Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు కీర్తి, గుర్తింపుకోసం రాస్తారు. ఇంకొందరు అవార్డులకోసం పనిచేస్తారు. ఇవేవీ కాకుండా నమ్మిన సిద్ధాంతాలకోసం నిబద్ధతతో రాసే మనుషులు అరుదుగా ఉంటారు. ఆ రాసిన వాటిని ఆచరణలో ఉంచేవారు ఇంకా తక్కువ. అలాంటివారిలో ఒకరు ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి. ఆమెది బాధిత వేదన మాత్రమే కాదు.. నిరసన గళం. ధిక్కార స్వరం. దళిత ఆత్మగౌరవ ఎజెండా. ప్రశంసలను, విమర్శలను పట్టించుకోకుండా కవిత్వాన్ని బాధ్యతగా కొనసాగిస్తున్న కవయిత్రి. దళిత కవిత్వానికి దళిత స్త్రీ దృక్కోణాన్ని అందించిన తొలి కవయిత్రి. నాగార్జున యూనివర్సిటీలో ప్రస్తుతం యంగెస్ట్ ప్రొఫెసర్.
దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మ మరియమ్మ. నాన్న మంత్రయ్య. అమ్మమ్మ కుటుంబం అప్పటికే క్రిస్టియానిటీలో ఉంది. వాళ్లమ్మ ఏకైక కూతురు కావడంతో ఏడో తరగతివరకు చదువుకుంది. కానీ వాళ్ల నాన్న చదువుకోలేదు. పుస్తకాలు అధ్యయనం చేశారు. ఏ ఉద్యమాల్లో లేకపోయినా... ఆత్మగౌరవం మెండు. అలాంటి దళిత కుటుంబంలో పుట్టింది స్వరూపరాణి. కూతుళ్లు మహరాణుల్లా బతకాలన్నది తండ్రి అభిమతం. అందుకే పేర్లూ అలాగే పెట్టారు. 'అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. సొంతగా ఆలోచించాలి' అని అరాటపడ్డారు. ఆయన ప్రభావం చాలా ఉంది ఆమెపై. కాలక్షేపానికే సాహిత్యం చదవడం మొదలుపెట్టినా.. కాలేజీ రోజుల్లో సామాజిక స్పృహ ఉన్న స్నేహితులు, విద్యార్థి ఉద్యమాల పరిచయం ఆమెకు సీరియస్ సాహిత్యం మీద ఆసక్తిని పెంచింది. మొదట్లో అందరిలాగే అనుభూతి కవిత్వం రాయడం మొదలుపెట్టింది. నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆర్కియాలజీలో ఎమ్మే చేసింది. గోల్డ్మెడల్ సాధించింది.
కారంచేడు, చుండూరు ఘటనలు ఆమె ఆలోచనలను షిఫ్ట్ చేశాయి. అంబేద్కర్ గురించి తెలుసుకోవడం, చదవడం ప్రారంభమైంది. అయితే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశం ఆమె జీవితంలో మేలి మలుపు. అక్కడే ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఆ సమయంలోనే అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఏఎస్ఏ వ్యవస్థాపక సభ్యుల్లో ఆమె ఒకరు. ఆ రోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒక చర్చ, సెమినార్స్ జరిగేవి. ఎడతెగని సాహిత్య చర్చలు. అందులో భాగంగా వచ్చిందే 'గుండె డప్పు' సంపుటి. అందులో ప్రచురితమైన ఆమె కవితకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. 'పదునెక్కిన పాట' సంపుటి తరువాత ఆమె ఎక్కువగా రాయడం మొదలుపెట్టింది. ఆ కవితల సంపుటే 'మంకెనపువ్వు' 2002లో ప్రచురితమైంది. అప్పటిదాకా దళిత మహిళలు రాస్తున్నా... దళిత స్పృహతో కవిత్వం సృజించిన మొదటి తెలుగు కవయిత్రి ఆమె. ఆ పుస్తకం యోగి వేమన యూనివర్సిటీలో సిలబస్లో చోటు సంపాదించుకుంది. అందులోని కొన్ని కవితలు ఆంగ్లంలోకి, హిందీలోకి అనువాదం అయ్యాయి. ఆ తరువాత ఆమె యాక్టివిజంలోకి వెళ్లారు. అనేక వ్యాసాలు రాశారు. 'అస్తిత్వగానం' పేరుతో వ్యాసాల సంపుటి తీసుకొచ్చారు. దేశాన్నే కాదు... యావత్ ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన ఘటన రోహిత్ వ్యవస్థీకృత హత్య. రాయకుండా ఉండలేనంతగా ఆమెను వెంటాడింది. అలా తిరిగి కవిత్వాన్ని రాయడం మొదలుపెట్టిందామె. ఆ కవితలన్నింటినీ కలిపి 'వేకువ పిట్ట'గా ఈ నెల 27వ తేదీన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న కొన్ని ముచ్చట్లు...
