Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టుదల ఉంటే అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించిందామె. పేద కుటుంబంలో పుట్టినా... మురికి వాడల్లో పెరిగినా... అంగవైకల్యం ఆమెను ఇబ్బంది పెడుతున్నా... చదువుకోవాలన్న లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఆమే ఉమల్ ఖేర్. ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. చివరకు అనుకున్నది సాధించిన ఆమె గురించి...
ఉమల్ రాజస్థాన్లోని నిరుపేద కుటుంబంలో పుట్టింది. చిన్నతనంలోనే ఎముకలకు సంబంధించిన వ్యాధికి గురైంది. ఆమె ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఉమల్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు. మురికివాడల్లో ఉంటూ.. వీధుల్లో బట్టలు అమ్ముకుంటూ ఆమె కుటుంబం జీవనం సాగించేది. అయితే ఉమల్కు ఉన్నత చదువులు చదవాలని కోరిక. అంగవైకల్యం బాధిస్తున్నా తన మనసుకోవాలనే కోరికను ఇంట్లో చెప్పింది. కానీ ఒప్పుకోలేదు. అయితే స్కాలర్షిప్లు, ఛారిటీల సాయంతో ఢిల్లీలోనే ఎనిమిదో తరగతి పూర్తి చేసింది.
ఆడపిల్లకు చదువెందుకన్నారు
అప్పుడే అనుకోని కష్టం ఎదురైంది. సెకండరీ స్కూల్లో చేరుతానని ఉమల్ చెబితే ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఇక చదివించేది లేదని తేల్చిచెప్పారు. ఎదురు తిరిగితే తిట్టారు, కొట్టారు. ఆడపిల్లకు చదువెందుకని ఈసడించారు. చదువుకోవాలనేదే తన తుది నిర్ణయమైతే కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. ఆ సమయంలో ఉమల్ తీసుకున్న కఠినమైన నిర్ణయమే.. ఇప్పుడామెకు అరుదైన విజయాన్ని అందించింది.
ఒంటరిగా ఉంటూ...
నిండా పదిహేనేండ్లు కూడా లేని వయసులో ఇంటి నుంచి బయటకొచ్చింది ఉమల్. మురికివాడల్లోని ఓ గుడిసెను అద్దెకు తీసుకుని మళ్లీ చదువుకోవడం మొదలుపెట్టింది. ఈ పురుషాధిక్య సమాజంలో ఓ ఆడపిల్ల ఒంటరిగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. ముఖ్యంగా డబ్బు కావాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం మరువలేదు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం కోసం ట్యూషన్లు చెప్పేది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూనే తన చదువును సాగించింది. ఒక్కో విద్యార్థి నుంచి 50 నుంచి 100 రూపాయలు మాత్రమే తీసుకునేది. దీనికి కారణం తన దగ్గరకు ట్యూషన్లు చెప్పించుకోవడానికి వచ్చే పిల్లలందరూ కార్మిక కుటుంబాలకు చెందినవారే. ఆమెకు వచ్చే ఆ కాస్త ఆదాయం ఏ మూలకూ సరిపోయేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో 9,10 తరగతులు పూర్తి చేసింది. తర్వాత కాలేజీలో చేరి 12వ తరగతిలో 91శాతం మార్కులు సాధించింది.
దుర్భర పరిస్థితుల్లోనూ...
ఆ తర్వాత ఢిల్లీ యూనివర్శిటీలో సీటు సాధించింది. కళాశాలలో జరిగే కార్యక్రమాలు, ట్యూషన్ల ద్వారా డబ్బు సంపాదిస్తూ డిగ్రీ పూర్తిచేసింది. ఈ సమయంలోనే ఉమల్ తల్లిదండ్రులు ఢిల్లీ వదిలి రాజస్థాన్కి వెళ్లిపోయి చిన్న గాజుల దుకాణం పెట్టుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఓ ఘటన ఆమె జీవితాన్ని ఓ కుదిపి కుదిపేసింది. 2012లో ఉమల్ ప్రమాదానికి గురైంది. ఏడాది కాలం పాటు చక్రాల కుర్చీకే పరిమితమైంది. మరోవైపు ఎముకల వ్యాధి కారణంగా 16 ఫ్యాక్చర్లు 8 సర్జరీలు అయ్యాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ ఆమె ఢిల్లీలోని జేఎన్యూ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించింది.ఇంటర్నేషనల్ స్టడీస్(ఎమ్మే)లో సీటు సాధించి నెలకు 2000 వేల రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ అందుకున్నది. 2013లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించి నెలకు 25 వేల రూపాయలు పొందింది. ఆర్థిక వెసులుబాటుతో ట్యూషన్లు మానేసి తన దృష్టి మొత్తం చదువుపై పెట్టింది.
సివిల్ సర్వీస్ అంటే తెలియదు
స్కాలర్షిప్ సాయంతో చదువుకుని 2017లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్ష రాసింది. తొలి ప్రయత్నంలోనే 420వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆమెకు తన తల్లిదండ్రుల మీద ఎలాంటి కోపం లేదనే చెబుతోంది ఉమల్. 'వారున్న కుటుంబ పరిస్థితులు అలాంటివి. నేను వారికి ఇంకా ఫోన్ చేయలేదు. ఎందుకంటే వారికి కనీసం సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటే ఏంటో కూడా తెలియదు. త్వరలోనే వాళ్లని కలుస్తాను' అని చెబుతోంది. వికలాంగుల కోటాలో తనకు తప్పకుండా ఐఏఎస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఉమల్.