Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి శుభాక్షాంశలు
పల్లెలన్నీ మంచుదుప్పటి కప్పుకొని, పుడమి పొత్తిళ్ళపై నిద్రిస్తున్న వేళ వేకువజామున హరినామ సంకీర్తనతో మేల్కొలిపే సంబరం. ఇంటిల్లిపాది ముచ్చటగా మూడు రోజులు ప్రకృతితో మమేకమై కాలానుగుణంగా వచ్చే మార్పులకు స్వాగతం పలుకుతూ జరుపుకొనే ఉత్సవం. పండుగలా గాక ప్రతి యేడు 'అతిథి'గా వచ్చే ఆడంబరం 'మకర సంక్రాంతి'
సూర్యగమనం వల్ల కలిగే సమ్యక్ క్రాంతి - 'సంక్రాంతి'. సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ పన్నెండు నెలల్లో పన్నెండు రాశుల్లో చేరే ప్రతీకాలం సంక్రాంతే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినపుడు వచ్చే మార్పు స్పష్టంగా అగుపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సూర్యుడుఉత్తరాభిముఖంగా పయనించడమే. అంతవరకు ఎక్కువగా ఉండే రాత్రి సమయం తగ్గుతూ పగటి సమయం పెరుగుతుంది. ఈ కాలాన్ని ఉత్తరాయనం అంటారు. 'ఆయనం' అంటే సూర్యుని దక్షిణోత్తర దిశల పోకడ. సూర్యుడు మకర సంక్రాంతినుంచి కర్కాటక సంక్రాంతివరకు ఉత్తరాభిముఖంగా సంచరించేకాలం ఉత్తరాయనమని, కర్కాటకం నుండి మకర సంక్రాంతివరకు దక్షిణాభిముఖంగా చేసే గమనాన్ని దక్షిణాయనంగా పిలుస్తారు. దక్షిణాయనం పితృదేవతలకు అనుకులూమైనది కాగా... ఉత్తరాయనం దేవతలకు ఉత్తమమైనది. జ్ఞాన మార్గమై, పుణ్యఘడియలుగా రూపాంతరం చెంది పుణ్మాత్ములను స్వాగతించి పునీతులను చేసే మహత్తర కాలంగా పరిగణిస్తారు.
సూర్యమానం ప్రకారం...
మన పండుగలన్నీ తిథిని అనుసరిస్తూ చాంద్రమానం ప్రకారం జరిపేవి. సంక్రాంతిమాత్రం సూర్య గమనాన్ని బట్టి వస్తుంది. ఇది మూడు రోజుల పండుగ. మొదటిరోజు భోగి. దక్షిణాయనానికి ముగింపు సూచకంగా భోగి మంటలు వేసి చలి కాచుకుంటారు. భోగినాడు నువ్వు పిండితో అందరూ అభ్యంగన స్నానం చేస్తారు. సాయంత్రం పూట చిన్న పిల్లల బాలిరాష్టాలు తొలగిపోవడానికి రేగిపండ్లతో దిష్టి తీస్తారు. భోగి అంటే భోగ ం. భోగి పండుగకు సంబంధించి అనేక ఆధ్మాత్మిక కథనాలున్నాయి. అవన్నీ పక్కన పెడితే... శీతాకాలం దాదాపు పంటచేతికి వచ్చి ఇంట్లో సామాన్లు పెట్టేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి ఉంటుంది.. అందుకే ఇంట్లో పనికి రాని సామాన్లన్నీ భోగి మంటల పేరుతో దహించి వేస్తారు.. ఇది ఒక రకం ఇల్లు ను పనికి రాని వస్తువులను వదిలించుకునే పద్ధతి. ఒకప్పుడు గ్రామాల్లో కందులు, ఆముదాలు కొట్టంగా లొట్ట మిగిలేది. ఆ లొట్టకట్టెలన్నీ.. ఎదురుకొచ్చి చలిమంటలు వేసుకునేవాళ్లు. నోట్ల పండ్ల పుల్ల వేసుకుని చలిమంట ముందు నిలబడి... ఎన్ని ముచ్చట్లో! ముందు కాచుకుంటుంటే వెనుక చలిపెడుతుందని... వెనక్కి మరలి కూర్చుని ఆటలు. గిట్టని వాళ్ల మీదకు పొగను పంపుతూ పాడే పాటలు.. ఒకటా రెండా! పట్టణాలనుంచి పల్లెలకు వెళ్లినవారిని... అక్కడినుంచి వచ్చిపొయ్యే ప్రతి ఒక్కరు పలకరింపుల్లో తడిచిపోతూ... చలిమంట దగ్గర కాచుకుంటూ ఎన్ని... మధురమైన జ్ఞాపకాలు. సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రతి రోజూ ఇండ్ల ముందల ప్రతిఫలించే దృశ్యం. ఇప్పుడు ఇండ్ల చుట్టూ ప్రహారీలు వచ్చాయి. అవి మనుషుల మధ్యా.. మనసుల మధ్య సైతం గోడలు కట్టాయి. ఒకప్పుడు గల్లీకొకటిగా కనపడే చలిమంటలు ఇప్పుడు కాస్త పలుచనయ్యాయి.
