Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ... రెండు మనసులను ఏకం చేసి... ఒకే శ్వాసగా నిలిచేది.
ఇద్దరు ఇద్దరిలాగే ఉంటూ... ఒక్కరిలాగ బతికించగలిగే ఏకైక బంధం.
నిన్ను నీలా స్వాగతించగలిగే, అంగీకరించగలిగే.. ఉత్తమమైన బంధం.
మరి అలాంటి ప్రేమ.. ప్రేయసి ప్రియులకేనా!?
తల్లి, బిడ్డా.. తండ్రి, పిల్లలు.. అక్కాచెల్లెల్లు, అన్నాతమ్ముళ్లు...
అసలు ఏ బంధమూ లేకపోయినా
ప్రతి మనిషిని ప్రేమించగలగడం, ప్రతి జీవిలో ప్రేమను చూడటం ఎంత ఉన్నతమో కదా!
కానీ ఆ ప్రేమ కుంచించుకుపోతోంది.
ప్రేమించకపోతే దాడులు.. ప్రేమించడం లేదని హత్యలు.
ఇద్దరు ప్రేమించుకుంటే పెద్దలు చెప్పే అడ్డంకులు.
ఆ తరువాత కులాంతర, మతాంతర వివాహాల్లో వచ్చే ఎన్నో ఇబ్బందులు.
వీటిని అధిగమించడంలో ఇప్పటి యువత విఫలమవుతోంది.
సమస్య ఎక్కడ వస్తోంది? పరిష్కారం ఎలా చేసుకోవాలి? తెలియక తికమకపడుతోంది.
కానీ వీళ్లలా కాదు... రాజకీయాభిప్రాయాలు కలిసి ఒక్కటైనవారు కొందరైతే... ఏ రాజకీయాలు లేకపోయినా కేవలం ప్రేమతో దగ్గరైనవారు ఇంకొందరు.
కొత్తగా ఈ బంధంలోకి అడుగిడినవారు కొందరైతే... ఏండ్లుగా తమ ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తూ విజయవంతంగా జీవితాన్నికొనసాగిస్తున్నవారు మరికొందరు.
వారందరి జీవిత కథలు... ఈ ప్రేమ కథలు...
ఉత్తరాలతో
సరిదిద్దుకుంటారు...
రాజేశ్వరి, రాజేష్. పేర్లు కూడా ఆ ఇద్దరు ఒకరికోసం ఒకరు పెట్టుకున్నారా అనిపిస్తాయి. ఇద్దరూ బీఈడీ ఒకే కాలేజీలో చదివారు. కాలేజీలో సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు ముందుండి కదిలారు. విద్యాఉ్థల నుంచి డెవలప్మెంట్ ఫీజుల పేరుమీద వసూళ్లను ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను తిరిగి విద్యార్థులకు ఇప్పించారు. ఇలా ఆలోచనలు, అభిప్రాయాలు కలిశాయి. ఇద్దరికీ ఆదర్శభావాలున్నాయి. కులాంతర వివాహంచేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. ఇద్దరు మనసులు కలవడంతో కాలేజీ చివరి రోజుల్లో అభిప్రాయాలను పంచుకున్నారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలకు చెప్పారు. కట్ చేస్తే... రాజేశ్వరి కుటుంబం నుంచి వ్యతిరేకత. ఆమెను హౌజ్ అరెస్టు చేశారు. రెండు సంవత్సరాలకు పైగా అప్పుడప్పుడు దొంగచాటుగా ఫోన్లో మాట్లాడుకోవడం తప్పించి... ఒకరినొకరు కలిసింది లేదు. దూరంగా ఉంచితే మనుషులు మారతారనుకున్నారు రాజేశ్వరి తల్లిదండ్రులు. కానీ వారిద్దరు మనసులు మరింత దగ్గరయ్యాయి. 2005లో రాజేష్ పీహెచ్డీలో చేరాడు. అప్పుడే తెలంగాణ ఉద్యమం... తీవ్రం అయ్యింది. అప్పటిదాకా కులాలు మాత్రమే వేరు. తరువాత ప్రాంతాల మధ్య విభేదాలు కూడా అడ్డంకిగా మారాయి. రాజేష్ కోసం ఇఫ్లూలో ఎమ్ఏ ఫ్రెంచ్లో చేరింది రాజేశ్వరి. 2010 నవంబర్ 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెండ్లి. రాజేష్ తరపునుంచి అందరూ వచ్చారు. కానీ రాజేశ్వరి కుటుంబం మాత్రం రాలేదు. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, గద్దర్ పెద్దలుగా... వారిద్దరి పెండ్లి.
