Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరి పరులేకర్.. సాంఘికశాస్త్ర పుస్తకాల్లో ఆదివాసీ ఉద్యమాల్లో వినిపించిన పేరు మాత్రమే! కానీ ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు. రచయిత, సామాజిక కార్యకర్త. విలాసవంతమైన జీవితాన్ని వదిలి.. మహారాష్ట్రలోని బడుగుజీవులకోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి. స్వాతంత్య్రానికి ముందు, ఆ తరువాత పోరాటాన్ని కొనసాగించి... భారతదేశ చరిత్రపుటల్లో తన అధ్యాయాన్ని లిఖించుకున్న ఆదివాసీ ఉద్యమ నాయిక.
గోదావరి పరులేకర్ 1907లో పుణేలో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు గోఖలే. ధనవంతుల కుటుంబం కావడంతో బాగా చదువుకున్నారు. మహారాష్ట్రలో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేసిన మొట్టమొదటి మహిళ ఆమె. విద్యార్థినిగా ఉన్నప్పుడే బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాలొన్నారు. జైలుకు వెళ్లారు. లా పూర్తవ్వగానే... సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో చేరారు. రెండేళ్లలోనే... అక్షరాస్యత ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇళ్లలో పనిచేసేవారిని ఐక్యం చేశారు. లేబర్ యూనియన్స్తో కలిసి పనిచేసినందుకు గాను అనేకమార్లు ఆమెను జైలుకు పంపింది బ్రిటీస్ ప్రభుత్వం.
పలుమార్లు జైలుకు...
థాణే జిల్లాలోని రైతులను ఏకం చేసి, వారికి నాయకత్వం వహించారామె. ఆ సమయంలోనే.. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనే పనిచేస్తున్న శామ్రావ్ పరులేకర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి నమ్మకాలు, ఆశయాలు ఒక్కటే కావడంతో... 1939లో పెండ్లి చేసుకున్నారు. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని వదిలేశారు. కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. బ్రిటీష్ ప్రభుత్వం దానికి మద్ధతుగా ఉంది. దీంతో ముంబైలో మొట్టమొదటగా యుద్ధ వ్యతిరేక సమ్మెను నిర్వహించారు. శామ్రావ్ అరెస్టయ్యారు. అయినా గోదావరి పోరాటాన్ని కొసాగించారు. 1940లో ఆమెను అరెస్టు చేసి రెండేండ్ల పాటు జైల్లో ఉంచారు.
రైతాంగ ఉద్యమ నిర్మాత...
జైలునుంచి బయటికి రాగానే ఆమె రైతులను సంఘటితం చేయడంపై దృష్టి సారించారామె. సామాజిక న్యాయం రావాలంటే దేశంలో 70శాతం ఉన్న రైతులను ఉద్యమం వైపు నడిపించడమే పరిష్కారమని నమ్మారామె. ఆల్ ఇండియా కిసాన్ సభ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. మహారాష్ట్ర రాజ్య కిసాన్ సభకి మొట్టమొదటి జాయింట్ సెక్రటరీ. కిసాన్సభలో పనిచేస్తూ వర్లి కమ్యూనిటీ సమస్యలను దగ్గరగా చూశారు. భూస్వాముల కబంధహస్తాల్లో చిక్కి వెట్టిచాకిరికి బలవుతున్నారు. ఇక వర్లీ మహిళలు మరింత దీనస్థితిలో ఉన్నారు. భూస్వాముల చేతుల్లో అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారు. ఇదంతా దగ్గరగా చూసిన ఆమె తన జీవితాన్ని వారికి అంకితం చేశారు. భర్త శామ్రావ్తో కలిసి వర్లీఆదివాసీ రైతాంగ ఉద్యమాన్ని నిర్మించారు. 1945 నుంచి 47 వరకు జరిగిన ఈ పోరాటంతో వెట్టిచాకిరినుంచి విముక్తులను చేయడమే కాదు... వేతన చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఇదంతా స్వాతంత్య్రోదమంలో భూస్వాముల వ్యతిరేకంగా పోరాటంగానే మిగిలిపోయింది.
స్వాతంత్య్రానంతరం కూడా...
స్వాతంత్య్రం తరువాత కూడా వర్లీ ఆదివాసీల హక్కులకోసం ఆమె పోరాడారు. భారతదేశం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఎన్నో విధాన పర నిర్ణయాలకు కారణమయ్యారు. 1961లో భర్తతో కలిసి ఆదివాసీ ప్రజల విద్యకోసం ఆదివాసీ ప్రగతి మండల్ (ట్రైబల్ ప్రోగ్రెస్ కౌన్సిల్) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆ ప్రాంతంలోని ఓ కాలేజీని, పలు పాఠశాలలను, హాస్టళ్లను నడిపిస్తున్నది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలింది. ఆమె సీపీఐఎంతో ఉన్నారు. ఆ తరువాత కూడా మహారాష్ట్రలోని రైతులు, ఆదివాసీలకోసం పనిచేశారు. 1965భర్త మరణం తరువాత కూడా తన పోరాటాన్ని కొనసాగించారు. 1996లో ఆమె మరణించేవరకు సీపీఐఎం పార్టీతో ఉన్నారు.. మహారాష్ట్ర కిసాన్సభలో ఉద్యమించారు. కేవలం ఉద్యమాలకే పరిమితం కాలేదు. ఆ పోరాటాలకు అక్ష రూపం ఇచ్చారామె. 'జెవా మానస్ జగా హౌటో' పుస్తకం 1970లో ప్రచురితమైంది. 1972లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది. తరువాత ఇంగ్లీష్, జపనీస్తోపాటు పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. తరువాత మరో రెండు పుస్తకాలు ఆదివాసీ రివోల్ట్ : ద స్టోరీ ఆఫ్ వర్లీ పీజంట్స్ ఇన్ స్ట్రగుల్, 'బందివాసచీ ఆఠ్ వర్ష్(ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్)' వచ్చాయి.
ఎన్నో అవార్డులు...
కనిపించకుండా పాతుకుపోయిన పురుషాధిక్య గోడలను బద్దలు కొట్టారు. 1986లో ఆల్ఇండియా కిసాన్సభకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. వేల ఏండ్లుగా పనిచేస్తూ కూడా మహిళలు ఏ మాత్రం గుర్తింపునకు నోచుకోని వ్యవసాయ రంగాన్ని సంఘటితం చేశారు. మహారాష్ట్రలో న్యాయశాస్త్రం చదివిన మొదటి మహిళగా, పలు రాజకీయ పార్టీల్లో ప్రధాన గొంతుకగా భారత సామాజిక రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. రచయితగా సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు జవహర్లాల్ నెహ్రూ, సోవియట్ల్యాండ్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. లోకమాన్య తిలక్ అవార్డును కూడా దక్కించుకున్నారు. మహిళల సమానత్వం కోసం పని చేసి సావిత్రీబాయి ఫూలే అవార్డును అందుకున్నారు.
- జెన్నీ