Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియా ఖాన్ (20 ఫిబ్రవరి 1988 - 3 జూన్ 2013)
జియా ఖాన్ నటించింది కేవలం మూడు చిత్రాలైనా బాగా పేరు తెచ్చుకుంది. 25 ఏండ్ల వయసులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. 1988 ఫిబ్రవరి 20 న న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి అలీ రిజ్వీ ఖాన్ ఒక భారత అమెరికన్ సంతతి వ్యక్తి. తల్లి రబియా ఆమిన్, ఆగ్రాకు చెందిన భారతీయ నటి. జియా ఖాన్ విద్యాభ్యాసమంతా లండన్లోనే సాగింది. ఆ తర్వాత హిందీ సినిమాలలో నటించాలనే ఆసక్తితో ముంబాయికి వచ్చేసింది. జియాకు ఇద్దరు సోదరీమణులు కరిష్మా, కవిత. చిన్న వయసు నుంచి నటన పై ఆసక్తి ఉండటం వల్ల తన ఫీల్డ్ మార్చుకోవాల్సి వచ్చింది.
సినీ ప్రస్థానం...
2007 లో 18 ఏండ్ల వయసులో రాంగోపాల్ వర్మ 'నిశ్శబ్ద్' చిత్రంలో అమితాబ్ బచ్చన్ సరసన కథానాయికగా సినీరంగ ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం పరాజయం పాలైనా చిత్రంలో జియా నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ఈ చిత్రానికి గానూ ఫిలింఫేర్ పురస్కారానికి నామినేట్ అయింది. తర్వాత సంవత్సరంలో తమిళ, హిందీ రీమేక్ గజినిలో నటించింది. 2010 లో సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన హౌస్ఫుల్ లో నటించింది.
జియా మరణం...
జియా మరణం గురించి తెలిసిన వెంటనే అందరు కూడా తన కెరీర్ పరంగా తనకి అవకాశలు లేవని దాని వల్ల కొంత నిరాశ,నిస్పహలకు లోనయ్యి ఇలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉంటుందనుకున్నారు. అప్పటికి తన మరణం పైన ఒక తెలుగు పేపర్ ప్రేమే ప్రాణం తీసిందా అనే అనుమానాన్ని వెలిబుచ్చింది. చివరికి ఆ అమ్మాయి ప్రేమవల్లే చనిపోయిందని తెలిసి కన్నీరు పెట్టని వారుండరు. జియా మరణించిన వారం తర్వాత వాళ్లింట్లో తను చనిపోవడానికి కారణాన్ని విపులంగా వివరిస్తూ తన బాధనంత అక్షరాలుగా రాసిన ఒక ఉత్తరం బయటపడింది.
ఆమె ఆఖరి ఉత్తరం...
''నన్ను నేను కోల్పోయేంతగా నిన్ను ప్రేమించాను, కాని నువ్వు నా ప్రేమను నీ మోసం రూపంలో చూపించావు. నీ ప్రపంచం కేవలం అమ్మాయిలు, పార్టీలు. నా ప్రపంచం మాత్రం నువ్వు, నీతో ఉన్న నా జీవితం. నేను ఇంకొక శ్వాస తీసుకోవడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు. నీ కోసం కన్నీరు కార్చిన ప్రతిసారి నువ్వు దాన్ని చూసి నవ్వావు. నేను ఈ ప్రదేశాన్ని నా చెదిరిపోయిన కలలతో, విరిగిపోయిన మనసుతో వదిలి వెళ్తున్నాను. పడుకోవాలనుంది ఇక ఎప్పటికీ ఆ నిద్రలోంచి మేలుకోలేనంతగా ''.