Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ సెక్టార్లో పనిచేయడం ఒక ఛాలెంజ్. ఉద్యోగంలోనే ఎప్పుడో ఒకప్పుడు విసుగొస్తుంది. అలాంటిది సామాజిక సేవలో కొనసాగడానికి ఎంతో కరేజ్ కావాలి. కమిట్మెంట్ ఉండాలి. సమయాన్ని వెచ్చించాలి. సొంత పనులకే సమయం లేని రోజుల్లో ఇంకొకరి కోసం సమయం వెచ్చించడం... కచ్చితంగా గొప్పతనమే. ఇవన్నీ ఉన్న వ్యక్తి జయశ్రీ తేలుకుంట్ల. సోషల్ వర్కర్ మాత్రమే కాదు.. ఫిలాంత్రపిస్ట్, లింగ్విస్ట్, రేడియోజాకీ. గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ ప్రవాసాంధ్రులను పలకరించే ఆత్మీయురాలు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ జయశ్రీ స్వస్థలం. తండ్రి వ్యవసాయ మార్కెట్లో సెక్రటరీగా పనిచేసేవారు. చాలా నిజాయితీ పరుడు. దానికి ఫలితంగా ఎన్నో బదిలీలు. దాంతో... ఆమె బాల్యం గద్వాల్, జోగిపేట, భద్రాచలం బూర్గంపాడులో సాగింది. పిల్లలందరూ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుంటే... ఆమె మాత్రం ఆ మార్కెట్ యార్డ్లో ఆడుకునేది. ఓసారి మార్కెట్లో పల్లీలను తన్నుకుంటూ తిరుగుతుంటే తండ్రి చూశాడు. 'నువ్వంత నిర్లక్ష్యంతో వాటిని తన్నుతున్నావు... కానీ అవి ఓ రైతు ఆరుగాలం చేసిన కష్టం ఫలితం' అని కూర్చోబెట్టి చెప్పారు. రైతు విలువ అలా తెలిసొచ్చింది. వ్యవసాయ మార్కెట్కు వచ్చిన రైతులు ఒక్కోసారి రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చేది. కొందరు సద్ది తెచ్చుకునేవాళ్లు. ఇంకొందరు అక్కడే వండుకునేవాళ్లు. వాళ్లకు కూరలు, పచ్చళ్లు పెట్టివ్వడం చేసేది జయశ్రీ తల్లి. ఆమె ఎప్పుడూ నేత చీరలే కొనేది. 'ఎందుకమ్మా అన్నీ ఒక్కతీరు చీరలే కట్టుకుంటావ్' అని జయశ్రీ అడిగితే... 'మనం చీర కొనడం వల్ల వాళ్ల కుటుంబం బతుకుతుంది' అని చెప్పేది. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా జయశ్రీకి బాధయ్యేది. ఎందుకంటే కొత్తస్కూల్, కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం. కష్టంగా ఉండేది. అప్పుడు చెప్పాడు తండ్రి... 'నువ్వే వెళ్లి పలకరిస్తే... మాటలు పెంచుకుంటే వాళ్లు నీ ఫ్రెండ్స్ అవుతారు కదా!' అని. ఇలా తల్లిదండ్రుల మాటలన్నీ ఆమెపై మంత్రంలా పనిచేశాయి.
జీవితం అంటే తెలిసింది...
ఇంటర్ తరువాత మళ్లీ మిర్యాలగూడ వచ్చేసింది కుటుంబం. డిగ్రీ పూర్తవ్వడంతోనే ఆమె పెండ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఆమెకేమో చదువుకోవాలని ఉంది. అందుకే బీఎడ్ రాసింది. ఎమ్మే పొలిటికల్ సైన్స్లో సీట్ వచ్చింది. లా కాలేజీలో సైతం సీటు సాధించింది. తండ్రి రిటైర్మెంట్ కూడా దగ్గరలో ఉండటంతో పెండ్లి తరువాత చదువుకోవచ్చని పెండ్లి చేశారు. తరువాత దూరవిద్యలో ఎమ్మే పూర్తి చేసింది. అత్తగారి ఊరు చండూరు దగ్గర చామలపల్లి. వ్యవసాయ కుటుంబం. ఆ ఊరిలో ఇంజనీరింగ్ చదివిన మొట్టమొదటి వ్యక్తి తేలుకుంట్ల నర్సింహ. అమెరికా వెళ్లాలని ఆయన కల. అనుకున్నట్టుగానే పెండ్లి తరువాత అమెరికా వెళ్లారాయన. చాలా కష్టాల తరువాత జయశ్రీని కూడా తీసుకెళ్లారాయన. 'అమెరికా వచ్చాక జీవితం అంటే తెలిసింది. ఇక్కడ అన్నీ నేర్చుకుంటాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఎవ్వరి మీదా ఆధారపడాల్సిన లేకుండా' అంటారామె.
