Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సగటు మధ్య తరగతి మహిళ ఎలా ఆలోచిస్తుంది? భర్త సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాచాలని. తన కుటుంబం, పిల్లలు హాయిగా ఉండాలని. అవకాశం, సమయం దొరికితే తను కూడా సంపాదించి మరిన్ని ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచిస్తుంది. కానీ పాలపర్తి సంధ్యా రాణి అలా కాదు. తనకు ఉన్నదాంట్లోనే నలుగురికి సాయం చేస్తున్నారు. సగటు మనిషిగా నలుగరి కోసం ఆలోచిస్తున్న ఆమె గురించి కొన్ని విశేషాలు...
పాలపర్తి సంధ్యారాణి సొంతూరు గుంటూరు జిల్లా బాపట్ల. తాతయ్య పాలపర్తి భావన్నారాయణ, నాయనమ్మ సంపూర్ణమ్మ. వీరి కుటుంబమంతా సమాజం కోసం పాటుపడినవారే. ఆస్థిపాస్తులు ఎక్కువగా లేకపోయినా ఉన్నంతలో పేదలకు సాయం చేసేవారు. ఎంతో మంది పేద పిల్లల చదువులకు సాయం చేశారు. పెండిండ్లు చేయించారు. ఈమె నాన్నగారి మేనత్త కనపర్తి వరలక్ష్మిగారు స్వాతంత్య్రోమంలో సైతం పాల్గొన్నారు. ఆ కాలంతో ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. భర్త చనిపోయి చాలా మంది వితంతువులగా మిగిలిపోయేవారు. అలాంటి ఆడపిల్లలను వరలక్ష్మిగారు చేరదీసి 'స్త్రీ హితోషి' అనే సంఘం పెట్టి దాని ద్వారా వారికి చదువు చెప్పించేవారు. వృత్తి విద్యను అందించి ఉపాధి కల్పించేవారు. వితంతు వివాహాలు చేయించేవారు.
పసివయసు నుంచే...
సంధ్య తండ్రి వృత్తిరీత్యా ఇంజనీర్. వీరి కుటుంబం ఎక్కువగా ఉత్తర భారత దేశంలో ఉండేది. దాంతో సంధ్య ఎక్కువగా అటువైపే పెరిగారు. ఈమె తండ్రి అక్కడ ఉండే తెలుగు వారి ఇండ్లకు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకునేవారు. వారికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేవారు. ఈయన ప్రెసిడెన్సీ అవార్డు కూడా అందుకున్నారు. ఇలా సమాజానికి సేవ చేసేవారు, రచయితలు, జర్నలిస్టులు సంధ్య కుటుంబంలో ఉన్నారు. అలాంటి వారి భావాలను పుణిచి పుచ్చుకుని పుట్టారు ఆమె. చిన్నతనంలో తన పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బును పేద పిల్లల అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించేవారు. పసివయసు నుంచే సమాజం కోసం తన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా క్షణాల్లో వాలిపోయేవారు. వయసు పెరిగే కొద్దీ తనలోని సేవాభావాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
చదువుకునే వారికే ప్రాధాన్యం
పెండ్లి తర్వాత భర్త సహకారం కూడా అందింది. పండుగలకు, ఫంక్షన్లకు బట్టలు కొని డబ్బు వృధా చేయకుండా ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేసేవారు. పేద పిల్లలకు ఫీజులు కట్టేవారు. పుస్తకాలు కొనిపెట్టేవారు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి పండ్లు, బట్టలు పంచిపెడుతున్నారు. ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన సేవలను మరింతగా విసృతపరచాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల తన సొంత ఊరైన బాపట్లలో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు పిల్లలకు ఐదు వేల రూపాలయ పారితోషికం అందించారు. అలాగే వివిధ పాఠశాలలకు వెళ్ళి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. చదువు విషయంలో పిల్లలను ఎంతో ప్రోత్సహిస్తున్నారు.
మరెన్నో చేయాలని
వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే మహిళలు ముందడుగు వేస్తున్నారు. అలాంటి మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. అందుకే అలాంటి మహిళలకు తనకు తోచిన సాయం చేస్తున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానిస్తున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం కోసం కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్నారు. తమ్ముడు, చెల్లి కూడా సేవలో ఈమె బాటలోనే నడుస్తున్నారు. సగటు సాధారణ గృహిణిగా నేనూ నా కుటుంబం అనుకుంటూ ఇంటికే పరిమితం కాకుండా ఇలా నలుగురి గురించి ఆలోచించే పాలపర్తి సంధ్యారాణి సమాజానికి ఉపయోగపడే విధంగా మరెన్నో చేయాలని కోరుకుంటూ...