మీ ఉద్యోగ జీవితం గురించి చెప్పండి..?
పీహెచ్డీ అయిపోగానే తెలుగు యూనివర్సిటీ శ్రీశైలం క్యాంపస్లో 99లో మొదటి ఉద్యోగం. తొమ్మిదేండ్లపాటు అక్కడే పనిచేశాను. పూర్తిగా గిరిజన, ఆదివాసీలు, అడవి. అది నా మీద ఎంతో ప్రభావం చూపింది. ఆ సంస్కృతిమీద, గిరిజనుల మీద రీసర్చ్ చేశాను. అనేక వ్యాసాలు రాశారు. ఆ తరువాత నాగార్జున యూనివర్సిటీలో బుద్ధిస్ట్ స్టడీస్లో అసోసియేట్ ప్రొఫెసర్గా నియామకం. రెండూ నాకు ఇష్టమైన అంశాలు. అధ్యయనం చేయడానికి అవకాశం ఇచ్చినవి. అంబేద్కర్ బౌద్ధాన్ని తత్వశాస్త్రంగా చూడలేదు. సామాజికంగా భావించాడు. పీడితుల విముక్తి సిద్ధాంతంగా చూశాడు. అదే నాకు స్పూర్తి. అంబేద్కరైట్ పర్సెపెక్టివ్ వచ్చిన తరువాత నేను ఈ ఉద్యోగంలోకి రావడం నాకెంతో మేలు చేసింది.
ఫెమినిజం దళిత స్త్రీల విముక్తికి మేలు చేస్తుందనుకుంటున్నారా? దళిత స్త్రీల సాహిత్యం అంతగా రావడం లేదు ఎందుకని?
ఫెమినిజం మీద నాకు గౌరవం ఉంది. కాకపోతే భారతీయ స్త్రీలందరూ ఒకే రకంగా లేరు. ఇండియన్ ఫెమినిజం కులాన్ని, వర్గాన్ని గురించి మాట్లాడాలి. క్షేత్రస్థాయిలో గ్రామీణ, గిరిజన, ఆదివాసీ.. ఇలా అన్ని రకాల మహిళలందరి గురించి మాట్లాడాలి. ఇంటర్సెక్షనాలిటీ పేరుతో ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతోది. దళిత స్త్రీల విముక్తికి ఫెమినిజం యాజిటీజ్గా ఉపయోగపడదు. దేశంలో దళిత సమస్యల మీద మాట్లాడే మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చారు. ప్రజా ఉద్యమాలు చేశారు. దాని కొనసాగింపు అక్కడ ఉంది. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. దళిత స్త్రీల సాహిత్యం రావడానికి అంత ప్రోత్సాహం లేదు. మేం రాసిన మొదట్లో పత్రికల్లో వేసేవారు. మమ్మల్ని సెమినార్స్కు పిలిచినా గుర్తించేవారు కాదు. రాసినా పుస్తకం ఎలా వేసుకోవాలో తెలియదు. ఎవ్వరూ ఒక మంచి మాట రాయరు. అస్సలు ఎలాంటి ప్రోత్సాహం ఉండదు. స్త్రీలే కాదు... దళితుల్లో కూడా ఫోర్స్గా రాసే మద్దూరి నగేష్బాబు, పైడి తేరేష్బాబు, కలేకూరి ప్రసాద్.. లాంటివాళ్లు చనిపోయారు. సిద్ధాంతపరమైన అవగాహన ఇస్తూ రాయాలని ప్రోత్సహించే సత్యమూర్తిలాంటివాళ్లు లేరు. దానికితోడు కెరీరిజం కూడా వచ్చింది. అందరినీ ఒక శక్తిగా చేసే ఏ ఒక్క ఆర్గనైజేషన్ లేదు.
