Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ సత్యలక్ష్మి... వృత్తి వైద్యం అయినా దానికే పరిమితం కాలేదు. సామాజిక రుగ్మతలకు సైతం వైద్యం చేస్తున్నారు. ప్రకృతి చికిత్సలో పట్టభద్రురాలైన ఆమె.. ప్రకృతిని కాపాడుకోవడంలో, పర్యావరణాన్ని రక్షించుకోవడంలోనూ ముందుంటారు. నేచర్క్యూర్ డాక్టర్గా నల్లగొండలో కెరీర్ మొదలుపెట్టి.. హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పుడు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్) డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. 17, 18 తేదీల్లో ఎన్ఐఎన్ నిర్వహిస్తున్న 'నేషనల్ నేచురల్ ఫుడ్ఫెస్టివల్' కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె మానవితో పంచుకున్న ముచ్చట్లు... ఆమె మాటల్లోనేపుట్టిపెరిగిందంతా నల్లగొండలో. గీతావిజ్ఞాన్ స్కూల్లో చదువు కున్నాను. మా కాంపౌండ్లో పదిహేను కుటుంబాలు ఉండేవి. భిన్నమైన సంస్కృతి. నాన్నగారు కొమర్రాజు మురళీధరరావు గారు అడ్వకేట్. ఆయనమీద గాంధీ ప్రభావం ఎక్కువ. భూదాన్ ఉద్యోమంలో పాలుపంచుకున్నారు. 'ప్రతిధ్వని' అని ఒక పక్షపత్రిక నడిపేవారు. అప్పట్లోనే స్టింగ్ ఆపరేషన్స్ కూడా చేశారు. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నారు. ప్రగతిశీల వాతావరణంలో నా బాల్యం గడిచింది. స్కూల్లో చదువులో సగటు విద్యార్థినే అయినా... అన్నింట్లో ముందుండేదాన్ని. ఎప్పుడూ ప్రశ్నలు వేసేదాటీచర్స్ కూడా ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నా. మంచి మార్కులతో పాసయ్యాను. అప్పట్లో అమ్మాయిలకు అయితే చదువు లేకపోతే పెండ్లి అన్నట్టుండేది. బాగా చదువుకోకపోతే పెండ్లి చేస్తారేమోనని భయం. మా అక్కల విషయంలో అదే జరిగింది కాబట్టి... నాకు అదే జరుగుతుందని... పట్టుదలతో చదివేదాన్ని.
విద్యార్థినిగా...
డాక్టర్ కావాలని ఎప్పడూ అనుకోలేదు. ఎందుకంటే మొదటినుంచి డాక్టర్లపై ఓ వ్యతిరేకత ఉండేది. అందుకే మెడిసిన్ చేయొద్దనుకున్నా. కానీ ఆ టైమ్లోనే 'నేచర్ క్యూర్' ప్రకటన వచ్చింది. 'హాస్టల్ సౌకర్యం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వస్తారు. విద్యార్థుల పనులు వాళ్లే చేసుకోవాలి. క్యాంటీన్ సైతం విద్యార్థులే మెయింటెయిన్ చేసుకోవాలి' అని. అవన్నీ చూసి ఆసక్తికరంగా అనిపించింది. అప్లై చేశాను. నాకు ముగ్గురక్కలు. వాళ్లను చదువులకోసం బయటికి పంపలేదు. నేను పోతానంటే అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇంటర్వ్యూ కార్డు తీసి దాచిపెట్టింది. నాన్న ఎలాగోలా ఒప్పించారు. అలా చదువుకోసం హైదరాబాద్ వచ్చా. ఇక్కడ చాలా నేర్చుకున్నా. విద్యార్థులు వివిధ రాష్ట్రాలనుంచి వచ్చేవాళ్లు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు... నాలుగున్నర సంవత్సరాల కోర్సులో ఒకేఒక్కసారి వాళ్ల ఊరికి వెళ్లారు. అందులో ఒకమ్మాయికి కోల్కత్తాలో పర్సు పోతే... జట్టు కత్తిరించి అమ్ముకుని ఆ డబ్బులతో ఇంటికి వెళ్లిందట. తిరిగి వచ్చాక ఆమె జుట్టు చూసి ఏమైందని అడిగితే ఆ విషయం చెప్పింది. ఆ ఘటన మమ్మల్నందరినీ కదిలించింది. వాళ్లు అంత కష్టపడి చదువుతుంటే... మనమెందుకు విలువివ్వడం లేదు అని ప్రశ్నించుకున్నా. సీరియస్గా తీసుకున్నా.
ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు...
ఇప్పటి నేచర్క్యూర్ ఆస్పత్రి... వెంకట్రావు, విజయలక్ష్మి దంపతులు ఏర్పాటు చేశారు. మొదట వాళ్లు బొల్లారంలో ఉండి ప్రకృతి చికిత్స ప్రారంభించారు. మెహదీ నవాజ్ జంగ్.. ఏడో నిజాం ఆరోగ్య మంత్రి. ఆయనకు విపరీతమైన కడుపునొప్పి ఉండేదట. ఏదీ అరగదు. ఏదీ తినలేరు. అలాంటి ఆయనకు వీళ్లు ప్రకృతి చికిత్స చేశారు. బాగయ్యింది. ఆ తరువాత ఆయన ప్రకృతి చికిత్సాలయం కోసం అమీర్పేట్లోని ఈ ల్యాండ్ను 99 ఏండ్లు లీజుకిచ్చారు. అలా ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటైంది. ఎన్టీఆర్ పీరియడ్లో దాన్ని ప్రభుత్వం టేకోవర్ చేసింది.
డాక్టర్గా...
చదువు అయిపోగానే 'అక్కడో ఇక్కడో ఎందుకు? నల్లగొండ వాసులకు కూడా ప్రకృతి చికిత్స అవసరం. పెట్టుబడి నేను పెడతా. ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించు' అన్నారు నాన్న. డిగ్రీ అయిపోగానే నల్లగొండ వెళ్లి... మా ఇంట్లోనే ఓ పోర్షన్లో హాస్పిటల్ ఏర్పాటు చేశాను. మంచి స్పందన వచ్చింది. ఎనిమిది సంవత్సరాలు అక్కడే పనిచేశాను. అక్కడ ప్రకృతి చికిత్స గురించి ప్రచారంతోపాటు, 'నీలగిరి సాహిత్య వేదిక'లో క్రియాశీలకంగా పనిచేసేదాన్ని. మహిళలను చైతన్యం చేయడం కోసం 'సబల' అనే వేదికను కూడా ఏర్పాటు చేశాం. వీటన్నింటిలో భాగస్వామినవుతూనే... ఎంఫిల్ చేశాను. దానికోసం హైదరాబాద్కి వచ్చిపోయేదాన్ని. ఆ సమంయలో రెడ్క్రాస్ నుంచి ఫోన్ ' నేచర్ క్యూర్ హాస్పిటల్కి మెడికల్ ఆఫీసర్కోసం చూస్తున్నాం. మీరు వచ్చి చేస్తారా?' అని. రెడ్క్రాస్కు రావడానికే సిద్ధపడ్డాను. 96 నుంచి 2006 దాకా అక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేశాను. 2006లో అమీర్పేట నేచర్క్యూర్లో రిక్రూట్మెస్త్రంట్ మొదలైంది. అప్పుడు రీసర్చ్ ప్రొఫెసర్గా చేరాను.
ఉద్యోగం, యాక్టివిజం సమాంతరంగా..
