Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ గొప్పగా ఉండాలనుకుంటారు. వాళ్ళకు కాస్త నలత చేసినా తల్లిడిల్లి పోతారు. అలాంటిది పుట్టడమే సమస్యలతో పుడితే... కన్నవాళ్ళకు అది భరించలేని వేదన. అలాంటి కష్టమే వచ్చింది ఆ తల్లికి. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ బాధ నుంచి కోలుకొని కొడుక్కి మంచి జీవితం చూపించాలని తపించారు. తన కెరీర్ని పక్కన పెట్టి కొడుకే సర్వస్వంగా తీర్చిదిద్దారు. తను పడ్డ బాధ ఏ తల్లీ పడకూడదని శారీరక సమస్యలతో ఇబ్బంది పడే పిల్లల కోసం ఉచితంగా ఓ ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. ఆ బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. ఎలా బతుకుతాడో అనుకున్న తన కొడుకే ఇప్పుడు ఆ సెంటర్ బాధ్యతలు చూస్తుంటే ఆ తల్లి ఆనందం వర్ణనాతీతం. కొడుకును చూసి గర్వపడుతున్న ఆ తల్లి డాక్టర్ రజని. ఆమె చెబుతున్న మరికొన్ని విశేషాలు...
మాది తెనాలి. నాన్న లోక భూమారెడ్డి, అమ్మ గంగుబాయి. మా నాన్న గారు లెక్చరర్. నాన్న జాబ్ రీత్యా ఇటు వచ్చేశారు. నాన్న వనపర్తి, నిజామాబాద్, సంగారెడ్డిలలో పని చేశారు. మేం ముగ్గురం. నేను, అక్క, అన్న. అందరం సంగారెడ్డిలోనే పుట్టాం. మా నాన్నకు చదువంటే చాలా ఇష్టం. మా ముగ్గురిని బాగా చదివించి డాక్టర్లను చేశాడు. నేను ఏడో తరగతి వరకు వనపర్తిలో చదివి, ఆ తర్వాత నుంచి ఇంటర్ వరకు నిజామాబాద్లో పూర్తి చేశాను. చదువుకునే రోజుల్లో నా పెండ్లి గురించి మేనత్తలు నాన్నను బాగా ఒత్తిడి చేశారు. కానీ నాన్న ఒప్పుకోలేదు. చదువు అయిపోయిన తర్వాతనే పెండ్లి అని కచ్చితంగా చెప్పేశారు. అప్పట్లో కాకతీయ, గాంధీ, ఉస్మానియా మూడే మెడికల్ కాలేజీలు ఉండేవి. నేను గాంధీలో మెడిసన్ పూర్తి చేశాను. మావారు డాక్టర్ సుదర్శన్ రెడ్డి. ఆయన గాంధీలో నాకు సీనియర్. పెండ్లి తర్వాత మావారు ఆర్మీలో మెడికల్ ఆఫీసర్గా సర్వీస్ చేశారు.
మొదట్లో కుంగిపోయాం
పెండ్లి తర్వాతనే పీజీ ఆఫ్తమాలజీకి ప్రిపేర్ అయ్యాను. సీటు వచ్చే నాటికి నాకు డెలివరీ సమయం. దాంతో మా అక్క వెళ్ళి నా పీజీ సీటు గురించి మాట్లాడి ఆపింది. బాబు పుట్టిన తర్వాత కంటిన్యూ చేశాను. బాబు పుట్టిన సంతోషం కొన్ని రోజులు కూడా నిలవలేదు. దేనికీ స్పందించేవాడు కాదు. మూడు నెలలు వచ్చేసరికి మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని అర్థమయింది. విషయం తెలిసి చాలా బాధపడ్డాం. మొదట్లో కుంగిపోయాం. కానీ మేం పట్టించుకోకపోతే బాబు భవిష్యత్ ఏమిటని ట్రీట్ మెంట్ ఇప్పిస్తూ పీజీని కంటిన్యూ చేశాను.
ట్రీట్మెంట్పైనే దృష్టి
అప్పుడు సరోజిని హాస్పిటల్లో పని చేసేదాన్ని. బాబుకు ఏడాదిన్నర నిండినా నడవలేదు. కనీసం పాకేవాడు కాదు. చాలా భయం వేసింది. తెలిసిన డాక్టర్ ఫిజియో థెరఫీ చేయించమన్నారు. ఇక నా జాబ్ మానేసి నా దృష్టి మొత్తం బాబు ట్రీట్మెంట్పైనే పెట్టాను. ఫిజియోథెరఫీ చేయించిన తర్వాత కాస్త మూమెంట్స్ వచ్చాయి. కండ్లలో లైట్స్ పడితే మెదడులో కదలికలు వస్తాయంటే రాత్రి పూట వెహికిల్ లైట్స్ పడతాయని బయటకు తీసుకెళ్ళేవాళ్ళం. ఏదైనా నోట్లో పెడితే నమిలేవాడు కాదు అలాగే మింగేసేవాడు. నోరు బాగా తెరిచి చాక్లెట్ను లోపలకు దోపేవాళ్ళం. అది అతుక్కు పోయేది. అప్పుడు దాన్ని నమలడానికి ప్రయత్నించేవాడు. అలా డాక్టర్లు చెప్పినవి, మాకు తెలిసిన ట్రిక్స్ అన్నింటినీ ప్రయత్నిస్తే కాస్త డెలవప్మెంట్ వుంది.
