Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాధా ప్రశాంతి... ఐదువేలకు పైగా నాటికలు... వందకు పైగా సినిమాలు... ఇవన్నీ చేయాలంటే వెనక ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాల్సిందే. లేదంటే కళాకారిణిగా నిలబడటం అసాధ్యం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఆమె. ఎవరికీ తలవంచని తత్వం... ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గొప్ప అవకాశాలను పోగొట్టినా... నమ్ముకున్న కళామతల్లి ఆమెను మోసం చేయలేదు. నైపుణ్యంతో భిన్నమైన పాత్రలు చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కష్టాలను చవిచూస్తూ పెరిగిన ఆమె కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతారు. ఒకప్పుడు అందాల నటిగా ప్రేక్షకుల మదిలో... ఇప్పుడు సామాజిక సేవకురాలిగా పేదల మదిలో నిలిచిపోయిన ఆమె గురించి మరిన్ని విశేషాలు...
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా, కాశీనగర్ గ్రామంలో రాధా ప్రశాంతి పుట్టారు. అమ్మ తమటాల పగడాలమ్మ, నాన్న వెంకన్న. రాధకు ఏడేండ్లప్పుడు తండ్రి చనిపోయాడు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు, ఓ తమ్ముడు. నలుగురు పిల్లల్ని పెంచి పోషించడానికి తల్లి ఎన్నో కష్టాలు పడింది. పూర్వీకుల నుంచి తమకు రావల్సిన ఆస్తి కోసం ఒంటరిగా 20 సంవత్సరాలు పోరాడింది. చివరకు లాయర్ ఫీజులు కట్టలేక కేసు వదిలేసింది.
రంగస్థల నటిగా...
దసరా నవరాత్రుల సందర్భంగా ఊళ్ళో నాటికలు వేసేవారు. ఓసారి నవరాత్రులకు హీరోయిన్గా చేయవల్సిన అమ్మాయి రాలేదు. దాంతో ఏడో తరగతి చదువుతున్న రాధతో ఆ పాత్ర చేయించాలని స్కూల్ టీచర్లు అనుకున్నారు. ఇక నాలుగు రోజుల పాటు రాత్రీ పగలు ప్రాక్టీస్ చేయించారు. ఆ సందర్భంగా బుర్రకథ, చింతామణి, కట్నాల కాపురాలు ఇలా నాలుగైదు నాటికలు నేర్చుకొని నటించారు. అలా ఆమె అనుకోకుండా రంగస్థల నటిగా మారారు.
13 ఏండ్లకే ఉత్తమ నటిగా
అప్పటి వరకు కుటుంబంలో స్టేజ్ఎక్కిన వారు ఎవ్వరూ లేరు. దాంతో చాలామంది ఎన్నో మాటలన్నారు. కానీ ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాలను చూసి తను కూడా ఎంతో కొంత సాయం చేయాలని ఇంటి పెద్ద కూతురిగా నిర్ణయించుకున్నారు. అందుకే స్టేజ్ ఆర్టిస్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నారు. అలా సుమారు ఐదు వేల నాటికలు వేశారు. 13వ ఏటనే ఉత్తమ కళాకారిణిగా అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత వెంపటి చినసత్యంగారి దగ్గర కూచిపూడి కూడా నేర్చుకున్నారు. ఆర్థిక సమస్యలు, కాలేజీ దూరంగా ఉండడంతో పదోతరగతితోనే చదువు మానేశారు. దూరవిద్య ద్వారా బి.ఏలో చేరారు. నాటికల్లో బిజీగా ఉండి అది కూడా పూర్తి చేయలేదు.
చేజారిన అవకాశం
15 ఏండ్లు వయసులో జగపతి ఆర్ట్స్ వారి ప్రొడక్షన్లో జగపతిబాబుతో 'సింహస్వప్నం' అనే సినిమాకు హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో వెండితెరపై కూడా తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. అయితే యాక్సిడెంట్ వల్ల షూటింగ్కి వెళ్ళలేకపోయారు. మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టారు.'గోగ్రహణం','సింహాద్రి అప్పన్నా కొండదిగిరా', 'పావలా', 'అనగనగా ఒక రోజు', 'తేనె టీగలు పగబడతాయి', 'లేడీ పంజా', 'కన్యాశుల్కం' లాంటి అద్భుతమైన నాటికల్లో కీలక పాత్రలు పోషించారు.