ఎస్సీ వర్గీకరణ సమస్య ఏండ్లుగా నానుతోంది. దానికి పరిష్కార మార్గమే లేదా?
వర్గీకరణను నేను సమర్ధిస్తాను. మాల అయి ఉండి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నానని అప్పట్లో కొందరు నన్ను టార్గెట్ చేశారు. అది ప్రజాస్వామిక డిమాండ్. అయితే ఆ పేరుతో వాళ్లు చేసేవన్నీ సమర్ధించను. మాల, మాదిగల మధ్య ఉండాల్సింది మిత్ర వైరుధ్యం. దీర్ఘకాలంలోకలిసి ఉండకపోతే కచ్చితంగా ముందు తరాలకు అన్యాయం చేసిన వారవుతారు. అయితే మానసికంగా ఇరువర్గాల మధ్య చాలా అంతరాయం వచ్చింది. దళితులకు రాజ్యాధికారం వంటి రాజకీయాంశం వచ్చినప్పుడు... శత్రువును ఎదుర్కోవాల్సివచ్చినప్పుడు అందరూ ఒక్కటవుతారని ఆశిస్తున్నాను. అయితే అది వ్యక్తులుగా సాధ్యం కాదు. కమ్యూనిటీగా రావాలి. అందుకు నడిపించే నాయకుడు కావాలి. రాజ్యాధికారం కోసమైనా కలవాలి. ఆంధ్రలో క్రిస్టియానిటీవల్ల మాలలు చదువుకున్నారు. మాలలు అణచివేయడం వల్ల మాదిగలు చదువుకోకపోవడం వంటిదేమీ లేదు. మాదిగలకు కులవృత్తి ఉంది. దాన్ని నమ్ముకుని బతకగలిగే స్థితి ఉంది. అందుకే క్రిస్టియన్ మిషనరీస్వైపు వాళ్లు ఆకర్షితులవ్వలేదు. పాలేరుతనంలో మగ్గిపోతున్న మాలలు... దానినుంచి విముక్తికోసం మిలటరీలోకి వెళ్లారు. కొందరు వలస వెళ్లారు. ఇంకొందరు క్రిస్టియానిటీ వైపు ఆకర్షితులయ్యారు. కులవృత్తి లేకపోవడం వల్ల ఏది అందివస్తే దానికోసం వెళ్లారు. ఎంప్లాయిస్ కాకపోయినా అసర్టివ్గానే ఉన్నారు. వలస వెళ్లినవాళ్లు బానిసత్వాన్ని వదిలించుకున్నారు. మిగిలినవాళ్లకు వలస... అన్నీ కోల్పోవడం. కానీ దళితులకు వలస... అసర్టివ్.
ఇంతకుముందు రాయడానికి, నడిపించడానికి ఓ శక్తి కావాలి అన్నారు. దానికోసం ఏమైనా కృషి చేస్తున్నారా?
