Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిపోర్టింగ్ ఇప్పుడు కత్తిమీద సాము. అయినా జాతీయ మీడియాలో మహిళల ప్రభంజనం కొనసాగుతోంది. తెహెల్కా, బోఫోర్స్, బేబీ లిఫ్టింగ్, గుజరాత్ ఫైల్స్వరకు... ప్రభుత్వాల పునాదులు కదిలించే కథనాలన్నీ మహిళా జర్నలిస్టులు రాసినవే. ఓవైపు ప్రభుత్వాల నుంచి ఎన్ని ఒత్తిడులు ఎదురైనా... వెనుకడుగేయకుండా సాగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, బస్తర్... ఇలా మారుమూల ప్రాంతాలు, కల్లోల సమూహాల నుండి రిపోర్టింగ్ చేయడం మరో ఎత్తు. అలాంటి ప్రాంతాలనుంచి రిపోర్టింగ్ చేస్తున్న మహిళలు వీరు. ప్రభుత్వం, అధికారులనుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ఎన్నో చీకటి కోణాలను వెలుగులోకి తెస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, అసలు లోపల జరుగుతున్నదేమిటి? బయటికి వస్తున్నదేమిటి? జర్నలిస్టులు పంచుకున్న అభిప్రాయాలు...
ఎంతో వ్యత్యాసం...
20 ఏండ్లుగా ఉమెన్స్ ఫీచర్ సర్వీస్, ఇండియా టుగెదర్, ఇంటర్ ప్రెస్ సర్వీస్, ఈస్టర్న్ ఫ్రంటైర్లకు ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను. మణిపూర్లో చాలా హింస ఉంది. కానీ ఏ పత్రికలు దాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేయడం లేదు. వార్తలు అంటే.. ఎంత మంది చనిపోయారు, ఎంత మందిని అరెస్టు చేశారు, రాజకీయ వార్తలు మాత్రమే అనుకుంటున్నారు. కానీ జీవితం వీటికే పరిమితమై లేదు. వాళ్లకు జీవించే హక్కు ఉంది. మంచి జీవితాలు అందించడం కోసం మా ప్రాంతం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. కానీ వీటిని పట్టించుకునే వారే లేరు. అందుకే నేను వాటిని ఎంచుకుని పనిచేస్తున్నా. మణిపూర్లో జరుగుతున్న నిత్య సంఘర్షణ వాతావరణం పిల్లలు, మహిళల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో రాస్తున్నాను. అంతకుముందు స్థానిక జర్నలిస్టుల పనంతా... నేషనల్ మీడియా నుంచి వచ్చిన వాళ్లకు స్థానికంగా ఉన్న సమస్యలను చూపడం, వ్యక్తులను పరిచయం చేయడం వరకే పరిమితమయ్యేది. కొందరైతే ఫీల్డ్కి రాకుండా ఏం జరిగిందో చెప్పమని ఫోన్లోనే వార్త తీసుకునేవారు. మా శ్రమకు గుర్తింపు లేకపోయేది. కనీసం ఆ సమస్య పట్ల సహానుభూతి కూడా ఉండేది కాదు రాసేవాళ్లకు. స్థానికంగా విషయం పట్ల ఎంతో అవగాహన ఉన్నవాళ్లను నియమించుకోకుండా... ఢిల్లీనుంచి వచ్చి ఉపరితలంపై కనిపించే సమస్యలకే పరిమితమయ్యేవారికే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. ఇక వేతనాల విషయంలోనూ స్థానికులకు, ఇతరులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
- తింగమ్ అంజులికా సమోమ్, మణిపూర్
దాడులను ఎదుర్కొంటూ...