ప్రేమ కోసం పోరాటం రొమాంటిక్గానే ఉంటుంది. పెండ్లి తరువాత ఇబ్బందులు చాలా వస్తాయి. కులాంతర, ప్రాంతేతర వివాహాలైతే ఈ సమస్యలు ఒకింత ఎక్కువే. పెండ్లి తరువాత రెండేండ్ల పాటు ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు రాజేష్. అరెస్టులు, జైలుకు వెళ్లడం, ఇంటికి సరిగ్గా రాకపోవడం. వీటన్నింటినీ అర్థం చేసుకుంది రాజేశ్వరి. ఈ సమయంలో ఫ్రెండ్స్ తోడుగా నిలిచారు. ఇప్పుడు ఏడేండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో పడిలోకి అడుగుపెడుతున్నారు. వాళ్లిద్దరికి ఒక పాప. ఈ క్రమంలో వచ్చే సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఒకరిపై ఒకరికి ఏదైనా విషయంలో కోపం వస్తే... ఉత్తరాలు రాసుకుంటారు. మొదట ప్రేమలో పడిన నాటినుండి ఇప్పటివరకు రాసుకున్న ఉత్తరాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. రాజేష్ ప్రేమ కోసం కుటుంబాన్నే కాదు... కొంతకాలం తన కెరీర్ను కూడా త్యాగం చేసింది రాజేశ్వరి. అందుకే ఇప్పుడు డాక్టర్ రాజేష్... తన రాజేశ్వరి కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఆమె డీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. కోచింగ్కు పొద్దున వెళ్తే రాత్రికిగాని ఇంటికి రాదు. కాలేజ్ అయిపోగానే పాప ఆలనాపాలన అంతా రాజేష్దే. పని విభజన తప్పనిసరి. సమస్య వచ్చినప్పుడు వెంటనే సహనం కోల్పోకుండా... దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడమే తమ లవ్లైఫ్ సక్సెస్ సీక్రెట్ అంటారిద్దరు. లోపాలుంటే ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటారు... సరిదిద్దుకుంటారు. ఎంత గొడవలు పెట్టుకున్నా... అర్థగంటకు మించి మాట్లాడకుండా ఉండలేరు.
కుల నిర్మూలన కోసం...
మాయ, సిద్ధార్థ... పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మనుసులు కలిస్తే చాలు అని నమ్మిన వాళ్లు. తల్లి చాటు బిడ్డలే. అందుకే ముసలివాళ్లమైనా సరే... ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. మాయ కుటుంబంలో తాతల కాలం నుండి వాళ్ళు బుద్ధిస్టులు. కాబట్టి వాళ్లకు కుల పట్టింపులు ఉండవని అనుకున్నారు. కానీ హిందుత్వ ప్రభావంతో భౌద్ధం బ్రాహ్మణీయ మెరుగులు అద్దుకున్నాక వాళ్లలో కూడా అసమానతలు ఏర్పడ్డాయని అర్ధమయ్యింది. కులం తక్కువ కారణంగా వాళ్ళు మొదట వారి పెళ్ళికి నిరాకరించారు. చూడడానికి ఎస్సీలు ఒక్కటిగా కనిపించినప్పటికీ మాల మాదిగ కులాల మధ్య అప్పటి అంబేడ్కర్ కి, ఇప్పుడు అయన అనుచరులుగా చెప్పుకోబడుతున్న సో కాల్డ్ ఉద్యమకారులకు ఉన్నంత తేడాలు ఉన్నాయి. అంబేద్కర్ భావజాలంతో ముడిపడి ఉన్నవాళ్లే అయినా... తక్కువ కులం వాళ్ళకిస్తే పరువు పోతుందని... వాళ్ల ప్రేమను విడదీసే అన్ని ప్రయత్నాలు చేశారు. 'నాకు ఇది కావాల'ని కనీసం నోరు తెరిచి అడగడం కూడా తెలియని మాయ ఒక్కసారిగా రాజకీయాలు మాట్లాడడం మొదలు పెట్టింది. కులరహిత సమాజానికి కులాంతర వివాహాలు దోహద పడుతాయని అంబేద్కర్ అన్నాడు, కానీ కులాంతర వివాహం చేస్తే ఇంటి పరువు పోతుందని అంబేద్కర్ వారసులు అనుకోవడం దారుణమన్నది. ప్రేమ కోసం ఇంట్లో పెద్ద యుద్ధమే చేసింది.
