Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్వెజ్ అనగానే మటన్, చికెన్లే గుర్తొస్తాయి. కానీ ఇది చేపల కాలం. మంచి కొవ్వును కలిగి ఉండి... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం చేప. ఆ చేపతో పులుసు, కూర, ఫ్రై వంటి రెగ్యులర్ వంటలు కాకుండా కొత్తవి ట్రై చేస్తే బాగుంటుంది కదా! పొరుగింటి కూర పుల్లన అంటారు... పొరుగు రాష్ట్రాల కూరలయితే మరింత రుచి. అందుకే చేపలతో ఇతర రాష్ట్రాల రుచులను మీరూ ప్రయత్నించండి!
పెషావరీ ఫిష్
కావలసినవి: చేపముక్కలు- 8, సెనగపిండి- 200గ్రా., అల్లంముద్ద- టీస్పూను, వెల్లుల్లిముద్ద- టీస్పూను, వాము- టీస్పూను, కారం- టీస్పూను, నిమ్మకాయ- ఒకటి, కోడిగుడ్డు- ఒకటి, పెరుగు- 100గ్రా., ఉప్పు- తగినంత, నూనె- డీప్ ఫ్రై చేయడానికి సరిపడా, చాట్ మసాలా- 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం: చేపల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేయాలి. ఆ ముక్కల్ని మళ్లీ మధ్యలోకి కోయాలి. తరవాత అల్లం, వెల్లుల్లి, కారం, నిమ్మరసం చేపముక్కలకు పట్టించి అరగంటసేపు నానబెట్టాలి. సెనగపిండిలో కోడిగుడ్డు, పెరుగు, ఉప్పు, వాము వేసి అవసరమైతే కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలిపి పెట్టాలి. అరగంట తరవాత చేపముక్కలను సెనగపిండి మిశ్రమంలో వేసి పావుగంటసేపు పక్కనపెట్టాలి. ఓ కళాయిలో నూనె వేసి బాగా కాగాక, రెండు మూడు చేపముక్కల చొప్పున వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. బంగారు రంగులో వేగిన చేపముక్కలను ఓ ప్లేటులో పెట్టి నిమ్మరసం పిండి చాట్మసాలా చల్లి వడ్డించాలి.
చేపల పకోడి
కావలసిన పదార్థాలు: చేపలు - పావుకిలో, మొక్కజొన్నపిండి - ఒక కప్పు, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: చేప ముక్కల్లోంచి ముల్లులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేయాలి. అందులో మొక్కజొన్నపిండి, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఈ పిండిని చిన్న చిన్న పకోడీల్లా వేసి కాల్చుకోవాలి. దీంతో ఎర్రగా వేగిన చేపల పకోడీలు తయారయినట్టే.
చెట్టినాడ్ ఫిష్ కర్రీ
కావలసిన పదార్థాలు :చేపముక్కలు - అరకిలో, చింతపండుగుజ్జు - పావుకప్పు, నిమ్మకాయ - ఒకటి, పసుపు - టీస్పూను, కొత్తిమీర-కట్ట, ఉప్పు - తగినంత, నూనె-2 టేబుల్స్పూన్లు, మెంతులు-అరటీస్పూను, ఆవాలు-అరటీస్పూను, ఉల్లిపాయలు(చిన్నవి)- పది, వెల్లుల్లి -5 రెబ్బలు, టొమాటో -ఒకటి, కరివేపాకు- కొద్దిగా
మసాలా ముద్దకోసం: కొబ్బరితురుము-పావుకప్పు, జీలకర్ర-టీస్పూను, కారం-ఒకటిన్నర టీస్పూన్లు, దనియాలపొడి-ఒకటిన్నర టీస్పూన్లు, ఉల్లిపాయ-ఒకటి, టొమాటో- ఒకటి.
తయారుచేసే విధానం: మసాలాముద్దకోసం తీసుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కల్ని దేనికది వేయించి రుబ్బాలి. అందులోనే కొబ్బరిముద్ద, దనియాలపొడి, కారం, జీలకర్రపొడి వేసి కలిపి ఉంచాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, కరివేపాకు, మెంతులు వేసి వేగాక వెల్లుల్లిముక్కలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. టొమాటోముక్కలు వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి 20 నిమిషాలు మరిగించాలి. కడిగిన చేపముక్కలు వేసి ఉడికేవరకూ ఉంచి, కొత్తిమీర తురుము చల్లి, దించి నిమ్మరసం పిండాలి.
కొరమీను టిక్కా
కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసి ఉడికించిన కొరమీను చేప - అరకేజీ, తాజా క్రీం - పావు కప్పు, సగం నిమ్మ చెక్క - రసం తీసుకోవాలి, జీడిపప్పు - ఎనిమిది బాదం - నాలుగు, గసగసాలు - పావుచెంచా (ఈ మూడింటిని విడివిడిగా నీటిలో నానబెట్టుకోవాలి) అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కసూరీమేతి పొడి - సగం చెంచా చొప్పున, కొత్తిమీర తురుము - పావుకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, ఎండుమిర్చి ముద్ద, మొక్కజొన్న పిండి - రెండు చెంచాల చొప్పున, నూనె - వేయించడానికి తగినంత.
తయారు చేసే విధానం: నానబెట్టిన బాదం, జీడిపప్పు, గసగసాలను తీసుకుని మిక్సీలో మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చేప, నూనె తప్ప, పైన పేర్కొన్న మిగిలిన పదార్థాలు, ముందుగా రుబ్బి పెట్టుకున్న బాదం మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని పదినిమిషాల పాటు బాగా కలపాలి. దీన్ని ఫ్రిజ్లో అరగంట ఉంచాలి. ఇప్పుడు మరో గిన్నెలో వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి. ఇది బాగా వేడయ్యాక మంటను మధ్యస్థంగా ఉంచాలి. సిద్ధం చేసి పెట్టుకున్న చేప మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసి ఈ నూనెలో వేసుకోవాలి. బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే పసందైన కొరమీను టిక్కా తయారైనట్టే. నిమ్మరసం చల్లిన ఉల్లిపాయముక్కలతో కలిపి వడ్డించండి. చాలా రుచిగా ఉంటుంది. మరీ నూనె ఎక్కువగా ఇష్టపడనివారు పెనం మీద కూడా రెండుమూడు చెంచాలతో వేయించుకోవచ్చు.
కొబ్బరి పాలతో ఫిష్ కర్రీ
కావాల్సిన పదార్థాలు: చేపముక్కలు : 4, ఉల్లిపాయ పేస్ట్ - 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ - 2స్పూన్లు, జీలకర్ర పోడి - ఒక స్పూన్, కారం పొడి - 2 స్పూన్లు, పసుపు పొడి - 1 స్పూన్, గరం మసాలా పొడి - అర స్పూన్, జీలకర్ర - 1 స్పూన్, కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు, నూనె - 2 స్పూన్లు, ఉప్పు - సరిపడా.
తయారు చేసే విధానం: చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వేయించకూడదు. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేపముక్కలను మరో ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, బిర్యానీ అకు వేసి నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే జీలకర్ర పొడి, కారం, వేసి మరో 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా కొబ్బరి పాలను వేగుతున్న మసాలా మిశ్రమంలో పోసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, చేప ముక్కలు వేసి మిక్స్ చేసి చేపముక్కలు మెత్తగా ఉడికే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చివరిగా అందులో గరం మసాలా పొడి వేసి మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బెంగాలి ఫిష్ కర్రీ రెడీ.