ఎక్కడా ఉద్యోగం ఒక్కటే ఎప్పుడూ చేయలేదు. రెడ్క్రాస్లో పనిచేస్తున్నప్పుడే... పెద్ద అడిశర్లపల్లి మండలంలో యురేనియం ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని తెలిసింది. అప్పటికే ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. వాళ్లతో దానిగురించి చర్చించనప్పుడు పెద్ద ప్రాజెక్టు... దాన్ని ఎదుర్కోవాలంటే ప్రజలతోనే సాధ్య మవుతుందని తెలిసింది. ప్రజలను చైతన్యవంతులను చేయాలంటే ఏం చేయాలి? అప్పటికి జాదుగూడలో యురేనియం మైనింగ్ జరుగుతున్నది. దాని వల్ల కలిగే దుష్పరిణామాలను శ్రీకుమార్ షార్ట్ ఫిల్మ్ చేశారు. 'బుద్ధ వీప్స్ ఇన్ జాదుగూడ' అని. అది తీసు కుని, తెలుగులోకి అనువదించి... ఆ మండలంలోని అన్ని గ్రామాల్లో (చంద్రబాబు ప్రతి స్కూల్లో ఆడియో విజువల్ ప్రోగ్రామ్ పెట్టి టీవీలు పెట్టాడు. ఆ టీవీలు ఈ ప్రచారానికి ఉపయోగపడ్డాయి) చూపించాం. 'యురేనియం ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఎలాంటి లాభం ఉండదు. రేడియో యాక్టివ్ వేస్ట్... ఊర్లల్లో డంప్ చేస్తారు. అంగవైకల్యం వస్తుంది. క్యాన్స్ర్ వస్తుంది' అని ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ప్రజలు వ్యతిరేకించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చంద్రబాబుహయాంలో యురేనియం ప్రాజెక్టును వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి... ఆయన అధికారంలోకి వచ్చాక 2005లో కడపలో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చూశాడు. 'నా ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు. ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతుంది' అని అన్నాడు. కానీ అక్కడి ప్రజల్లోనూ అవగాహన కల్పించడంతో.. ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది.
తెలంగాణ ఉద్యమంలో...
అమీర్పేట నేచర్క్యూర్లో చేరగానే ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ తెలంగాణల్లో భాగస్వామినయ్యాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టీజీవో, టీఓన్జీవోస్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండేది. ఉద్యమంలో మహిళా ఉద్యోగులు ఉంటారు. కానీ మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం సంఘాల్లో ఉండదు. అందుకే 'తెలంగాణ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్' అని ఏర్పాటు చేశాం. రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాదిలోనే పుణే ఎన్ఐఎన్కు బదిలీ అయ్యింది. నిజానికి 'వెళ్లాలా వద్దా?' అని ఆలోచించాను. రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ నిధులు కూడా సరిగ్గా రావడం లేదు. దాంతో షిఫ్టవ్వడానికే ఆసక్తి చూపాను.
సహజ పద్ధతులపై...
హెల్త్ ఇండిస్టీ అయినా, మినిస్ట్రీ అయినా... జబ్బు వస్తే ఏం చేయాలో చెబుతుంది. కానీ జబ్బు ఎందుకు చేస్తుందో పట్టించుకోదు. ఆ ప్రయత్నమే ఎన్ఐఎన్ చేస్తున్నది. మెటర్నల్ హెల్త్లో చాలా దుర్మార్గం కొనసాగుతోంది. సంతానం కలగకపోవడం అనేది జబ్బుగా చూస్తున్నారు. అది రోగంగా భావించి, మహిళను టార్గెట్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తారు. అమ్మతనం గురించి చెత్తా చెదారం మాట్లాడి, అదో జబ్బుగా చూపించి మహిళల మీద యుద్ధం చేస్తున్నారు. మానసికంగా, ఎమెషనల్గా, కల్చరల్గా, శారీరకంగా ఆమెపై దాడి జరుగుతున్నది. అందుకే గైనకాల జిస్టులను సెన్సిటైజ్ చేస్తున్నాం. సంతానం కలగకపోవం జబ్బు కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరో పెద్ద సమస్య సిజేరియన్స్. అది అడ్వాన్స్ చికిత్స అనుకుంటున్నారు. కానీ తరువాతి దుష్ప్రభావాలు పట్టించుకోవడం లేదు. కానీ వందల ఏండ్లుగా పల్లెటూళ్లల్లో ఏం లేకపోయినా ప్రసవాలు సాధారణంగా జరిగిపోతున్నాయి. దానికోసం మంత్రసానులు ఉపయోగిస్తున్న టెక్నిక్స్ ఏమిటి? విలువలు, అంకితభావం ఏమిటి? వాటన్నింటినీ... నేచురోపతి డాక్టర్స్కి కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా చెప్పిస్తున్నాం. ఈ క్లాసులు మంత్రసానులే చెబుతారు.
టెక్నాలజీతో నష్టం...