రేడియో జాకీగా...
ఇండియాలో ఉన్నప్పుడే బాబు... రెండోసారి పాప పుట్టారు. డాక్టర్లు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆమె మూడేండ్లపాటు పెరుగు, అరటిపండు తినాల్సిన పరిస్థితి. అనారోగ్యం మనిషిని చాలా కుంగదీస్తుంది. మానసికంగా దెబ్బతీస్తుంది. దాంతో ఆమెకు ఎక్కడికి వెళ్లాలని ఉండకపోయేది. కూర్చోవడానికే ఇబ్బంది. నాలుగు గోడల మధ్య... ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? ఒక్కోసారి డిప్రెషన్ వచ్చేది. ఇంత చదువుకుని, అమెరికాకు వచ్చి ఇలా ఇబ్బందిపడుతూ ఉండటమేమిటి అని ఆలోచించింది. అప్పుడే రేడియో అదుర్స్ గురించి తెలిసింది. అందరిలో కలుపుగోలుగా ఉండే వ్యక్తి కావడంతో రేడియో జాకీగా చేస్తే బాగుంటుందని ఆలోచించింది. అలా ఇంట్లో నుంచే ఇంటర్వ్యూలు, లైవ్ షోస్ చేసింది. తిరిగి తన జీవితాన్ని తాను దక్కించుకుంది. కొంతకాలానికి రేడియో అదుర్స్ వాళ్లు హాలీవుడ్లోకి వెళ్లిపోయారు. ఆమెకు తెలుగువన్డాట్కామ్ రేడియో టోరీలో అవకాశం వచ్చింది. ఇప్పుడు టోరీ రేడియోజాకీగా ప్రవాసాంధ్రులకు చిరపరిచితురాలు. వాళ్ల కుటుంబంలో ఓ సభ్యురాలు. ఎన్నో అంశాలపట్ల విస్తృతమైన చర్చలకు వేదికగా మలచింది. వర్తమాన సామాజిక- ఆర్ధిక-రాజకీయ-సాహిత్య-సంస్కృతిక-చట్ట-న్యాయ పరమైన ఎన్నో విషయాల గురించి రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
సాంస్కృతిక వారధిగా...
చిన్నప్పటినుండే మాతృ భాష మీద, భారతీయ సంస్కృతి మీద ఇష్టం ఉంది. దాంతో 2008 నుంచి సిలికానాంధ్ర వాళ్ల మనబడిలో చేరి పిల్లలకు తెలుగు భాష నేర్పించడమే కాదు. సంస్కృతిని పరిచయం చేసే పని పెట్టుకున్నారామె. ఎన్నో కథలు, నాటికలు నేర్పించడం మొదలుపెట్టింది. ప్రవాసాంధ్రుల పండుగలు ుఔAజు, వీనAుA, చీAుA, చీAుజ, ుAచీA వంటి ఎన్నో వేదికలపై ఎన్నో సత్కారాలు, బహుమతులు సొంతం చేసుకుంది. అంతరించిపోతున్న బుర్రకథ, సోది, కోలాటం వంటి మన పూర్వీకుల జానపద కళారూపాలను అక్కడి మన తరానికి నేర్పించడానికి కంకణం కట్టుకుంది. కేవలం అక్కడి పనులకే పరిమితమైపోలేదు. తిరిగి పుట్టిన గడ్డకు ఎంతో కొంత ఇవ్వాలన్న స్వభావం ఆమెది.
మరణాలను చూసి...
