Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 2016... బెంగళూరు జిల్లా రోటరీ టీమ్ ఒక్క రోజు కర్ణాటకలోని 13 ప్రాంతాల్లో, ఎనిమిది గంటల్లో 3034 లీటర్ల రక్తాన్ని సేకరించి చరిత్ర సృష్టించింది. అది రక్తదానంలో అదో గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఇంతవరకు దాన్నెవరూ బ్రేక్ చేయలేదు. ఆ బృందంలోని వాలంటీర్ లతా అమాషీ.64 ఏండ్ల ఈ మహిళ 17 ఏండ్లుగా నిరాదరణకు గురవుతున్న వారికి సేవ చేస్తోంది. తన శక్తి, మార్పుకోసం అంకితభావంతో మహిళలు ఏదైనా చేయగలరని నిరూపిస్తోంది.
ఢిల్లీలో పుట్టి పెరిగిన లత తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు. తండ్రి యునైటెడ్ నేషన్స్లో సీనియర్ అధికారి. తల్లిదండ్రులు ఇద్దరూ సామాజిక సేవలోనే ఉన్నారు. ఏదో చేయాలన్న తపన బాల్యం నుంచే ఉంది. ఫైనాన్స్లో డిగ్రీ పూర్తి చేయగానే కొంతకాలంపాటు సిండికేట్ బ్యాంక్లో పనిచేసింది. సీనియర్ మేనేజర్గా పనిచేస్తుండగానే... స్థానిక మార్కెట్లకు వెళ్లి... తను పొదుపు చేసిన డబ్బులతో అక్కడి వాళ్ల పిల్లలకు ఫీజులు చెల్లించేది. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. బెంగళూరు యూనివర్సిటీలో లెక్చరర్గా చేరింది. అది మళ్లీ ఆమె క్షేత్ర స్థాయిలో సేవలందించడానికి ఉపయోగపడింది. బెంగళూరు రావడంతోనే... రోటరీ క్లబ్లో చేరింది. అంధత్వంతో ఉన్నవారికి చూపు తెప్పించేందుకు కృషి చేసింది. ఎనిమిదేండ్ల కాలంలో 30వేల కాటరాక్ట్ సర్జరీలు చేయించింది. కమ్యూనిటీస్లో పనిచేస్తుండగా రక్త అవసరాన్ని గుర్తించింది. బెంగళూరు వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. రోటరీ క్లబ్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ రక్తదానాన్ని మాత్రం సీరియస్గా తీసుకుంది. టీటీకే బ్లడ్బ్యాంక్తోకలిసి రక్తదానం, పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలకు సహాయం అందించడం కొనసాగించింది. బైకర్ అసోసియేషన్ నుంచి ఆటో డ్రైవర్స్ వరకు... చిన్న దర్జీ కూడా ఆమె ఏర్పాటు చేసే రక్తదాన శిబిరాల్లో పాల్గొనేవారు.
అలా ఒకరోజు క్యాంప్లో ఉండగా ఓ పదేండ్ల బాబుకు డెంగ్యూ సోకింది. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. వెళ్లి కలిసింది. అంతకుముందే ఆమె గురించి తెలిసిన బాబు... 'నా బర్త్డే కేక్ కావాలి' అని ఆమెను అడిగాడు. ఐసీయూలో పుట్టిన రోజు వేడుకలా కుదరదంటే కుదరదన్నాయి హాస్పిటల్ వర్గాలు. పట్టుబట్టి కేక్ తెచ్చి బాబు బర్త్డే జరిపించింది. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో తెల్లారే అ బ్బాయి మరణించాడు. ఆ ఘటన ఆమెను కుదిపేసింది. ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయాలని నిర్ణయించుకుంది. స్థానికంగానే కాదు... తన పరిచయాలతో స్థానికంగానే కాదు... ఇతర రాష్ట్రాల్లోనూ రక్తదానం నిర్వహిస్తున్నది. అయితే 'పదేండ్ల కిందట తాను రక్తదానం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో ఇప్పుడు అదే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజల్లో రక్తదానానికి సంబంధించిన అవగాహన పెంపొందడం లేదు' అంటోందామె. రోటరీ క్లబ్ బెంగళూరు రక్తదానానికి ఆమె ఛైర్ పర్సన్. ఒక్క ఫోన్ కాల్చేస్తే చాలు.. ఇట్లా రక్తం అందించి సాయపడుతోంది. డయాబెటిస్పై అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటన్నింటికోసం రోటరీ క్లబ్ సొంత సాయం చేస్తుంది. మిగిలినదంతా తన బ్యాంక్ బ్యాలెన్సు నుంచే తీస్తోందామె. ఇప్పటిదాకా 15 లక్షల సొంత డబ్బులను ఉపయోగించింది. దాంతో కుటుంబం నుంచి కొంత వ్యతిరేకత కూడా మొదలైంది. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. తలసేమియా రోగులకోసం స్టెమ్ సెల్ రీసర్చ్ కూడా మొదలుపెట్టింది. బోన్మారో డొనేషన్ కోసం ప్రయత్నిస్తోంది.
'ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే 'నో' చెప్పడం నాకు తెలియదు. నా ఆరోగ్యం సహకరించినంతవరకు నేను ఇతరులకు సాయం చేయాలనుకుంటున్నా. ఇతరులకు మరో జీవితాన్ని అందించడానికి మించిన ఆనందం మరేముంటుంది' అంటుంది లతాజీ! ు