Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపర్ణాపోపట్, (18 జనవరి, 1978)
బ్యాడ్మింటన్ క్రీడారంగంలో అందరికీ తెలిసిన పేరు. ఎనిమిదేండ్ల వయసులోనే బ్యాట్ చేతపట్టి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలుచుకున్న భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాపోటీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ...ఆటపై తనకు ఉన్న మక్కువను చాటుకుంటున్నారు.
ముంబాయిలో గుజరాతీ కుటుంబంలో జన్మించిన అపర్ణా చాలా చిన్న వయసులోనే క్రీడారంగంలో అడుగుపెట్టారు. ఆమె తల్లిదండ్రులు హీనా పోపట్, లాల్జీ పోపట్. ముంబాయి లోని జె.బి.పెటిట్ పాఠశాలలో చదువుకున్నారు. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలోనూ ఇంటర్ పూర్తి చేసిన అపర్ణా ముంబాయి విశ్వవిద్యాలయం నుంచి గణాంకశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. చదువుతో పాటు క్రీడారంగంలోనూ తనదైన ప్రతిభను ఆమె కనపరిచారు.
అపర్ణా ఎనిమిదేండ్ల వయసులోనే బ్యాట్ చేతబట్టారు. ఆమెలోని ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ప్రముఖ కోచ్ అనిల్ ప్రధాన్ వద్ద చేర్చారు. ముంబాయిలో ఉన్నప్పుడు పదేళ్ళపాటు అనిల్ ప్రధాన్ శిక్షణ ఇచ్చాడు. అతని శిక్షణలో ఆమె భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సుస్థిర స్థానం సాధించారు. ఆ తర్వాత అపర్ణ1994లో బెంగుళూరు లోని ప్రకాష్ పడుకోనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేరారు.
1998లో అపర్ణ మంజుషా పవన్గడ్కర్ ను ఓడించి మొదటిసారిగా జాతీయ సీనియర్ టైటిల్ సాధించారు. 1998 నుంచి ప్రతి ఏటా జాతీయ సీనియర్ టైటిల్ను చేజిక్కించుకుంటూ తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆమె ఆటతీరు ప్రత్యేకంగా ఉండేది. ఒక్కక్కసారి ఆమెకు అసలు పోటీ లేనట్టుగా అతి సునాయాసంగా విజయం సాధించేవారు. సార్క్ చాంపియన్షిప్ లో స్వర్ణపతకాన్ని సాధించారు. 1996లో హాంగ్కాంగ్లో జరిగిన ప్రిన్స్ జూనియర్ ఇన్విటేషన్ టోర్నమెంటులో కాంస్యపతకం సాధించారు. అదే సంవత్సరం డెన్మార్క్ లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ లో రెండో స్థానం లో నిలిచారు. 1998లో పారిస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లోనూ, అదే ఏడాది కౌలాలంపూర్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలోనూ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. 2002లో మాంచెస్టర్ కామన్వెల్త్ క్రీడలలో కాంస్యం సాధించడంతో పాటు 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004 ఒలింపిక్ క్రీడలలో పాల్గొని తొలి రౌండులో దక్షిణాఫ్రికాకు చెందిన మెకేల్ ఎడ్వర్డ్ ను చిత్తుచేసి తదుపరి రౌండ్లో నెదర్లాండ్ కు చెందిన మియా ఆడినాతో తలపడి ఓడిపోయారు. ఆ తర్వాత 2006లో మెల్బోర్న్లో జరిగిన పోటీల్లోనూ విజయం సాధించారు. సీనియర్ నేషనల్ టైటిల్ను అందుకున్నారు. 1997 నుంచి 2006 వరకు వరుస విజయాలతో ఆమె రికార్డు సృష్టించారు. తన 17 ఏండ్ల క్రీడాజీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె చేతిగాయం కారణంగా జాతీయ చాంపీయన్షిప్ పోటీల్లో ఆడలేకపోయారు. భారత ప్రభుత్వం నుంచి 2005లో అర్జునా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ లో ప్రస్తుతం 56 వ స్థానంలో ఉన్నారు. కోచ్గానూ..బ్యాడ్మింటన్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. వ్యాఖ్యానం చేయడం ఆటకు తనను మరింత చేరువ చేస్తోందంటున్నారు.