నమ్మకం వచ్చింది
బాబు భవిష్యత్లో తన పనులు తాను చేసుకోవాలి. అలాగే సెటిల్ చేయాలి. అందుకే ఎల్వీ ప్రసాద్ రిహేబిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యాం. మొదట భయం భయంగా పోయాం. అక్కడ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బాబు కాస్త మంచిగా అవుతున్నాడనే నమ్మకం కలిగిన తర్వాత ఆఫ్తాలజీ పూర్తి చేశాను. మా డ్యూటీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టైమింగ్స్ ఎడ్జెస్ట్ చేసుకుని రిహేబిటేషన్ సెంటర్కు తీసుకెళ్ళేవాళ్ళం. మొదటి నుంచి నాకు గైనకాలజీ చేయాలని కోరిక. ఎల్వీ ప్రసాద్లో ట్రైనింగ్ తర్వాత బాబును బేగం పేట స్కూల్లో చేర్పించాం. నేను మళ్లీ జాబ్లో చేరి సర్విస్ కాడెట్గా గైనకాలజీలో పీజీ పూర్తి చేసి ప్రస్తుతం గైనకాలజిస్టుగా చేస్తున్న.
ఉచితంగా ట్రైనింగ్ స్కూల్
మావారు ఆర్మీలో ఉన్నప్పుడే ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళం. ఇక బాబు పుట్టిన తర్వాత ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అర్థం చేసుకున్నా. మేమంటే డబ్బు ఉంది కాబట్టి పెద్ద హాస్పిటల్లో చేర్పించి ట్రైనింగ్ ఇప్పించాం. కానీ పేద వాళ్ళ పరిస్థితి ఏంటి.. ఆ పిల్లల భవిష్యత్ ఏమిటి? ఆ పిల్లల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో బ్లయిండ్ స్కూల్ పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం. కొంత డబ్బు డొనేషన్గా ఇస్తే సరిపోతుందని నేను అనుకునేదాన్ని. కానీ మావారు మనమే స్వయంగా పిల్లల కోసం ఏమైనా చేద్దామన్నానరు. ఆలోచిస్తే ఓ ఆలోచన వచ్చింది. వనస్థలిపురంలో ఉన్న మా స్థలంలో బిల్డింగ్ కట్టించి 2017లో ఓ స్కూలు ఏర్పాటు చేశాం. దానికి మా బాబు 'సుమంత్ ట్రైనింగ్ సెంటర్' అని మా బాబు పేరే పెట్టాం. సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓ టీచర్ని ఏర్పాటు చేశాం. అవసరమైన పరికరాలు కూడా ఉన్నాయి. మరీ పేద వాళ్ళయితే రానుబోను చార్జీలు కూడా మేమే ఇస్తాం. వారికి భోజనం, ఉండటానికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. అలాగే తల్లిదండ్రులకు ధైర్యం చెబుతాం. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాతోపాటు సుమంత్ కూడా వచ్చేవాడు. మేం ట్రైనింగ్ ఇస్తుంటే నేను కూడా ఇస్తా అనేవాడు. ప్రస్తుతం తను కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ స్కూలు మొత్తం తనే చూసుకుంటున్నాడు.
అందరూ సపోర్ట్ చేశారు
ఒకప్పుడు మాటలు కూడా సరిగా రాని సుమంత్ మాట్లాడుతూ ''మా అమ్మానాన్నలు, స్కూల్లో టీచర్లు, ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ హెల్ప్తో నేను అన్నీ నేర్చుకున్నాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. పదో తరగతి వరకు నార్మల్ సూల్లోనే చదువుకున్నాను. తర్వాత రాయల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చేశాను. నిజాం కాలేజీలో బీఏ సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్టులు తీసుకుని డిగ్రీ పూర్తి చేశాను. మా ట్రైనింగ్ సెంటర్లో నేను ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను'' అంటూ గర్వంగా చెబుతున్నాడు.
సేవకే అంకితం
బాబు చిన్నతనంలో మేం చాలా బాధపడ్డాం. మేము అనుభవించిన కష్టం మరే తల్లిదండ్రులకు ఉండకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈ స్కూలు పెట్టాం. 'సుమన్ ట్రైనింగ్ సెంటర్' కు బ్లయిండ్, డెఫ్ అండ్ డెమ్, మెంటల్లీ డిజార్డర్ పిల్లలు వస్తున్నారు. ప్రస్తుతం 14 మంది పిల్లలు ఉన్నారు. సుమంత్కు ఓ తమ్ముడు ఉన్నాడు. ప్రస్తుతం డెంటల్లో పీజీ చేస్తున్నాడు. ఇంకా నా సర్వీస్ నాలుగేండ్లు ఉంది. రిటైర్ అయిన తర్వాత పిల్లలు, వృద్ధులకు సేవ చేయడానికే నా సమయం మొత్తం కేటాయించాలనుకుంటున్నా. ఈ విషయంలో మావారు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. మా సుమంత్ ట్రైనింగ్ సెంటర్ సేవలు పొందాలనుకునే వారు సంప్రదించవలసిన నెంబర్
:8096817081.
- సలీమ