Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలతో మమేకమై ఉంటూ.. వారి సమస్యల సాధనకు శాయశక్తుల ప్రయత్నం చేయడమే సివిల్ సర్వెంట్గా తన బాధ్యత అంటారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వెస్ట్జోన్ కమిషనర్ దాసరి హరిచందన ఐఎఎస్. ఏ శాఖలో పనిచేసినా తనదంటూ ప్రత్యేకమైన మార్కు కనిపించేలా ఆమె పనితీరు ఉంటుంది. కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించినా.. మరే ఇతర శాఖలో పనిచేసినా.. తనదైన శైలిలో ప్రజాసమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పుడు విశ్వనగరంలో పరిశుభ్రతతో పాటు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పేపర్లెస్ ఆఫీస్గా వెస్ట్జోన్ మున్సిపల్ ఆఫీన్ని మార్చారు. నగరంలో మహిళలకు ప్రత్యేకమైన టారులెట్స్ ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈనెల 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని.. వ్యర్థాల విడాకుల దినోత్సవంగా నిర్వహించే పనుల్లో బిజీగా ఉన్నారు. స్వచ్ఛమైన వాతావరణం కోసం 'మనసులు కలపండి.. చెత్తను వేరు చేయండి' అంటున్న ఆమె మానవితో చెప్పిన అంశాలు...
నాన్న దాసరి శ్రీనివాస్, రిటైర్డ్ ఐఎఎస్. అమ్మ గృహిణి, నేను, అన్నయ్య. నాన్న ఐఎఎస్ కావడంతో తరచుగా బదిలీలు ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాలను చిన్నతనంలోనే చూశాను. పదవ తరగతి వరకు జిల్లాల్లోనే చదువుకున్నాను. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్లో చదివాను. అక్కడే రెండేండ్లు ప్రైవేటుగా ఉద్యోగం చేశాను. ఒక ఏడాది పాటు ప్రపంచ బ్యాంకులోనూ వర్క్ చేశాను. శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను విశ్లేషణాత్మక దృష్టితో పరిశీలించడం నా అలవాటు. నాన్న సివిల్ సర్వెంట్ కావడంతో చిన్నతనం నుంచే ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ఈ జాబ్లో ఉండే ఆత్మసంతృప్తి మరే జాబ్లోనూ ఉండదు. పాలసీ మేకింగ్లో కీలకపాత్ర పోషించే అవకాశం సివిల్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది. పిజీ తర్వాత జాబ్ చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ప్రతి ఏడాది సివిల్స్ ఎగ్జామ్ ప్యాట్రన్ మారుతుంది. చుట్టూ ఉండే ప్రపంచాన్ని గమనిస్తూ.. జనరల్ నాలెడ్జ్ను పెంచుకునేదాన్ని. నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాను. 2010లో ఐఎఎస్గా సెలక్ట్ అయ్యాను.
వైజాగ్లో ఫస్ట్ పోస్టింగ్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అసిస్టెంట్ కలెక్టర్గా ఏడాది పాటు పనిచేశాను. ఆ తర్వాత విజయవాడ సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను. నేషనల్ హైవేను విస్తరించడంతో భాగంగా హైవే సమీపంలోని ఉన్న వ్యవసాయ భూములను రైతుల నుంచి తీసుకోవల్సి వచ్చింది. చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. వారందరినీ ఒప్పించడంతో పాటు మంచి ప్యాకేజీలో నష్టపరిహారం వారికి అందేలా చర్యలు తీసుకున్నాం. అభివృద్ధిలో భాగంగా కొన్నిసార్లు ప్రజలను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అయితే జరుగుతున్న అభివృద్ధి తమకోసమే అన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడితే వారే ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తారు అన్నది ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఆ తర్వాత జిఎడిలో డిప్యూటీ సెక్రటరీగా కొంతకాలం పనిచేశాను.
పేద వారి సొంత ఇంటి కల నిజం చేస్తూ...