ఏపీలో బహుజన రచయితల వేదిక (బరవే) క్రియాశీలకంగా ఉంది. 'రచనలకు ఒక లైన్ ఉండాలి. రాయడాన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి. అధ్యయనం చేయాలి. సిద్ధాంతపరమైన అవగాహన పెంచుకోవాలి. అంతిమంగా రాజ్యాధికారం వైపు వెళ్లాలి' అనేది బరవే కాన్సెప్ట్. అవి కాకుండా కొన్ని పత్రికల్లో రాస్తున్నాను. మిణుగురులు, భీమ్ భూమి అనే పత్రికలకు రాస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఉన్న దళిత మహిళల గురించి పరిచయం చేస్తున్నాను.
చదువుకైనా, యాక్టివిజంకైనా మీకు స్ఫూర్తి ఎవరు?
కచ్చితంగా మా నాన్ననే. ఏం చదువుతా అంటే అది చదివించాడు. ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్లనిచ్చాడు. మా అమ్మమ్మ కూడా చాలా అసర్టివ్గా ఉండేది. మా అమ్మ చదువుకుంది కానీ.. ఉద్యోగం తొందరగా రావాలని టైపో, కంప్యూటరో నేర్చుకొమ్మని చెబుతూ ఉండేది. బీఈడీ చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుందని చెప్పి అది చదవమనేది. కానీ నాన్న ' టైప్ చేసే ఉద్యోగం కాదు... చేయించే ఉద్యోగం చేయాలి' అనేవారు. అధికారం లేని స్థితినుంచి వచ్చాడు కాబట్టి పిల్లలైనా అధికారంలో ఉండాలని కోరుకునేవాడు. సిద్ధాంతాలు తెలియదు కానీ.. జీవితంనుంచి ఒక స్పృహ ఉండేది నాన్నకు. నేను పెద్దయ్యి రాయడం మొదలుపెట్టాక నాన్నను గమనించడం మొదలుపెట్టాను. అప్పుడర్థమయ్యింది నాన్నే నా హీరో.
ఇప్పుడు దళిత రచయితల మీద ఉన్న బాధ్యత ఏమిటి?
ఒకానొక సమయంలో ఆత్మగౌరవం అవసరమైన ఆయుధం. కానీ అది రీచ్ అయిన తరువాత 'నేను' అనే ఒక అసర్టివ్నెస్ రావాలి. దాంతో సృజనలో సింబల్స్ కూడా మారతాయి. ఇప్పటిదాకా బాధితులైన ఏకలవ్యుడు, మార్తమ్మ... వంటి ప్రతీకలతో రాశాం. కానీ కొత్త సింబల్స్ తీసుకురావాలి. అందుకే 'నేను ఏనుగును' అని ఒక పోయెమ్ రాశాను. 'నేను చుక్కల భాష తప్ప కుక్కల మొరుగుడు అస్సలు ఆలకించను' అని రాశాను. 'ఒక రాజకీయ ప్రకటన'లో బుద్ధిస్ట్ సింబల్స్ కూడా వాడాను. సాహిత్యంలో ఈ మార్పు రావాలి. అయితే సాహిత్యం ఊరికెనే రాదు. ఉద్యమం నుంచి వస్తుంది. దళిత రచయితలు బ్రాహ్మణవాద హిందూ ఫాసిస్టు ధోరణిని ఢకొీనాలి. కలిసి వస్తున్న శక్తులు, సమూహాలను కలుపుకోవాలి. కలుపుకోకుండా ఎన్ని రాసినా ఫలితం ఉండదు. మన దేశంలో ఎక్కువ అభద్రతతో ఉన్నది ముస్లింలు. ముస్లిం, బీసీలను కలుపుకుపోవాలి. పెద్ద శక్తిగా ఎదగాలి. అప్పుడే ఉమ్మడి శత్రువు మీద పోరాటం మొదలవుతుంది. దానినుంచే సాహిత్యం పుడుతుంది. సాహిత్యంనుంచి యాక్టివిజం కూడా పెరుగుతుంది.
కట్ట కవిత