Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం చాలా చిన్నది. ఆనందంగా జీవించడం ముఖ్యం. ఆ ఆనందం కోసం కొందరు డబ్బును కోరుకుంటారు. ఇంకొందరు కీర్తి కోసమో, ప్రేమ కోసమో తపిస్తారు. మరికొందరుంటారు... ఇతరులకు సేవ చేయడంలోనే అసలైన ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాంటివారిలో ముందు వరుసలో ఉంటారు... యర్రం పూర్ణశాంతి. అవసరంలో ఉన్నవారికి తానున్నానని భరోసా ఇస్తున్నారు. 'సహాయం చేయడానికి డబ్బులే అక్కర్లేదు... మంచి మనసుంటే చాలు. డబ్బు దానంతట అదే వస్తుంది' అంటున్న ఆమె పరిచయం... ఆమె మాటల్లోనే!
'మా సొంతూరు శ్రీకాళహస్తి. పది వరకు అక్కడే చదువుకున్నా. అక్కడినుంచి వాళ్ల నాన్న వ్యాపారరీత్యా హైదరాబాద్ వచ్చేశాం. నిజానికి ఆ టైమ్లో నాకు చదువుమీద ఎక్కువ ఆసక్తి లేదు. అదే విషయం ఇంట్లో చెబితే 'సరే నీ ఇష్టం. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెరు... మనిషనేవాడు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఎవరికైనా సహాయం చేయడమో, నీకుగా నువ్వు అభివృద్ధి చేసుకోవడమో చేయాలి. ఖాళీ మైండ్ బూజు పడుతుంది. ఏదో ఒకదాంట్లో బిజీగా ఉండాలి' అని చెప్పారు నాన్న.కాలేజీకి వెళ్లకుండా ఓపెన్ డిగ్రీలో చేరాను. అయితే చిన్నప్పటినుంచే పది మందికి సహాయం చేయాలని ఉండేది. అది మా నాన్న ద్వారానే వచ్చింది. మేం చిత్తూరులో ఉన్నప్పుడు నాన్నగారు విత్తనాల వ్యాపారం చేసేవారు. 'తండ్రుల వారసత్వాన్ని కొడుకులే ఎందుకు కొనసాగించాలి. నాన్న నీ బిజినెస్ నేను చేస్తా' అని స్కూల్కు సరిగ్గా పోకుండా నాన్నతో ఎక్కువగా తిరిగేదాన్ని. మా నాన్నగారు ఊర్లల్లోకి వెళ్లగానే శెట్టిగారొచ్చారు అని అందరూ గౌరవించేవారు. నాన్నను ఎందుకంత గౌరవంగా చూస్తున్నారని కనుక్కుంటే తెలిసింది... 'అప్పుడాయన ఆయా గ్రామాల్లో పెండ్లిళ్లకు డబ్బులు ఇవ్వడం, కొత్తగా పెండ్లి చేసుకున్నవాళ్లకు ఇండ్లల్లో సామాను ఇప్పించడం, బట్టలు పెట్టడం, పిల్లల చదువులకోసం సాయం చేయడం' చేసేవారని. అవన్నీ చూసి చూసి ప్రజలకు సేవ చేయడానికి మించినదేదీ లేదని అప్పుడే నిర్ణయించుకున్నా.
చిన్నవయసులోనే ఆర్థిక స్వావలంబన...
హైదరాబాద్ వచ్చాక కొత్తపేట లక్ష్మీనగర్ కాలనీలో ఉండేవాళ్లం. అక్కడ కమ్యూనిటీ హాల్ ఉండేది. అక్కడ కమలానెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీవాళ్లు కంప్యూటర్, టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సు ఒకటి నేర్పించారు. నేను టైలరింగ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నా. నేను ఒక్కదాన్నే నేర్చుకుంటే లాభం లేదని... ఎంబ్రాయిడరీ, టైలరింగ్ యూనిట్ ఏర్పాటు చేశాను. మగ్గం వర్క్ ఇంటి దగ్గరే చేయించేదాన్ని. అప్పుడు నా వయసు 16 ఏండ్లు మాత్రమే. అయినా ఏదో చేయాలన్న సంకల్పం. మనం ఎన్ని చేయాలనుకున్నా ప్రోత్సహించేవాళ్లు కూడా ఉండాలి కదా! నాకు ప్రోత్సాహంగా నిలిచారు నాన్న. 'చిన్నపిల్ల ఏం చేస్తదిలే' అనుకోకుండా ఎంబ్రాయిడరీ మెషీన్, మగ్గం వర్క్కు కావాల్సినవన్ని కొనిచ్చారు. నేను చేయడమే కాదు... వేరేవాళ్లకు కూడా నేర్పించేదాన్ని. నాకు డ్రైవింగ్ అంటే పిచ్చి. నాన్న బజాజ్ ఉంటే దానిపైనే నాకు నేర్పించారు. ఓవైపు టైలరింగ్, మగ్గంవర్క్ కొనసాగిస్తూనే... నేను డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టాను. అష్టలక్ష్మి గుడి దగ్గర ఉన్న గ్రౌండ్కు తీసుకెళ్లి విద్యార్థినులకు, మహిళలకు డ్రైవింగ్ నేర్పించాను.