రాష్ట్ర విభజన తర్వాత మున్సిపల్ శాఖలో పనిచేసే అవకాశం వచ్చింది. సెంట్రల్ జోన్లో పనిచేసే సమయంలో కవాడిగూడలో ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తొమ్మిది నెలల రికార్డు టైమ్లో పూర్తి చేసి లభ్దిదారులకు అందించాం. మన రాష్ట్ర ప్రభుత్వం అంచలంచెలుగా మొత్తం లక్షా92వేల మందికి సొంత ఇంటికలను నిజం చేయాలన్న ప్రణాళికతో ఉంది. మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
స్వచ్ఛ భారత్ దిశగా..
పెరుగుతున్న జనాభా కారణంగా నగరంలో కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని నివారించడానికి పార్క్లను అభివృద్ధి చేస్తున్నాం. కాలనీ స్థాయిలోనూ పచ్చదనం పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటిలో పాటు చెత్త పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి తడి, పొడి చెత్తలను వేరు చేసి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నాం. కమ్యూనిటీ స్థాయిలో స్వేచ్ఛ దూతలుగా స్వచ్ఛందంగా పనిచేయడానికి చాలామంది మహిళలు ముందుకు వచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవల్సిన బాధ్యతపై వీరికి శిక్షణ ఇచ్చాం. వీరు ఇంటింటికి తిరిగి చెత్తను బయట పారేయకుండా రిక్షాలోనే వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్తలను వేరుచేయడం వల్ల పర్యావరణానికి కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఈ రోజు మనం తీసుకునే జాగ్రత్తలు మన ఆరోగ్యానికే కాదు.. రేపటి మన పిల్లల భవిష్యత్కు ఎంతో అవసరమని వివరిస్తున్నారు. ఒక్కొక్క మహిళ ఒక శక్తిగా మారి.. వందలాది మందిని స్వచ్ఛ భారత్ దిశగా నడిపిస్తున్నారు.
పేపర్లెస్ ఆఫీస్గా..
పేపర్ ఎంతో విలువైంది. మనకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పేపర్ను తక్కువగా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. మా ఆఫీస్ కంప్లీట్గా పేపర్లెస్ ఆఫీస్గా మార్చేశాం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు తప్ప ఇతర అన్ని రకాల కార్యకలాపాలు, డాక్యుమెంట్లు ఈ-డాక్యుమెంట్ల రూపంలోనే జారీ చేస్తున్నాం. దీంతో ఫైళ్ళ పెండింగ్ అనేది ఉండదు. ప్రతి పని లోనూ పారదర్శకత ఉంటుంది. రికార్డ్స్ మెయింటైన్ చేయడం సులభమవు తుంది. అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ ఆఫీన్ను ఏర్పాటుచేస్తున్నాం.
ఏ ఇల్లు మునగకుండా..
వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతారు. ఈ వానాకాలంలో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలను ప్రారంభిస్తున్నాం. నగరంలోని అన్ని చెరువుల వివరాలు సేకరించి వాటికి ఎఫ్టిఎల్ (ఫూల్ ట్యాంక్ లేవల్) ఏరియాను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నాలాలపై ఉన్న 400 అక్రమ నిర్మాణాలను గుర్తించాం. ముందుగా బాటిల్ నెక్ ఏరియాలో ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేస్తాం. ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి పనులు తర్వితగతిన పూర్తి అవుతాయి. ప్రజలకు అర్థమయ్యేలా ప్రభుత్వ నిర్ణయాలను వివరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
మహిళలకు ప్రత్యేకంగా..
మల్టీటాస్కింగ్ శక్తి మహిళలకు మాత్రమే ఉంటుంది. అందుకే వారు ఇంట్లో, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తమదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ.. సాధికారత దిశగా పరుగు పెడుతున్నారు. అయితే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెరిగిన మహిళల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయలు పెరగడం లేదు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో టాయిలెట్స్ లేకపోవడంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి మలమూత్రవిసర్జనను వాయిదా వేయడం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. మన నగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా 'షి టాయిలెట్స్' నిర్మించాం. రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి ఇప్పటివరకు 20వరకు షి టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేశాం. వీటిని శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
వి. యశోద