సిద్ధార్థ ఇంట్లో మాత్రం విషయం చెప్పగానే' వెళ్లి అడుగుదాం. ఇవ్వను అంటే మన ఇంటికి తెచ్చుకొని పెళ్లి చేద్దాం' అని అన్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకునేదాకా పెల్లి చేసుకోవద్దనుకున్నారు ఇద్దరు. చివరికి ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు. 'పెళ్ళికి ముందు మీ పెళ్లి ఎప్పుడు అని ఎవరైనా అడిగితే ఇంకా మా పెళ్లి కాలేదా అని అనుకునేవాళ్లం. ప్రస్తుతం మా పెళ్లి జరిగి 9 నెలలు గడిచినట్టే అన్పించడం లేదు. కులరహిత సమాజంకోసం హిందుత్వాన్ని వదిలిన మాకు బౌద్ధం ప్రత్యామ్నాయంగా అన్పించడం లేదు. ఇంకేదో కావాలని అన్పిస్తుంది. ఇండియాలో కులనిర్మూలన జరగందే వర్గపోరాటం విజయవంతమవ్వదు. వర్గపోరాటం విజయవంతం కాకుంంటే... కులనిర్మూలన జరగదు. అందుకే కులనిర్మూలన ఉద్యమంలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం' అని చెబుతారు సిద్ధార్థ, మాయలిద్దరు.
ప్రేమ వ్యాపారంగా మారింది
మేం ప్రేమించి పెండ్లి చేసుకున్నాం. పైగా కులాంతర వివాహం. పెండ్లికి మాత్రం ఎలాంటి అడ్డంకులు రాలేదు. సమాజంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం బాగా ఉంటుంది. నేను ఆశాను పెండ్లి చేసుకున్ననాటికే ఉద్యోగం చేస్తున్నాను. కాబట్టే మా ఇంట్లో నా మాటను గౌరవించారు. మాది చాలా పెద్ద కుటుంబం. అమ్మానాన్న పెద్దగా చదువుకోలేదు. అయినా కులం గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. ఒకరి సంప్రదాయాలు ఒకరికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. ఎలాంటి సామాజిక చైతన్యం లేకపోయినా నా తల్లిదండ్రులు ఈ విషయంలో ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. అయితే ప్రస్తుత సమాజంలో ప్రపంచీకరణ ప్రభావంలో ప్రతిదీ వ్యాపారంగా మారిపోయింది. అలాగే ఈ ప్రేమికుల రోజు కూడా కేవలం వ్యాపారం కోసం ఉపయోగించు కుంటున్నారు. ఇక భజరంగ్దళ్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ప్రేమకు ఉన్న విలువను నాశనం చేస్తున్నారు. ఈ సమాజాన్ని నడపడానికి ప్రధాన ఆయుధంగా ఉన్న ప్రేమను కించపరుస్తున్నారు. ఇది మన సమాజ అభివృద్ధికి మంచిది కాదు. - గోపికృష్ణ
సహకరించాలి...
