Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాషలెన్నయినా.. పలికే భావమొక్కటే. ప్రపంచవ్యాప్తంగా వేలాది భాషలున్నా.. లిపి ఉన్న భాషల సంఖ్య 3,866 మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేను కోట్లమంది తెలుగు భాష మాట్లాడతారు. 'ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్'గా పేరొందింది తెలుగు. అతి ప్రాచీనమైన భాషల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్న ఏడుభాషల్లో ఒకటి. ఇంగ్లీష్ ప్రాబల్యం పెరిగిపోవడంతో తెలుగు భాష ఆదరణ కోల్పోతుందన్న ఆందోళన కలుగుతున్న నేపథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ వేదిక కావడం ముదావహం. వేలాది మంది భాషాభిమానులు ఒకచోట చేరి భాషా పండుగను నిర్వహించుకుంటున్నారు. దేశవిదేశాల నుంచే కాదు... మారుమూల గ్రామాల నుంచి వచ్చిన భాషాభిమానులల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి సభలు. ఈ సందర్భంగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా సాహితీవేత్తల అభిప్రాయాలు..
భాషా వికాసంలో మైలురాయి
'కవితతో మొదలయ్యే అక్షర యజ్ఞం పాఠకుడిని చేరినప్పుడు పూర్తి అవుతుంది' అని అంటారు. ఈ మహాసభల వేదిక... సాహిత్య సేవకుల ప్రతి అక్షరం పాఠకులను చేరే మంచి అవకాశం. నిజం చెప్పాలంటే తెలుసుభాషా వికాసంలో మైలురాయి. 25సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో ఉంటున్నాను. తీయనైన తెలుగుభాషపై ప్రేమ నానాటికీ పెరిగిందే తప్ప తరిగేది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. మన భాషలోని మాధుర్యాన్ని మరిచిపోలేం. సాహిత్యంలో కవితా ప్రక్రియ నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు నాలుగు కవితాసంపుటిలు ప్రచురించాను.తెలుగు భాష మరుగున పడిపోతుందే అన్న భయం ఈ జనసందోహన్ని చూసిన తర్వాత మటుమాయమైంది. మన భాష ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మన పూర్వీకులు ఎన్నో వ్యయప్రయాసలకు లోనై సేకరించి.. రచించిన అనేక అంశాలు ఇప్పటికీ పుస్తకాలుగా వెలువడివి ఎన్నో ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావాలి.
- కె. గీత, కాలిఫోర్నియా
సాహిత్యవేత్తల ఉనికి తెలిసేలా..
వరంగల్లో పుట్టి పెరిగాను. మా చిన్నతాతగారు గొట్టిముక్కల రాధాకృష్ణారావు తెలుగు ఉపాధ్యాయులు. ' మన కాకతీయులు'తో పాటు అనేక పుస్తకాలను ఆయన రచించారు. విశ్వనాథ సత్యనారాయణగారు కరీంనగర్లో పనిచేసే సమయంలో మా తాతగారి ఇంటికి వచ్చేవారు. చాలా మంది ప్రముఖ కవులకు ఆయన సమకాలికులు. కానీ ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. మా పెద్దనాన్నగారు కూడా మంచి రచయిత. వారి పేర్లు వెలుగులోకి రాకపోవడం కొంత బాధ అనిపించింది. ఈ మహాసభల సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగువారందరినీ ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే ఇప్పటివరకు చాలామంది గుర్తింపులేని వారు ఉన్నారు. వారి సాహిత్య సేవను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఈ సభలకు ఆహ్వానిస్తూ.. ఉత్తరం పంపారు. మా వివరాలన్నీ అడిగారు. దానితో పాటు మీ కుటుంబంలోని కవులు, రచయితలు, కళాకారులు ఎవరైనా ఉన్నారా? వారి వివరాలు తెలపండి? అన్న కాలమ్ ఒకటి చేర్చిఉంటే బాగుందేది. ఎనిమిది వేల మంది కుటుంబాల్లో మరుగున పడిపోయిన.. ఆదరణకు నోచుకుని ఎంతో మంది తెలుగు సాహిత్యవేత్తల ఉనికి తెలిసేది. ప్రభుత్వం ఇకముందైనా ఈ ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నాను.
- శ్రీదేవి, చెన్నై
తల్లుల బాధ్యతే ఎక్కువ..
అమ్మ ఒడిలో నేర్చుకునేదే అమ్మభాష. ఈ భాషను రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత తల్లులపైనే ఉంది. కేవలం మాట్లాడటమే కాదు.. చదవడం, రాయడం వచ్చినప్పుడే ఆ భాష మరిన్ని ముందు తరాల వారికి అందుతుంది. మన ఉనికిని చెప్పే భాషను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. దూరపు కొండలు నునుపు అన్న పెద్దల మాట భాష విషయంలో అక్షరాల నిజం. ఉద్యోగం కోసమో.. ఉపాధి కోసమో ఇతర భాషలను నేర్చుకున్నా.. మన భాషను మాత్రం మరిచిపోవద్దు. నేను 12 ఏండ్లుగా లండన్లో ఉంటున్నాను. యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ.. భరతనాట్యగురువుగా మన తెలుగువారి కోసం డాన్స్స్కూలు నిర్వహిస్తున్నాను. మా వద్దకు వచ్చే చిన్నారులకు మన సంస్కృతిని చెప్పడమే కాకుండా ప్రతిపండుగను కలిసి చేస్తాం. ఇప్పుడు ఈ మహాసభల సందర్భంగా నేను పుట్టిపెరిగిన నగరానికి నేను ప్రతినిధిగా రావడం మాటలకు అందని అనుభూతి. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగువారందరినీ ఒక చోట కలవడం నిజంగా భాషాబంధువుల పండుగలా ఉంది.