2010లో జయశ్రీ తల్లి జీర్ణకోశ సంబంధిత క్యాన్సర్తో చనిపోయారు. ఆ తరువాత రెండేండ్లకే క్యాన్సర్తోనే తండ్రి మరణించారు. తన తల్లిదండ్రులిద్దరి మరణానికి కారణమైన క్యాన్సర్ను తుడిచిపెట్టాలనుకుంది. తల్లిదండ్రులు పడ్డ మానసిక భాధ, మరొకరు పడకూడదని భావించి క్యాన్సర్ బాధితులకు సేవ మొదలుపెట్టింది. వైపవుట్ ది క్యాన్సర్ పేరుతో పనిచేస్తున్న 'ఆంకోటెలిజెంట్ 'ఆర్గనైజేషన్కి వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆమె. భారతదేశానికి కన్వీనర్ కూడా. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించి క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. తల్లిదండ్రులు, తన భర్త, తాను పుట్టిన నేల నల్లగొండ మీద మొదట దృష్టిని సారించింది. ఆగస్టులో నూజివీడులో క్యాంపు చేయబోతున్నది. యశోదా హాస్పిటల్తో కలిసి పనిచేస్తున్నది. నేసిన బట్టనే ఉరితాడుగా మార్చుకుంటున్న ఎన్నో చేనేత కార్మిక కుటుంబాలకు కొత్త ఆశను, నూతన బతుకును అందించడానికి సంకల్పించిన జయశ్రీ 'సంకల్పం' పేర ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ మానసపుత్రిక 'జైకిసాన్'లో పనిచేస్తూ తెలంగాణలోని రైతులకు సైతం సహాయ సహకారాలందిస్తోంది. గతేడాది హైదరాబాద్లో జరిగిన 'గ్లోబల్ అంత్రపెన్యూర్ సమ్మిట్'లో అమెరికా తరపున సొంతగడ్డకే అతిథిలా వచ్చింది. అమెరికాకు వచ్చిన కొత్తలో ఆమెకుటుంబం ఎన్నో కష్టాలు పడింది. ఇప్పడు కొత్తగా అమెరికా వచ్చిన తెలుగువారు ఆ కష్టాలు పడకూడదని... ఏడెనిమిదేండ్లుగా సాయమందిస్తోంది. అందుకోసం ఇటీవలే డిజిక్స్ఫామ్ అనే ఓ సంస్థను ప్రారంభించింది. బిట్కేర్, స్నాప్ఎక్స్ప్లాట్ఫార్మ్ అనే సంస్థలకు అడ్వైజర్గా పనిచేస్తున్నది.
జీవితం చిన్నది...
మా అమ్మ ఒకటే చెప్పేది.. 'జీవితం చిన్నది. కోపాలు, ద్వేషాలు పెట్టుకుని దుర్భరం చేసుకోవడం ఎందుకు? ఎవ్వరితో గొడవపడకు. వీలయితే సాయం చేయి. లేకపోతే లేదు' అని. ఆ మాటలే పాటిస్తాను. ఎక్కడో చండూరు దగ్గర మారుమూల పల్లెనుంచి వచ్చిన మావారు నర్సింహ ఇప్పుడు వాల్స్ట్రీట్లో పనిచేస్తున్నారు. ఐటీ సర్వ్ నార్త్ ఈస్ట్ చాప్టర్ ఫౌండర్ ప్రెసిడింట్గా ఉన్నారు. నేను ఉద్యోగం చేయలేకపోయానే అనుకున్నా... అంతకుమించి సంతృప్తినిచ్చే అనేక పనుల్లో బిజీగా ఉన్నా. నాకోసం, నా కుటుంబం కోసమే కాకుండా నలుగరికి ఉపయోగపడినా.. చాలు జీవితానికి.
చిన్నపనులే... అధిక ఆనందం...
ఓసారి ఇరానో, ఇరాకో గుర్తుకు లేదు. ఓ అబ్బాయి ఫోన్ చేశాడు. 'మాకు సహాయం చేయాలని ఉంటుంది. కానీ మా జీతం మాకే సరిపోదు. సేవ ఎలా చేయాలి?' అన్నాడు. 'ఏదైనా చేయాలనుకుంటే డబ్బే అక్కరలేదు... టైమ్, టాలెంట్, ట్రెజర్ ఇందులో ఏదో ఒకదానితో ఇతరులకు తోడ్పడొచ్చు. మీరు పనిచేసే హౌటల్లో బాటిల్స్ మూతలు పడేస్తారు. అవి సేకరించి ఇస్తే... రెడ్క్రాస్ వాళ్లు వీల్ఛైర్ ఇస్తారు. వాటిని అవసరం ఉన్నవాళ్లకు అందించొచ్చు' అని చెప్పాను. నేను చెప్పి మర్చిపోయాను. ఆ అబ్బాయి చేసి చూపించాడు. ఎన్ని కలెక్ట్ చేశాడో... ఐదు వీల్ ఛైర్స్ అవసరం ఉన్నవాళ్లకు అందించాడు. మన మాటలు ఇంకొకరికి సహాయకారిగా ఉపయోగపడుతున్నాయంటే అంతకుమించి ఏం కావాలి. ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక పాపను, బాబును అడాప్ట్ మేం చేసుకున్నాం. ఆ విషయం రేడియలో చెప్పిన తరువాత ఆ సంస్థనుంచి చాలామంది ప్రవాసాంధ్రులు పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. మేం మొదట తీసుకున్న బాబు చదువు అయిపోయి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇంకో బాబును అడాప్ట్ చేసుకున్నాం. ఆ బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇవి చిన్నపనులే కావచ్చు. కానీ అధిక ఆనందాన్నిస్తాయి.
- కట్ట కవిత