మా ఇంట్లో అక్క, అన్నయ్యది కూడా ప్రేమ వివాహమే. అందుకే మా పెండ్లికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సమస్యలు వచ్చినపుడు సర్దుకుపోతూ జీవిస్తున్నాం. మాకు ఒక పాప. చాలా సంతోషంగా గడుపుతున్నాం. మా అమ్మా నాన్న కూడా కులాన్ని, మతాన్ని పట్టించుకునేవారు కాదు. ఈ సమాజంలో అందరూ ఇలాంటి భావాలతో ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కులదురహంకార హత్యలు జరగవు. చాలా చోట్ల ప్రేమ పెండ్లి చేసుకున్న జంటలను చంపేస్తున్నారు. ముఖ్యంగా దళితులపై దాడులు ఎక్కువగా చేస్తున్నారు. ఈపరిస్థితుల్లో మార్పు రావాలి. ప్రేమించుకుని ఒక్కటిగా జీవించాలి అనుకుంటున్నవారికి సహకరించాలి. - ఆశ
ప్రేమే నడిపిస్తున్నది
విద్యార్థి ఉద్యమాల్లో ఆంజనేయులుతో పరిచయం. మా ఇద్దరి భావాలు కలిసి పెండ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇద్దరి ఇండ్లల్లో మాపెండ్లికి ఒప్పుకోలేదు. అయినా ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపించింది. పెండ్లి చేసుకున్నాం. తర్వాత రెండు నెలల వరకు ఎవ్వరూ మాతో మాట్లాడలేదు. మొదట మా అమ్మవాళ్ళ ఇంటికి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా నాన్న నాతో అస్సలు మాట్లాడేవాడు కాదు. నా చేత్తో అన్నం పెట్టినా తినేవాడు కాదు. అలా సంవత్సరం గడిపాం. అప్పటి నుంచి మా బతుకు మేం బతుకుతున్నాం. ఆర్థికంగా సహకరించేవాళ్ళు లేరు. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నాం. మాకు ఓ పాప. తనకు ఇప్పుడు 17 నెలలు. పాపను డేకేర్ సెంటర్లో పెట్టి మేం జాబ్కు వెళుతున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ మమ్మల్ని నడిపిస్తుంది. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను. - సువర్ణ
ప్రేమే మా బలం
విద్యార్థి సంఘంలో మా ఇద్దరికీ పరిచయం. నేను ముస్లిం, శృతి హిందూ. అందుకే మా ఇంట్లో పెండ్లికి ఒప్పుకోలేదు. దాంతో మేమే స్నేహితుల సహాయంతో పెండ్లి చేసుకున్నాం. పెండ్లి తర్వాత శృతిని మతం మార్చుకోమన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. 'తను తనలా, నేను నాలాగే బతుకుతాం, మతం మార్చుకోం' అని చెప్పేశాం. దాంతో మా వాళ్ళకు బాగా కోపం వచ్చింది. కొన్ని రోజులు మాతో మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఇంటికి వెళుతుంటాం. పెద్దగా సమస్యలు లేవు. మా పెండ్లయి ఏడాదిన్నర గడిచింది. సృతి వాళ్ళ ఇంట్లో మాత్రం ఇప్పటికీ ఒప్పుకోలేదు. తన అమ్మానాన్న చిన్నతనంలోనే చనిపోతే అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. కులానికి ప్రధాన్యత బాగా ఇస్తారు. మేం పెండ్లి చేసుకున్న తర్వాత నాపై కిడ్నాప్ కేసు పెట్టారు. మేం మేజర్లం కాబట్టి మాకూ రక్షణ కావాలని అదే పీఎస్లో మేమిద్దరం కేసుపెట్టాం. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళను పంపించేశారు. ఇప్పుడు మేం ఎక్కడ ఉన్నామో, ఎలా బతుకుతున్నామో వాళ్ళకు తెలియదు. మేం మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోతున్నాం. మా మధ్య ఉన్న ప్రేమే మా బలం.
- జావెద్
మనసులు కలిస్తే చాలు
ప్రస్తుతం నేను డిగ్రీ చదువుతున్నాను. నేను ఎంత చదువుకోవాలంటే అంత చదివిస్తానన్నాడు జావెద్. మా ఇండ్లల్లో కులాంతర వివాహం అంటేనే ఒప్పుకోరు. ఇక మా ఇద్దరి మతాలు కూడా వేరు. దాంతో అస్సలు ఒప్పుకోలేదు. కానీ మేం పెండ్లి చేసుకుంటున్నప్పుడు చాలా మంది ప్రోత్సహించారు. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కులం, మతం కాదు మనసులు కలవాలి. మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అందుకే ఇంట్లో వాళ్లను ఎదిరించి పెండ్లి చేసుకున్నాం.
- శృతి