వేషన్లు కావాలనే ఓ తీర్మానాన్ని స్వయంగా నేనే పెట్టాను. అందరూ అంగీకరించారు. పెద్ద ఎత్తున రేడియోల్లో ప్రసారం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సార్లు దీనిపై తీర్మానాలు పెట్టారు. అయితే తీర్మానాలు పెట్టడంతోనే సరిపోదు ఆచరణ ముఖ్యం. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఒక ఎంపీ పేపర్లు చించేశాడు. ఒకడేమో ఆత్మహత్య చేసుకుంటానంటాడు. స్త్రీ అభివృద్ధి పట్ల పురుషుల ఆలోచనా విధానం ఇది. కాబట్టి మహిళలు పోరాటం చేయకతప్పదు.
కమ్యూనిజంతోనే సాధ్యం
నా పిల్లల్ని మార్క్సిస్టులుగా కాకపోయినా సమాజం పట్ల అవగాహన ఉన్న వారిగా చేయగలిగాను. సాహిత్యాన్ని అభిమానిస్తారు. రాస్తారు. మా పెద్దమ్మాయి బ్యాంక్లో ఉద్యోగం చేసి వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని 'ఆలంబన' పేరుతో ఉచితంగా పేద పిల్లల కోసం స్కూలు నడుపుతున్నది. ఎన్ని కష్టాలు వచ్చినా, భర్త ఆదరించకపోయినా నేను ధైర్యంగా బతికానంటే పార్టీ ఇచ్చిన బలమే కారణం. ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి స్వేచ్ఛ రావాలంటే కమ్యూనిజం ఒక్కటే మార్గం. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే అది సాధ్యం అని బలంగా నమ్ముతున్నాను.
- సలీమ