సంక్రాంతి పొంగలిలో...
సంక్రాంతి నాడు చేసే పొంగలికి బియ్యం, నవ్వులు, బెల్లం ఉపయోగిస్తారు. దీనితోపాటు పండుగ రోజు పిండితో అరిసెలు చేస్తారు వీటిలో కూడ పోషక విలువలు అధికంగా ఉంటాయి. కడిగిన బియ్యం నీటిని పంచదారతో సేవించడం వల్ల మూత్ర విసర్జన బాగా జరుగుతుంది. దప్పిక తగ్గుతుంది. వేసవిలో ఎండను తగ్గిస్తుంది. తిదోషహరిణిగా పనిచేస్తుంది. శరీరానికి కార్బోహైడ్రేట్లు అధికంగా అందుతాయి. నవ్వులు శరీరంలో ఉష్ణ ఉత్పత్తిని పెంచుతాయి. ఔషధ గుణం ఉంటుంది. మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు అరిగిపోయినప్పుడు వాటిని సరిచేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక బెల్లం రక్తవ ద్ధికి పనిచేస్తుంది. శరీరంలో ఖనిజలవణాలను పెంచుతుంది. ఉష్ణ, తుష్టి, శరీరంలో కాంతిని పెంచుతుంది. కోప, తాపాలను తగ్గిస్తుంది. హద్రోగనివారిణిగా పనిచేస్తుంది. సర్వదోష లక్షణాలు ఉంటాయి. ఇన్ని ఆరోగ్య రహస్యాలున్న పొంగలిని... కొసరికొసరి వడ్డించుకుంటూ అందరూ కలిసి తినడం ఓ అద్భుతమైన అనుభవం.
పతంగుల పండుగ...
తెలంగాణలో కనుమ అంటే పతంగుల పండుగ. చిన్నాపెద్దా అంతా కలిసి.. పతంగులై గాలిలో తేలిపోతుంటారు. రెండు వెదురు పుల్లలు, రంగు కాయితాలు లేదంటే న్యూస్ పేపర్లు, కాస్తంత మైదా, దారం ... పతంగి రెడీ! చిన్ని చిన్ని చేతులతో, రంగు కాయితాలు కత్తిరించి, అతికించి. పిల్లల గుంపంతా ఒక దగ్గర చేరితే ఎన్ని కళలు బయటపడేవో. ఒక చేతిలో మాంజా, మరో చేతులో పతంగి పట్టుకుని చెలక వరాలపై పరుగులు పెడుతుంటే... ఎంత ఆనందమో! గాలిని అర్థం చేసుకుంటూ ఒడుపుతో డీల్ కడుతూ... ఖీంచ్కాట్లు కొడుతూ.. గెలుపుకోసం ఓ యుద్ధమే. మధ్యలో ఎవరైనా కట్ కొట్టిర్రా... దారం తెగిన గాలిపటం కోసం ఎంత వెదుకులాటనో! ఏ చెట్టు కొమ్మనో చిక్కి దక్కకపోతే బాధ... దక్కితే మళ్లీ పోరాటం కోసం ప్రయత్నం. ఎంత బాగుండేదో! ఇప్పుడు ప్లాస్టిక్ మాంజాలొచ్చారు! ఒక పతంగి పోతే... పోయిందే అన్న బాధ లేదు... దాని బదులు మరోటి కొనుక్కుందాంలే ఈజీగీ తీసుకునే తత్వం. అప్పటి వెదుకులాటకి... ఇప్పటి పోయిందిలే అనుకోవడానికి మధ్య ఎంత మార్పు! గుర్తు చేసుకున్నప్పుడల్లా మనసంతా బాధతో మూలుగుతుంటుంది.
హరిదాసులు, గంగిరెద్దులు ఒకప్పటి మాటలు. ఇప్పుడు హరిదాసుల సంకీర్తనలు లేవు. గంగిరెద్దుల ఆటలు లేవు. పండుగైనా పబ్బమైనా టీవీలకే అతుక్కుపోతున్నాం. పట్నం నుంచి శరీరం మాత్రమే పల్లెకు పోతోంది. మనుషులు ఎంత దగ్గరగా ఉన్నా.. మునుపటిలా మనసులు దగ్గర కావడం లేదు. పలకరింపులు నామమాత్రాలయ్యాయి. మర్యాదలు మొక్కుబడిగా మారాయి. ఇంట్లో ఉన్నా సెల్ఫోన్తోనో, ల్యాప్టాప్తోనో, టీవీతోనో నిరంతర సంభాషణ చేస్తున్నాడు మనిషి. అందుకే ఈ పర్వదినాన్నైనా గాడ్జెట్స్ని కాస్త పక్కన పెట్టేద్దాం. మనుషులతో ఉందాం. మనస్ఫూర్తిగా కలిసి ఉందాం. పని ఒత్తిళ్లు, ఆందోళనలు ఎప్పుడూ ఉండేవే. వాటన్నింటినీ పక్కన పెట్టి... ఇరుగుపొరుగుతో సంతోషాన్ని పంచుకుందాం. పతంగులతోపాటు మనసులను ఎగరేసి ఆనంద డోలికల్లో తేలిపోదాం!పర్వదినం.