మళ్ళీ ఎదురుదెబ్బ
అప్పట్లో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు వాళ్ళ ఊరికి వస్తున్న సందర్భంగా ఓ ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్లో సుధాకర్రెడ్డి అనే కెమెరామెన్ రాధను చూసి సినిమా అవకాశం ఇప్పించారు. అయితే సినిమాల్లో నటించడానికి ముందు తల్లి ఒప్పుకోలేదు. ఇప్పటికే 'నీ కూతురు నాటికలు వేస్తూ కులం పరువు తీస్తుంది' అంటూ అందరూ నానా మాటలు అనేవారు. ఇప్పుడు సినిమాలంటే ఇంకెన్ని అంటారో అని ఆమె భయపడింది. అంతేకాక అప్పట్లో సినిమాలంటే మద్రాస్ వెళ్ళాలి. ఆడపిల్లను అంత దూరం పంపించడం కూడా ఆమెకు ఇష్టం లేక వద్దని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. కానీ మళ్ళీ నెల తర్వాత వాళ్ళే మళ్ళీ అడిగారు. 'మీ అమ్మాయి బాధ్యత మాది. ఆమెతో పాటు మరొకరు తోడుగా రావొచ్చు. వాళ్ళ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం' అని అగ్రిమెంట్ రాసిచ్చారు. దాంతో తల్లి ఒప్పుకుంది. అప్పుడే 'శ్రీదేవి నర్సింగ్ హోం' సినిమాలో హీరోయిన్గా చేశారు. అయితే కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. అలా రెండు సార్లు వెండితెరపై కనిపించే అవకాశం చేజారిపోయింది.
పట్టువదలకుండా...
కొంత కాలం పట్టువదలకుండా ప్రయత్నించగా 'పరువు ప్రతిష్ట' సినిమాలో సుమన్కు చెల్లెలిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత 'కూతురు'లో ఊహకు అక్కగా, 'సహనం'లో ప్రకాశ్రాజ్ భార్యగా చేశారు. మెల్లమెల్లగా అవకాశాలు పెరగడంతో 1992లో హైదరాబాద్ వచ్చేశారు. అయితే రాధకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతిగా మారింది. ఈమె చూడటానికి హీరోయిన్ రాధలా ఉండడంతో రాధా ప్రశాంతిగా ఆమె పేరు స్థిరపడి పోయింది. ఆ తర్వాత 'గోకులంలో సీత', 'పెళ్ళి పందిరి', 'పెళ్ళి కానుక', 'ఎర్రసూర్యుడు', 'అందరూ అందరే'... ఇలా దాదాపు 100 సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేశారు.
విభిన్న భాషల్లో...
ఆమె కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాలేదు. ఎక్కడ అవకాశం వచ్చినా ఉపయోగించుకున్నారు. అలా ఓ మళయాళం సినిమాలో హీరోయిన్గా చేశారు. హిందీలో రెండు సినిమాలు, ఓ సీరియల్లో నటించారు. అలాగే తమిళం, కన్నడలో ఒక్కొక్క సినిమా చేశారు. ఇంకా 'అన్వేషిత' అనే తెలుగు సీరియల్లో 'కాత్యాయిని'గా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత 'కళంకిత' అనే సీరియల్లో కూడా నటించారు.
కుటుంబం తర్వాతే పెండ్లి
సినిమాల్లో నటించేటప్పుడు ఎంతో మంది ఆమెకు ప్రపోజ్ చేశారు. అయితే పెండ్లి చేసుకుని తన సుఖం తాను చూసుకుంటే ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు, తల్లి దిక్కులేని వారవుతారని వదులుకున్నారు. చిన్నవాళ్ళు స్థిరపడిన తర్వాతనే పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యాడ్ ఫిలిం కోసం ఆమెను కలవడానికి కిరణ్కుమార్రెడ్డి అనే వ్యక్తి వచ్చారు. అలా పరిచయమైన ఆయన కొంత కాలానికి పెండ్లి చేసుకుందామని అడిగారు. కానీ ముందు ఆమె ఒప్పుకోలేదు. ఆయన రెండేండ్లు ఎదురు చూశారు. చివరకు చెల్లెళ్ళు, తమ్ముడిని స్థిరపరిచి అప్పుడు కిరణ్కుమార్రెడ్డిని పెండ్లి చేసుకున్నారు.