నేను టెంత్లో ఉన్నప్పుడు నాన్నగారికి పక్షవాతం వచ్చింది. దాంతో కుటుంబానికి ఆసరగా నిలవడానికి అప్పటినుంచే పనిచేయడం ప్రారంభించాను. మొదట డైలీ ప్రకార్కి పేపర్వర్క్ చేసేదాన్ని. అప్పుడు నెలకు 600 రూపాయలు వచ్చేవి. 2003లో ప్రూఫ్రీడర్గా ఉద్యోగం మొదలుపెట్టాను. చదువులు పూర్తి చేసిన తరువాత అదే న్యూస్పేపర్లో జర్నలిస్టుగా చేరాను. బూటకపు ఎన్కౌంటర్ల మీద పరిశోధనా వ్యాసాలు ఎన్నో రాశాను. ఆదివాసీల మీద పోలీసుల వేధింపులపైనా ఎన్నో కథనాలు రాశాను. ఈ క్రమంలో పోలీసుల నుంచి ఎన్నో వేధింపులు. నేను ఇలా పనిచేస్తున్నందుకుగాను ఓసారి నా భర్తపై దాడి చేశారు. 'ఇంకోసారి ఇలాంటి కథనాలు రాయొద్దని నీ భార్యకు చెప్పు' అని బెదిరించారు. ఆయనను హాస్పిటల్లో చేర్చాను. కొద్దికాలం తరువాత కోలుకున్నాడు. బస్తర్లో స్థానికంగా ఒకే ఒక మహిళా జర్నలిస్టును నేను. ఒక్కోసారి అంతమంది మగాళ్ల మధ్య రిపోర్టింగ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ... నా భర్త నన్నెంతో ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే ఆయనా ఒక జర్నలిస్టు. అంతకుముందు సీఆర్పీఎఫ్లో పనిచేసినా.. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు భరించలేక ఉద్యోగం వదిలేశాడు. సొంత ప్రజల కోసం పనిచేయాలనుకున్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి మా ప్రజలకోసం పని చేస్తున్నాం. ఆదివాసీలు అన్నిచోట్లా బాధితులే. ప్రభుత్వ పథకాలేవీ వారికి అందవు. ఇది పోవాలంటే విద్య అవసరం. వైద్య సదుపాయాలు అస్సలే లేవు. అందుకే ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ కథనాలు రాస్తున్నాను. 2015లో ఆదివాసీలపై భద్రతాదళాల అత్యాచారాలు మొదలు ఎన్నో కథనాలను బయటికి తెచ్చాను. నేను చేసిన కొన్ని డజన్ల కథనాలు ఆ తరువాత మెయిన్స్ట్రీమ్ మీడియాకు హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్లు, ఎక్సుక్లూజివ్స్ అయ్యాయి.
- పుష్పా ఉసెండి, బీజాపూర్
నాగాలాండ్ ఎన్నో నేర్పించింది...
ఢిల్లీలో చదువుకుని నాగాలాండ్లో అడుగు పెట్టిన నాకు.. అక్కడి చదువుకు ఇక్కడి ఆచరణకు ఎంతో తేడా ఉందనిపించింది. స్థానిక మీడియా నన్ను సాదరంగా ఆహ్వానించింది. అయితే ఎక్కడైనా రిపోర్టింగ్ చేయాలంటే ఉండాల్సింది అక్కడి ప్రజలపై సానుభూతి కాదు. సహానుభూతి. నెమ్మదిగా నెమ్మదిగా నేను అది పెంచుకోగలిగాను. నేను రాసింది అక్కడి ప్రజలకు అర్థం కావాలంటే... ఎంతో సరళంగా రాయాలి. నా ఇంగ్లీష్ను సరళం చేసుకుంటూ వెళ్లాను. ఇక బయటినుంచి వెళ్లిన వ్యక్తిగా ఎలాంటి తెగలకు సంబంధించిన పోలికలు లేకపోవడం నాకు ఒక్కోసారి ప్లస్ అయ్యేది. అలాగే ఎన్ఐఏ అధికారులతో మాట్లాడటానికి హిందీ ఎంతో ఉపయోగపడింది. అయితే ఎన్ఐఏ అధికారులు నేరుగా పత్రికా ఆఫీసుల్లోకి వస్తారు. మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ గురించి సమాచారం చెప్పాలంటూ ఇబ్బంది పెడతారు. ఎన్ఐఏ దగ్గర దీమాపూర్లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు సంబంధించిన ఫైల్ ఉంటుంది. వార్త రాసినప్పుడల్లా బెదిరిస్తూ ఉంటారు. అందుకే ఎంత గొప్ప వార్త రాసినా... కింద పేరు ఇచ్చుకోవడానికి ఇబ్బంది పడతాం. తక్కువ బడ్జెట్, పాత టెక్నాలజీతో కూడా జర్నలిస్టుగా ఎంత బాగా పనిచేయొచ్చో నాగాలాండ్ నాకు నేర్పించింది. ప్రస్తుతం నేను మొరంగ్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నా.