ఇప్పుడు అన్ని రంగాల్లో వస్తున్న సాంకేతికత మహిళల ఆరోగ్యానికి ముప్పులా మారింది. లావున్నా కష్టమే, బక్కగున్నా కష్టమే, తెల్లగున్నా కష్టమే, నల్లగున్నా కష్టమే. ఇల్లు శుభ్రం చేయడానికి కూడా రసాయనాలు. ఇవి మహిళల మీద ప్రభావం చూపిస్తున్నాయి. రసాయనాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకుని, మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందులో కూడా మోసం జరుగుతోంది. ఆరోగ్యమైన ఆహారం అంటే... డ్రైఫ్రూట్స్, క్వినోవా, ఆలివ్స్, ఓట్స్ తినమని చెబుతున్నారు. కానీ పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. అంతకుమించిన ప్రయోజనం అందుతుంది. బయట దొరికే నూనెలు అంత మంచివి కాదు. నువ్వుల నూనె ఆలివ్ ఆయిల్కంటే శ్రేష్టమైనది. కుసుమ నూనె ఆలివ్ ఆయిల్తో సమానమైంది. 'మీ ఆయిల్స్ మీరే తయారు చేసుకోండి. ఇంట్లో కుండీల్లో అందమైన మొక్కలకంటే... పాలకూరో, కొత్తిమీరో, మెంతుకూరో వేసుకోండి. అదనపు బాధ్యత అనుకోకుండా మీకోసం అని చేసుకోండి' అని చెబుతున్నాం. ఆధ్యాత్మిక యోగా కాకుండా... ఆరోగ్యానికి మంచి చేసే యోగా, మెడిటేషన్ను అందిస్తాం. నిజానికి మెడిసిన్ను సహజంగా శరీరంలోనే సృష్టించుకోవచ్చు. దానికి కావాల్సిన వాతా వర ణాన్ని తయారుచేసుకోవాలి. ఆహారాన్ని తీసుకోవాలి. వాటిపట్ల అవగాహన కల్పించడమే ప్రకృతి చికిత్స.
డయాబెటిస్పై ఫోకస్...
ఈ ఫుడ్ఫెస్టివల్లో డయాబెటిస్ మీద ఫోకస్ చేస్తున్నాం. గతంలో పట్టణ ప్రాంతాల్లోనే డయాబెటిస్ వస్తుంది అనుకునేవాళ్లం. కానీ కాయకష్టం చేస్తున్నవాళ్లకు వస్తోంది, ఒత్తిడిలో పనిచేసేవాళ్లకు వస్తుంది. ఇది విటమిన్బీ1 లోపించడం వల్ల వస్తోంది. రైస్లో ఆర్సినిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. అది బీ1ను పనిచేయనివ్వడం లేదు. దీంతో ఇన్సులిన్ వీక్గా పనిచేస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అది తగ్గాలంటే చిరుధాన్యాలు ఎక్కువగా ఉపయోగించాలి. ఆరోగ్యం మందులదో, డాక్టర్లదో కాదు... ఆరోగ్యంపట్ల అవగాహన పెంచుకునే బాధ్యత ప్రజలదే. ఏది తినడం వల్ల శక్తి వస్తుంది? ఏది తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు... అనే అవగాహన కల్పించడమే ఈ ఫుడ్ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం. ఇతర రాష్ట్రాల్లోని 10 కాలేజీల నుంచి ఇందులో పాల్గొంటారు.
ఆమెకు గుర్తింపు లేదు..
నేచర్క్యూర్లో 50నుంచి 60 శాతం మహిళలు ఉంటారు. ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లు కూడా 50శాతానికి పైగా మహిళలే ఉంటారు. కిందిస్థాయి అడ్మినిస్ట్రేషన్లో సైతం ఎక్కువ మంది ఆడవాళ్లే. కానీ నిర్ణయాధికారం అంతా పురుషులదే ఉంటుంది. వెంకట్రావ్గారి భార్య విజయలక్ష్మిగారు చాలా మంచి డాక్టర్. నిజానికి ఆమె పేరు ఎవ్వరికి తెలియదు. అందరూ ఆమెను డాక్టరమ్మ అని పిలిచేవారు. హాస్పిటల్ నిర్వహణ పూర్తిగా ఆమెదే ఉండేది. కానీ ఎక్కడా ఆమెకు గుర్తింపు రాలేదు. ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తోంది.
- కట్ట కవిత