Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయడంతో పాటు.. కుటుంబమంతా కలిసిచూసే కథాచిత్రాలను తీస్తూ.. అరుదైన లోకేషన్స్ను తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న డైనమిక్ డైరెక్టర్ బి. జయ. తెలుగు చిత్రపరిశ్రమలో వేళ్లపై లెక్కించదగిన మంచి దర్శకుల్లో ఆమె ఒకరు. సినీరంగంలోని 24క్రాఫ్ట్స్పై పట్టుసాధించిన ఆమె కలం పట్టి జర్నలిస్టుగా సినీపరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత మెగాఫోన్ అందుకుని కెప్టన్ ఆఫ్ ది షిప్గా మారారు. మనుషుల మనస్తత్వాలను ఆసక్తికరంగా వెండితెరపై ఆవిష్కరిస్తూ.. ఆకట్టుకునే కథనంతో సినిమాని సృజనాత్మకం గా మలుస్తారు. 'చంటిగాడు' తో ప్రారంభమైన దర్శకత్వం 'లవ్లీ'్లగా ముందుకు సాగి 'వైశాఖం'గా అలరించి.. ఇప్పుడు 'లక్కీ ఫెలో' ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె సినీరంగ ప్రస్థానం మానవితో..
ఎక్కువగా కొత్తవారితోనే సినిమా తీయడానికి ఇష్టపడతాను. కొత్తవారైతే వారిని కథకు తగ్గట్టుగా మోల్డ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వారు సినీరంగంలో మంచిపేరు తెచ్చుకుంటే పరిశ్రమలోకి ప్రతిభావంతులైన వారికి తీసుకువచ్చామని ఆనందంగా ఉంటుంది. కథపైనే ఎక్కువగా నేను డిపెండ్ అవుతాను. కథ బాగా నచ్చితేనే.. ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడతాను. నాపై నమ్మకంతో మా వారు ప్రముఖ నిర్మాత బి.రాజు నన్ను ఎంతో ప్రోత్సహిస్తారు.
ఇక నా గురించి చెప్పాలంటే.. మాది తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం. నాన్న నర్సింహరాజు, మెడికల్ రిప్రజెంటేటివ్. అమ్మ విమలాదేవి గృహిణి. నేను పశ్చిమ గోదావరి జిల్లా లోని మా అమ్మమ్మ ఊరు సిద్దాంతంలో పుట్టి పెరిగాను. మేం ముగ్గురం ఆడపిల్లలం. నేనే పెద్ద. గోదావరి నదీతీరమే మా ఆట మైదానం. ఇసుకలో అలసిపోయేవరకు ఆడుకునేవాళ్లం. క్షత్రియ కుటుంబం కావడంతో బయటకు వెళ్లాలంటే చాలా ఆంక్షలు ఉండేవి. ఇద్దరు చెల్లెండ్లను పదవతరగతి వరకు మాత్రమే చదివించి పెళ్లిండ్లుచేసి అత్తవారింటికి పంపించారు. నేను మాత్రం పై చదువుల కోసం పట్టుపట్టాను. విజయవాడలో మాంటిస్సోరిలో పదవతరగతి వరకు చదివాను. ఇంటర్ అమలాపురంలోని ఎస్కెబిఆర్ కాలేజీలో, డిగ్రీ మద్రాసులోని ఎస్ఐఇటి ఉమెన్స్ కాలేజీలో పూర్తిచేశాను. ఆ తర్వాత చెన్నై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. ఇంగ్లీష్ లిటరేచర్తో ఎం.ఎ, జర్నలిజంలో డిప్లొమా చేశాను. మనుషుల మనస్తత్వాలపై ఆసక్తితో అన్నామలై విశ్వవిద్యాలయంలో సైకాలజీలో ఎం.ఎ. చదివాను
తొమ్మిదోతరగతిలో అచ్చుయైన కథ..
చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని. అలా చదువుతూ.. చదువుతూ ఉన్నప్పుడు నాకు ఏదైనా రాయలనిపించేది. నోట్బుక్లో నాకు తోచింది రాసుకునేదాన్ని. అలా రాసిన కథను నా స్నేహితుల ప్రోత్సాహంతో ఒక పత్రికకు పంపితే నా పేరు, స్కూల్పేరుతో సహా అచ్చువేశారు. అంతే ఇక స్కూల్లో ఫేమస్ అయ్యాను. ఉత్తరాలతో పాటు పదిరూపాయల పారితోషికం అందుకున్నాను. నా కవితల గురించి తోటి విద్యార్థులే కాదు.. టీచర్లు మెచ్చుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. రైటర్ను కావాలని అప్పుడే అనుకున్నాను. కథతో పాటు కార్టూన్లు వేయడం నా హాబీగా మారింది. అలా వేసిన కార్టూన్స్ వివిధ దినపత్రికల్లో వచ్చాయి. వనిత కథల పోటీల్లో నేను రాసిన ''అభ్యుదయం'' కథ ఎంపికైంది. ''యువ''లో వచ్చిన కథకు చక్రపాణి అవార్డు, ''వనిత''లో ప్రచురితమైన ''ఆనందోబ్రహ్మ''కథకు జాతీయ అవార్డు వచ్చాయి. ఈ కథను నేషనల్ బుక్ ట్రస్ట్ట్ ఇతర భాషల్లోకి అనువదించి ప్రచురించారు. విప్లవ సాహిత్యం చదవడంతో స్వతంత్రంగా ఆలోచించడం, ప్రశ్నించడం బాగా అలవాటై.. కాలేజీ ఎన్నికల్లోనూ పాల్గొన్నాను.
నాన్సీఫైడే రాసిన పుస్తకాలు..
డిగ్రీ చదువుతూనే జర్నలిజంలోనూ డిప్లామా పూర్తిచేశాను. ఆ తర్వాత ఎంఏ చదువుతున్నప్పుడే 'ఆంధ్రజ్యోతి'లో సబ్ఎడిటర్గా చేరాను. 'జ్యోతిచిత్ర' సినిమా అనుబంధంలో మూడేండ్లు పనిచేశాను.
ఒకవైపు సినీపరిశ్రమలో ప్రముఖల ఇంటర్వ్యూలు, మరోవైపు ఫెమినా, మిర్రర్, ఉమెన్ ఎరాలకు కథనాలు రాస్తూ.. బిజీగా ఉండేదాన్ని. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా నాన్సీఫైడే రాసిన పుస్తకాలు చదివేదాన్ని. జ్యోతిచిత్రలో పనిచేస్తున్నప్పుడే బి. రాజుగారితో పెండ్లి. ఆయన సూచనతో 'సూపర్హిట్' సినిమా పత్రికను ప్రారంభించి సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత 'చంటిగాడు' సినిమా కోసం నేనే మెగాఫోన్ పట్టక తప్పలేదు. చిన్నప్పుడు నేను ఆడుకున్న గోదావరి తీరంలో తీసిన సన్నివేశాలతో వచ్చిన 'చంటిగాడు' వందరోజుల పండుగ కూడా పూర్తి చేసుకుంది.
డైరెక్షన్ ప్యాషన్గా..
నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ను కాదు. ప్యాషన్తో సినిమా తీస్తున్నాను. నాకు నచ్చిన కథను వైవిధ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలన్నదే నా ఆలోచన. అందుకే వెంటవెంటనే కాకుండా.. రిలాక్స్డ్గా సినిమాను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. లవ్లీ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని.. దాదాపు ఏడాది పాటు వైశాఖం సినిమాను రూపొందించాం. సినిమా ఎంతో బాగా వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమాల్లో పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను తీసే సినిమాల్లో లోకేషన్స్ కొత్తగా ఉండాలని కోరుకుంటాను. అందుకే లవ్లీ సినిమాలోని పాటలను టర్కీలోనూ.. వైశాఖం సినిమాలోని పాటలు ఖజకిస్తాన్లోనూ చిత్రీకరించాం. కొత్త నటీనటులను, కొత్త కథనే కాదు కొత్త ప్రదేశాన్ని చూశామన్న ఫీల్ ప్రేక్షకులకు కలగాలి. కొత్తదనం ఉన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది.
సక్సెస్ ఒకశాతం మాత్రమే..
చిత్రపరిశ్రమలో మహిళా డైరెక్టర్లు తక్కువగా ఉన్నారు. ఎంతో మంది ఉన్నతచదువులు చదివిన వారు సినీపరిశ్రమవైపు వస్తున్నా వారిలో పరిశ్రమలో నిలబడుతున్నవారి సంఖ్య ఒక్కశాతమే. మహిళలుగా విజయవంతంగా పరిశ్రమలో నిలబడాలంటే సొంత నిర్మాణ సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. పరిశ్రమలో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఫెయిల్యూర్కు భయపడకుండా నిలబడినప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. గెలుపోటములకు తట్టుకుని నిలబడాలి. అప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది.
- వి.యశోద