-వింజమూరి రాగసుధ, లండన్
వారధిగా మారింది..
మూడు దశాబ్దాల కిందట విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుభాష, సంస్కృతి కోసం కృషి చేసిన వారిని గుర్తించి.. వారిని ఆహ్వానించి తెలుగు మహాసభలను నిర్వహించడం అభినందనీయం. ఈ ప్రపంచ స్థాయి మహాసభల ద్వారా తెలుగుపై ఫోకస్ పెరిగింది. ఒక ప్రాంతీయ భాషకు ఉన్న ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మాది మహబూబ్నగర్లోని చిన్న గ్రామం. పదో తరగతి వరకు తెలుగుమాధ్యమంలోనే చదువుకున్నాం. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్.డి పూర్తి చేసి, వర్జీనీయాలో ఫ్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఉన్నా తెలుగు భాషలోని గ్రంథాలను చదవడం మాత్రం ఆపలేదు. మన సంస్కృతిలోని గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా అనేక పరిశోధనా గ్రంథాలను తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువదిస్తున్నాను. అమెరికాలో ఒక పరిశోధన గ్రంథం ప్రచురించాలంటే దాదాపు పది సంవత్సరాలు కృషి చేయాలి. ఇప్పటికీ రెండు గ్రంథాలను తీసుకువచ్చాను. బతుకమ్మపై పరిశోధన చేస్తున్నాను. ఈ మహాసభలు విదేశాల్లో స్థిరపడిన వారికి ఇక్కడి సాహిత్యకారులతో వారధిగా ఉపయోగపడుతున్నాయి.
- ప్రొఫెసర్ ప్రభావతి, వర్జీనియా
భాషా వికాసానికి నాంది..
రెండునెలల కిందటే మాకు ఈ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారిని గుర్తించినందుకు మేం ఎంతో సంతోషించాం. మేం ఆయా రాష్ట్రాల్లో తెలుగువ్యాప్తి కోసం చేస్తున్న కృషిని, తెలుగుసాహిత్యంలో మా ప్రతిభను గుర్తిస్తారనుకున్నాం. ప్రతినిధులుగా ఆహ్వానించారు. ప్రేక్షకులుగా మార్చారు. మాకు ఈ వేదికను పంచుకునే అవకాశం ఇవ్వలేదు. కవి సమ్మేళనాలు, పేపర్ ప్రజెంటేషన్లు ఉంటే బాగుందేది. తెలుగువారు ఎక్కువగా ఉన్న పుణేలో మేం ప్రతి శనివారం తెలుగు నేర్పిస్తున్నాం. సాహిత్య సమావేశాలు ఏర్పాటుచేసి యువతలో తెలుగుభాషపై మక్కువను పెంచుతున్నాం. తెలంగాణ హస్తకళలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాం. వేలాది మంది పాల్గొంటున్న ఐదురోజుల ఈ బాషాపండుగ తెలుగుపై ఫోకస్ను పెంచింది. ఇది తెలుగుభాషా వికాసానికి నాంది పలకాలి.
- రవీనా చవాన్, పూనే
కొత్త ఆశలు చిగురుస్తున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదృశ్యమవుతున్న తెలుగు గురించి భాషాభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ మహాసభలు జరగడంతో సాహితీవేత్తల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. కాలంతో వచ్చిన ఎన్నో మార్పులతో ఎన్నో కొత్తభాషలు వస్తున్నాయి. అయితే మాతృభాషపై ప్రేమతో ఇతర భాషలను ద్వేషించడం సరికాదు. మన అమ్మను ప్రేమించాలాంటే ఇతర అమ్మలను ద్వేషించాల్సిన అవసరం లేదు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు భాష, సంస్కృతిని ఎక్కువగా కాపాడుతున్నారన్న మాట మనం వింటున్నాం. మాతృభాషకు దూరమయ్యే కొద్ది ఆ మాట వినాలని.. సాహిత్యం చదవాలన్న ఆతృత పెరుగుతుంది. ఒక తీయని పిలుపుకోసం.. మధురమైన పాట కోసం తపించిపోతాం. 50ఏండ్లగా ఢిల్లీలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందిస్తూనే.. ఇతర భాషల నుంచి తెలుగులోకి ఎన్నో పుస్తకాలను అనువదించాను. తెలుగులో శీర్షికలు, కథలు, వ్యాసాలు రాశాను. ఈ సభల్లో పాల్గొని తెలుగు సాహిత్య ప్రముఖులను కలుసుకున్నాను.
-డాక్టర్ జె. భాగ్యలక్ష్మి, ఢిల్లీ.
అస్తిత్వాన్ని చాటేలా..
పదేండ్ల కిందట సింగపూర్ వెళ్లాం. అక్కడే సెటిల్ అయ్యాం. తెలుగువారంతా ప్రతి పండుగను చాలా ఆనందంగా కలిసి చేసుకుంటాం. ఇంట్లో తెలుగే మాట్లాడుతాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందగానే ఎంతో ఆనందం కలిగింది. ఈ వేదిక ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చిన మన తెలుగు వారిని కలుసుకునే వీలు కలిగింది. గతంలో తెలంగాణ యాసలో మాట్లాడితే హేళనగా చూసేవారు. కానీ, ఇప్పడు మన భాష, మన యాస ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వంగా ఉంది. మన అస్తిత్వాన్ని చాటేది మన భాష, సంస్కృతి, సంప్రదాయాలే. తెలంగాణ ఏర్పాడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ భాషా పండుగ సాహిత్యాన్ని వెలికితీయడంతో పాటు ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని ఎందరో సాహితీవేత్తలను గౌరవించడం సంతోషమైన విషయం.
- సునీత,సింగపూర్
వి.యశోద