కుటుంబ ప్రోత్సాహం..
'దయగల హృదయమే భగవంతుడికి నిలయం' అనేవారు నాన్న. రూపాయలో పావలా దగ్గర పెట్టుకుని 75 పైసలు సహాయం చేయమనేవారు. అయితే నేను చదువుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మంది పిల్లలు బాగా చదువుతున్నారు... మీ అమ్మాయి మాత్రం ఏం చదవడం లేదని రకరకాలుగా మాట్లాడినవాళ్లున్నారు. దాంతో సమాజానికి మనం ఏందో చూపించాలి. ఏదో ఒక మార్పు తేవాలి. సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకునేదాన్ని. ఆ క్రమంలోనే పెండ్లి అయ్యింది. ఆయన పేరు యర్రం భాస్కర్. సహజంగా అమ్మాయిలకు ఎన్నో ఆశలు ఉంటాయి. వాటన్నింటినీ అత్తింటివారు తీర్చాలని రూలేం లేదు. అందరికీ అలా జరగదు కూడా. కానీ మావారు, అత్తగారు, అమ్మానాన్నా కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు.
కమ్యూనిటీకే పరిమితమవ్వకుండా...
మాకు ఒక బాబు, పాప. పాప బర్త్డే ఏదైనా అనాథశరణాలయంలో జరపమని 'అమ్మ ఫౌండేషన్'కు చెందిన ఫ్రెండ్ ఒకరు చెప్పారు. పాపను తీసుకుని వెళ్లగానే... అక్కడ 40 మంది పిల్లలు. వెళ్లగానే చుట్టు ముట్టేశారు. తమకోసం ఒకరు వచ్చారన్న ఆనందం ఆ పిల్లల్లో. కడుపు తరుక్కుపోయింది. ఇక్కడ నలభై మంది... హైదరాబాద్ మొత్తంలో ఎంత మంది ఉన్నారో కదా అనిపించింది. వాళ్లకోసం పనిచేయాలని నిర్ణయించుకున్నా. అనాథ పిల్లలకోసం పనిచేస్తున్న సంస్థలకు కో-ఆర్డినేటర్గా నాలుగేండ్లపాటు చేశాను. ఆయా సంస్థలకు ఎంతో కొంత సాయం అందించడం, తెలిసినవాళ్లతో సాయం చేయించడం. తరువాత వాసవి క్లబ్లో కీలక భాగస్వామి అయ్యాను. 2014లో వాసవిక్లబ్ అధ్యక్షరాలిగా చేశాను. వాసవి క్లబ్స్ అయినా ఇంకో ఆర్గనైజేషన్స్ కమ్యూనిటీ పేరుతో చేస్తాయి. దానివల్ల ఆ కులానికి మాత్రమే సేవ చేసినట్టవుతుంది.
సంస్థ ఏర్పాటు చేసి...
