Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరశతాబ్దం కింద ఆకాశవాణిలో లలిత గీతాలు విన్న శ్రోతలకు పరిచయం అవసరం లేని పేరు శ్రీరంగం గోపాలరత్నం. ఆమె ఆలపించిన అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. శాస్త్రీయ, లలిత సంగీతంలో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
విజయనగరం జిల్లా పుష్పగిరిలో గోపాలరత్నం జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సుభద్రమ్మ, వరదాచార్యులు. తల్లి మేనమామ అప్పకొండమాచార్యులు ప్రముఖ కవి. ఆయన రాసిన రెండు హరికథలను పాలకొల్లులో జరిగిన సభలో ఆమె పాడారు. అప్పుడు ఆమె వయసు తొమ్మిదేండ్లు. ఇదే ఆమె తొలి ప్రదర్శన. ఆమెలోని సంగీత ప్రతిభను, కంఠంలోని మాధుర్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ప్రముఖ సంగీత గురువు కవిరాయని జోగారావు వద్ద చేర్చారు. ఆయనే ఆమె ప్రధాన సంగీత గురువు. ఆ తర్వాత ప్రముఖ సంగీత విధ్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని నేర్చుకున్నారు.
విజయవాడ ఆకాశవాణిలో 1957లో నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటి నుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు వీనుల విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. అన్నమయ్య పద్యాలు, క్షేత్రయ్య పద్యాలు, మీరా భజన గీతాలు ఆమె కంఠం నుంచి జాలువారిన మధురగీతాలు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు గీటురాళ్ళు. ఆమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం 'మీరాబాయి'
రేడియోలో ఆమె గానమాధుర్యం విన్న సినీసంగీత దర్శకులు 'శ్రీ వేంకటేశ్వర వైభవం' చిత్రంలో పాడే అవకాశం ఇచ్చారు. 'ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా' అంటూ ఆమె ఆలపించిన పాట తెలుగువారి ప్రతి ఇంటా మారుమ్రోగింది. ఆ తర్వాత 'బికారి రాముడు' చిత్రంలో పాడిన 'నిదురమ్మా నిదురమ్మా' గీతం బహుళ పాచుర్యం పొందింది.
రేడియో, సినిమాల్లో పాడటంతో పాటు ఆమె సంగీతవిద్యాంసురాలిగా కూడా రాణించారు. 1969లో తిరుమల - తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా సేవలందించారు.1977లో హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు 'లలిత కళా పీఠాని'కి ప్రత్యేక అధికారిగా పనిచేశారు. గాన కోకిలగా, సంగీత కళానిధిగా, సంగీత రత్నగా బిరుదులు అందుకున్న ఆమెను 1992లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' గౌరవంతో సత్కరించింది.