సామాజిక సేవకురాలిగా...
పెండ్లి తర్వాత నటనకు దూరమయ్యారు. భర్త రాజకీయాల్లో ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. తర్వాత కొంత కాలం కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు. అప్పటికే ఆర్థికంగా కాస్త స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి తల్లి కష్టాలు చూసిన ఆమె పేదలకు, ఒంటరి మహిళలకు, పిల్లలకు ఎంతోకొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ఊరిలోని డప్పు కళాకారులైన 25 మందికి ఇండ్లు నిర్మించి ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ చదివే పిల్లలకు ఫీజలు కట్టి సాయం చేశారు. ఇప్పటికీ తనకు తోచిన సాయం చేస్తూ సోషల్ వర్కర్గా సమాజానికి తన వంతు కృషి చేస్తున్నారు. సొంత ఊళ్ళో గుడి కూడా కట్టించారు. సామాజిక సేవకురాలిగా రాధ చేస్తున్న సేవలకు మెచ్చి 2013లో రాష్ట్రపతి చేతుల మీదుగా 'స్త్రీ శక్తి' పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే 2017లో థియోలాజిల్ ఓపెన్ యూనివర్సిటీ(యుఎస్ బర్కిలీ) డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.
ఇప్పటికైనా నటిస్తా
నేను కోరుకున్నట్టు గొప్ప గొప్ప అవకాశాలు రాకపోయినా కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, పీఎల్ రాంచంద్రరావు గారు లాంటి డైరెక్టర్లు నా టాలెంట్ను గుర్తించి అవకాశాలు కల్పించారు. మంచీ చెడూ అనేవి అన్ని రంగాల్లో ఉంటాయి. అయితే ఈ గ్లామర్ ఫీల్డ్లో కాస్త ఎక్కువ. ఇప్పటికైనా అవకాశం వస్తే నటించాలని ఉంది. కాకపోతే నేను కోరుకున్న పాత్రలు కావాలి. మహిళను స్ట్రాంగ్గా, శక్తిగా చూపించాలి. నా కోసం అలాంటి పాత్రలు చేసి ఎవరు రిస్క్ తీసుకుంటారు. అయితే ఎవరైనా ఇస్తే మాత్రం కచ్చితంగా నటిస్తాను.
ఎవరికీ లొంగిపోవద్దు
ఆడపిల్లలపై ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వస్తారు, ఆదుకుంటారు అని ఎదురు చూడడం అనవసరం. మగవాళ్ళతో మనం కూడా సమానం. ముందు దీన్ని ప్రతి మహిళా నమ్మాలి. మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలి. సమాజంలో శక్తులగా తయారవ్వాలి. మనల్ని మనం కాపాడుకునే ధైర్యాన్ని నింపుకోవాలి. గుండె ధైర్యంతో ఎలాంటి వారినైనా జయించవచ్చు. ఒకరికి లొంగిపోయి బతికే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోవద్దు. నా దృష్టిలో డబ్బులు, కత్తులు, తుపాకుల కంటే మహిళకు ముందు ఉండాల్సింది ధైర్యం.
అవకాశాల కోసం తలవంచను
హీరోయిన్ పాత్రల కోసం వచ్చిన మీరు క్యారెక్టర్ ఆరిస్టుగానే ఎందుకు ఉండాల్సి వచ్చిందని ఆమెను అడిగితే 'ఓసారి నేను అక్కినేని నాగేశ్వరావుగారిని కలిసి, ఇప్పటి వరకు ఐదువేల నాటికలు వేశాను. హీరోయిన్గా ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటాను. మీరే ఎలాగైనా మాట సాయం చేయమని అడిగాను. దానికి ఆయన 'ఈ ఇండిస్టీలో ఎదగాలంటే తెరపైన కాదు జీవితంలో నటించాలి. నువ్వూ అలా నటించాలనుకుంటే హీరోయిన్గా అవకాశాలు వస్తాయి. లేదంటే పెండ్లి చేసుకుని సెటిలైపో. రికమండేషన్లతో పనులు కావు' అన్నారు. అప్పుడే నిర్ణయించుకున్నాను. అవకాశాల కోసం దిగజారాల్సిన అవసరం లేదని. అందుకే వచ్చిన అవకాశాలనే ఉపయోగించుకున్నాను' అన్నారు.
- సలీమ