అందుకే సొంతంగా 'శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి' ఏర్పాటు చేశాను. 10వరకు చదివి... ప్రతిభ ఉండి ఆర్థిక కారణాల వల్ల చదువుకోలేకపోయిన అమ్మాయిలను చదివిస్తున్నాను. వృద్ధులు... ఈ సమాజానికి ఎంతో సేవ చేసినవాళ్లు. అలాంటివాళ్లు తమ చివరి దశలో అట్లా రోడ్లపక్కన ఉండటం చూస్తే బాధ కలుగుతుంది. రోడ్డుపక్కన భిక్షమెత్తుకుంటున్న వాళ్లకు చికిత్స ఇప్పించడం, వాళ్లు అంగీకరిస్తే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నాను. పెద్ద అంబర్పేటలోని శాంతినగర్ కాలనీలో 500 కుష్టురోగుల కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం క్వార్టర్స్ కట్టించింది. కానీ ఉపాధి లేదు. వాళ్లకు పూట గడవాలంటే... పనికి పోతే రానివ్వరు. బస్ స్టాప్ ఉన్నా అక్కడ బస్సు ఆగదు. దాంతో వెళ్లి కార్పొరేటర్తో మాట్లాడి, ఆర్టీసీ వాళ్లతో మాట్లాడి... బస్ ఆపేటట్లు చేశాను. వాళ్ల పిల్లలు బాగా చదువుతున్నవాళ్లు ఉన్నారు. స్కూల్స్ వాళ్లకు ఫీజులు కూడా తగ్గించవు. 'వంద మంది పిల్లలు ఫీజు కడతారు. అందులో ఒక్కరిద్దరు పిల్లలకు అయినా ఉచితంగా చదువు చెప్పొచ్చు కదా!' అని స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి ఫీజు తగ్గించేలా చేశాను. ఆరు నెలల కిందట... సద్గురు ఓల్డేజ్ హౌమ్కి చెందిన మహిళ నాకు ఫోన్ చేసింది. అక్కడికి వెళితే... 'ఆమె ఏదో చేయాలన్న సంకల్పంతో నేను ఏర్పాటు చేశాను. కానీ నా వల్ల కావడం లేదు. మీ సాయం కావాలి' అన్నది. కొద్దిరోజులు నేను, తరువాత స్నేహితులను తీసుకొచ్చి సహాయం చేయించాను. కానీ అది కూడా కష్టమే అయ్యింది. నాకు చేయాలన్న ఆసక్తి ఎట్లాగు ఉంది కాబట్టి... నేనే ఎందుకు దాన్ని నిర్వహించకూడదని.. ఆ హౌమ్ బాధ్యతలు తీసుకున్నాను. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఆర్థికసాయం అవసరమైతే... చెక్కుల సాయంతో అందిస్తున్నాం.
అనాథ శవాలకు దహన సంస్కారం...
సికింద్రాబాద్ బోయగూడకు చెందిన మొగిలిపల్లి శ్రీనివాస్ గుప్త చిన్నతనంలోనే చదువుతోపాటు సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.హైదరాబాద్లో రోడ్లపై అనాథ కనిపిస్తే ఆకలి తీరుస్తాడు. తను కష్టపడి సంపాదించిన డబ్బులనే సేవకు వినియోగిస్తాడు. నాలుగేళ్ల కిందట అతని కొడుకు వివేక్ గుండెసంబంధిత వ్యాధితో మరణించాడు. కుమారుడికి గుర్తుగా రియల్ వివేక్ ట్రస్ట్ నెలకొల్పాడు. పూర్తిస్థాయిలో సేవకే అంకితమయ్యాడు. ఆకలితో ఎవరైనా కనిపిస్తే అన్నం పెట్టిస్తాడు. రోడ్లపైన ఏదైనా శవం కనిపిస్తే పోలీసులకు సమాచారం అందిస్తాడు. వెంటనే మార్చురీకి తరలిస్తాడు. నగరంలోని ప్రతి పోలీస్ అధికారి వద్ద అతని ఫోన్ నంబర్ ఉంటుంది. నగరంలో ఏ మూలన ఎక్కడ కుళ్లిపోయిన స్థితిలో శవం కనిపించినా పోలీసుల సమాచారంతో అక్కడికి చేరుకుంటాడు. సొంతవాళ్లే తాకడానికి భయపడే స్థితిలో ఉన్న మ తదేహాలను ప్రేమతో జాగ్రత్తగా మార్చురీకి తరలిస్తాడు. దహన సంస్కారాలు నిర్వహిస్తాడు. ఒక్కసారి తన సేవ చూశాక... నేను అందులోనూ భాగస్వామురాలినయ్యాను. మీ అవసరం ఉందండి ఒక్క ఫోన్కాల్ వస్తే చాలు... వాలిపోతాను. బాబు ఇంటర్ సెకండియర్, పాప టెంత్క్లాస్ చదువుతున్నది. కుటుంబం, సేవ తప్ప మరో ప్రపంచం లేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ యువతకు పెండ్లిళ్లు చేస్తున్నాను' అని ఆనందంగా చెబుతారామె.
సేవకు గుర్తింపుగా...
ఆమె సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు వచ్చాయి. సావిత్రిబాయి పులే జాతీయ అవార్డుతోపాటు వైశ్య ఎమినెంట్ లేడీ, ఐవీఎఫ్ బెస్ట్ సోషల్ అవార్డు, నేషనల్ కీర్తి పురస్కార్, ఉమెనర్జీ స్పెషల్ అవార్డులు అందుకున్నారు శాంతిపూర్ణ.
- కట్ట కవిత