- అహేలి మోయిత్రా, నాగాలాండ్
రకరకాల ఒత్తిళ్ల మధ్య...
2012 నుంచి స్థానిక దినపత్రికల్లో పనిచేస్తున్నాను. 2015 నుంచి గ్లోబల్ ప్రెస్ జర్నల్లో రిపోర్టర్ కమ్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. కేవలం కశ్మీర్లో జరుగుతున్న సంఘర్షణలే కాకుండా... మహిళలు, వాళ్ల విద్య, వైద్యం, పిల్లలు, మానసిక ఆరోగ్యం వంటి అనేక అంశాల మీద కథనాలు రాస్తున్నాను. జాతీయ మీడియాలో కశ్మీర్ను చిత్రీకరించే పద్ధతే సమస్యాత్మకంగా ఉంది. టెర్రరిస్టుల కేంద్రంగా చూపిస్తున్నారు. టీవీఛానళ్లలో పనిచేసే చాలామంది జర్నలిస్టులు ఎన్కౌంటర్ల గురించి రాసేటప్పుడు కేవలం అధికారుల వర్షన్ మాత్రమే తీసుకుంటారు. ఎలాంటి పరిశోధనలు చేయరు. పూర్తిగా అసత్య ప్రచారాలు చేస్తారు. కశ్మీర్ అనగానే ఫెరాన్ (కశ్మీరీ సంప్రదాయ మహిళల వస్త్రధారణ) ధరించి గ్లోరిఫై చేయడానికి ప్రయత్నిస్తారు. స్థానికంగా జరుగుతున్నది మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే ప్రధాన స్రవంతిలో ఉన్న టీవీ ఛానళ్లు, పత్రికలు రాసే కథనాలు కాకుండా భిన్నమైన అంశాలపై దృష్టి సారిస్తున్నాను. ఇక్కడ విద్యావ్యవస్థ బాగానే ఉంది. చదువుల్లో అమ్మాయిలు చాలా ముందుంటున్నారు. వైద్య సదుపాయాలే సరిగ్గా లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకే వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ వాళ్ల ఆగడాలకు అడ్డు అదుపూ ఉండదు. కొన్నేండ్ల కిందట కశ్మీర్లో అతిపెద్ద పిల్లల ఆస్పత్రి జీబీ పంత్ హాస్పిటల్లో రెండునెలల్లోనే100 మందికి పైగా శిశువులు మరణించారు. ఇంకా దానిపైన విచారణ కొనసాగుతుంది. బాధితులకు ఎలాంటి అన్యాయం జరగలేదు. ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తూ రాస్తున్నాను. అయితే స్థానిక మీడియా ప్రవేశించడానికి వీలులేని నిషేధిత ప్రాంతాల్లో కూడా నేషనల్ మీడియాకు మాత్రం అవకాశం ఇస్తారు. ఇదే పద్ధతో అర్థం కాదు. కర్ఫ్యూ ప్రాంతాల్లోకి మమ్మల్ని పంపడానికి ఒప్పుకోరు. మేం ఏవన్నా ఫొటోలు తీస్తే వాటిని డెలిట్ చేసేదాక ఊరుకోరు. అవసరమైతే కెమెరా ధ్వంసం చేస్తారు. అడ్డు అదుపు ఉండదు. ఓవైపు ప్రభుత్వాలు, ఆర్మీనుంచి ఈరకమైన వాతావరణం ఉంటే... స్థానికంగా ఉండే కట్టుబాట్లు మరో అడ్డంకి. మహిళలు జర్నలిజం చేయడమేంటని హెచ్చరికలు. ఇట్లయితే ఎవరూ పెండ్లి చేసుకోరని బెదిరిస్తారు. పిల్లలపై లైంగిక హింస, ట్రాన్స్ పర్సన్స్ కథనాలు రాస్తే... ఇలాంటి రాయొద్దని మత పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తాయి.
- రహెనా మక్బూల్, కశ్మీర్