Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ సమయం ఎండలో గడిపినా... అధిక రసాయనాలు ఉన్న మిశ్రమాలను ఉపయోగించినా మెడ రంగు మారుతుంది. దాంతో పాటు మెడ నిర్జీవంగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కింది చిట్కాలను పాటించండి.
రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్లో నాలుగు చెంచాల నీళ్లను కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ క్లాత్ను ముంచి మెడ చుట్టూ రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడుక్కోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మెడ అందంగా, మృదువుగా తయారవుతుంది. ఇలా పలుమార్లు చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
మూడు చెంచాల బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లు కలుపుకొని చిక్కగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్టును మెడకు రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఆలుగడ్డ రసాన్ని మెడకు నిండుగా రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మెడ చుట్టూ పేరుకుపోయిన దుమ్ము, ధూళి పూర్తిగా తొలగిపోతుంది.
రెండు చెంచాల శనగపిండిలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా గులాబీ నీళ్లు పోసి బాగా కలుపుకొని మెడకు రాసుకోవాలి. అలా 15 నిమిషాలు పట్టించాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మెడ మెరిసిపోతుంది.
రెండు చెంచాల పెరుగులో ఒక చెంచా నిమ్మరసం పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు నిండుగా రాసుకోవాలి. ఇలా 20 నిమిషాలు పట్టించాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మెడ రంగు మారడంతో పాటు మృదువుగా, అందంగా తయారవుతుంది.