Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 1990ల కాలం. ఓ జపనీస్ మహిళ.. ఆమె భర్త అన్యాయంగా తీసుకొని వచ్చిన తన కొడుకు కస్టడీ కోసం న్యాయవాది అస్మా జహంగీర్ కార్యాలయంలో అడుగుపెట్టింది. జహంగీర్ ఆ కేసును టేకప్ చేశారు. ఆ జపాన్ మహిళను విజయం వరించింది. కానీ అక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. కొడుకును దక్కించుకోవడానికి డిపాజిట్ చేయాల్సినంత డబ్బు ఆ మహిళ దగ్గర లేదు. జహంగీర్ ఏమాత్రం ఆలోచించలేదు. 14 లక్షల రూపాయలను ఆ మహిళకు సాయం చేశారు. క్లయింట్స్ పట్ల ఆమె చూపే సహృదయతకు ఈ ఘటన ఓ ఉదాహరణ మాత్రమే. తనకు వచ్చిన కేసుల్లో సగం కేసులను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాదించారామె. అయినా అదెప్పుడు బయటి ప్రపంచానికి తెలియాలని కోరుకోలేదు. పీడితులు, అభాగ్యులకు న్యాయం చేయడం కోసం తన జీవితాన్నంతా వెచ్చించారు.
ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్... జనవరి 1952లో లాహౌర్లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కుటుంబంలో పుట్టారామె. తండ్రి మాలిక్ గులామ్ జిలానీ సివిల్ సర్వెంట్. ఆయన పదవీ విరమణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. మిలిటరీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పనిచేసినందుకు, మిలిటరీ యాక్షన్తో మారణహౌమానికి పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనను ఎన్నో ఏండ్లు జైల్లో పెట్టింది మిలటీ ప్రభుత్వం. ఇక ముస్లిం మహిళలకు విద్య కలగా మిగిలిన రోజుల్లోనే అస్మా తల్లి కో-ఎడ్యుకేషన్ కాలేజీలో చదివారు. ముస్లిం సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడారు. ముస్లిం మహిళలు బయటికి అడుగుపెట్టలేని కాలంలోనే బట్టల వ్యాపారంలోకి ప్రవేశించి... మార్గదర్శిగా నిలిచారు. ఇలాంటి కుటుంబంలో పెరిగిన అస్మాకి చిన్నతనంలో ప్రజాస్వామిక భావాలబ్బాయి. 1972లో జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం... అస్మా తండ్రిని జైల్లో పెట్టింది. దానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారు.
కిన్నార్డ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. తరువాత పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. 1980లో ఆమె లాహౌర్ హైకోర్టులో, ఓ రెండేండ్ల తరువాత పాకిస్తాన్ సుప్రీం కోర్టులో పనిచేశారు. సీనియర్ అడ్వకేట్గా గుర్తింపు పొందిన పాకిస్తానీ మొట్టమొదటి మహిళ. పాకిస్తాన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు ఆమె మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. జియా ఉల్హక్ మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించినందుకుగాను ఆమెను మూడేండ్లపాటు జైలులో ఉంచారు. బయటికి వచ్చిన నాలుగేండ్ల తరువాత పాకిస్తాన్ మానవహక్కుల కమిషన్ స్థాపనలో భాగస్వాములయ్యారు. 1986లో ఉచిత న్యాయ సలహాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 'దస్తక్' పేరుతో మహిళలకు షెల్టర్హౌమ్ను నడిపించారు. మతోన్మాదం, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, మహిళలు, మైనారిటీలు, పిల్లల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తీవ్రమైన నిర్బంధం, వ్యతిరేకతల మధ్య నమ్మిన న్యాయం కోసం నిలబడ్డారు. పాకిస్తాన్లో మానవహక్కుల గొంతుకగా మారారు. మహిళలపై పోలీసులు చేస్తున్న ఆకృత్యాలను ఎండగట్టారు. ముస్లిం మహిళ తన గార్డియన్ (పురుషుడు) అనుమతి లేకుండా పెండ్లి చేసుకోవడానికి వీల్లేదన్న పాక్ సుప్రీం తీర్పును వ్యతిరేకించారు. 'ఇప్పటికే వేలమంది వేధింపులకు గురవుతున్నారు... ఇలాంటి ఆదేశాలు జారీ చేయడమంటే... వేధింపులకు చట్టబద్ధత కలిపించడమేన'ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1993వరకు కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేశారు. తరువాత కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. 2007లో జరిగిన లాయర్స్ మూవ్మెంట్లో అగ్రభాగాన నిలిచినందుకు ఆమెను హౌజ్ అరెస్టు చేసింది మిలటరీ ప్రభుత్వం అయినా ప్రజల పక్షాన, న్యాయం కోసమే పోరాడారు. ప్రజాస్వామిక, లౌకిక పౌర సమాజం కోసం ఆమె చేసిన పోరాటానికి గాను ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఆమెను వరించాయి.