Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్త రుచిగా, కాస్త టేస్టీగా ఉండే జిలేబి, జాంగ్రీ, రసగుల్లా, బాదుషాను ఇష్టపడని వారుండరు. కాకపోతే వీటి తయారీకి సమయం ఎక్కువ తీసుకుంటుందని బయటే కొనేస్తుంటారు చాలామంది. అదేం కాదు ఇంట్లోనే తక్కువ సమయంలో రుచికరమైన జాంగ్రీలను తయారు చేసుకోవొచ్చు. సాయంత్రం పూట స్నాక్స్గా, సండే స్పెషల్ గా చిన్నారులకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. అలాంటి నోరూరించే తీపి పదార్థాలు మీ కోసం... ఓ సారి ప్రయత్నించి చూడండి!
జిలేబీ...
కావాల్సిన పదార్థాలు: మైదా పిండి-ఒక కప్పు, పెరుగు-సగం కప్పు, ఉప్పు-చిటికెడు, పంచదార-రెండు కప్పులు, ఫుడ్ కలర్-చిటికెడు, నూనె-వేయించడానికి సరిపడా, వంట సోడా-చిటికెడు.
తయారీ విధానం: ఒక పాత్రలో ముందుగా మైదా పిండిని తీసుకోవాలి.ఇలా తీసుకున్న మైదా పిండిలో పుల్లగా ఉన్న పెరుగు, ఉప్పు, వంటసోడా, ఫుడ్ కలర్, కొద్దిగా నీళ్లుపోసుకొని వేసి బాగా కలుపుకోవాలి. ఈ కాస్త పులిస్తే జిలేబీలు రుచిగా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ మీద మరోపాత్ర పెట్టి దాంట్లో చక్కెర పాకం పెట్టుకోవాలి. చివరగా స్టవ్ మీద మరోపాత్ర పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె వేడి కాగానే జిలేబీలు దోరగా వేయించుకొని పాకంలో ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది. అయితే జిలేబీలు గుండ్రంగా రావాలంటే పాల పాకెట్లో మైదా పిండిని వేసి జిలేబీలను వేసుకుంటే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
బాదుషా...
కావాల్సిన పదార్థాలు: మైదా పిండి-ఒక కప్పు, పెరుగు-సగం కప్పు, చక్కెర-ఒక కప్పు, ఉప్పు-చిటికెడు, వంటసోడా-చిటికెడు, యాలకుల పొడి-ఒక చెంచా, నెయ్యి-ఒక చెంచా, నూనె-వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, పుల్లటి పెరుగు, కొద్దిగా ఉప్పు, వంటసోడా, కరిగించిన నెయ్యి, నీళ్లు పోసుకొని పిండి గట్టిగా వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాత్రలో చక్కెర పాకం పెట్టుకోవాలి. చక్కెర పాకంలోనే యాలకుల పొడి వేసుకోవాలి. అయితే ముందుగా కలుపుకొన్న పిండిని గుండ్రంగా చుట్టూకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద మరో పాత్ర పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనెలో దోరగా వేయించుకొని చక్కెర పాకంలో వేసుకుంటే సరిపోతుంది.
రసగుల్లా...
కావాల్సిన పదార్థాలు: బియ్యం-ఒక కప్పు, మినపప్పు-సగం కప్పు, చక్కెర-ఒక కప్పు, రెడ్ ఫుడ్ కలర్-చిటికెడు, వంటసోడా-చిటికెడు, నూనె-వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: బియ్యం, మినపప్పును రెండు గంటల ముందు నానపెట్టుకోవాలి. బియ్యం బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా, ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద చక్కెర పాకం పెట్టుకోవాలి. చివరగా స్టవ్ మీద మరో పాత్ర తీసుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే గ్రైండ్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక చక్కెర పాకంలో కలుపుకుంటే సరిపోతుంది.
జాంగ్రీ...
కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, యాలకుల పొడి-ఒక చెంచా, ఫుడ్ కలర్-చిటికెడు, నూనె-వేయించడానికి సరిపడా, ఉప్పు-చిటికెడు.
తయారీ విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పు దాంట్లో కొద్దిగా, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జిలేబి, జాంగ్రీ కొద్దిగా తేడా ఉంటుంది. జిలేబీలకు మైదాపిండిని వాడితే, జాంగ్రీలకు మినపగుళ్లను వాడతారు. తర్వాత చక్కెర పాకం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా యాలకుల పొడి కలుపుకోవాలి. చివరగా స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే దాంట్లో జాంగ్రీలను వేయించుకొని చక్కెర పాకంలో కలుపుకుంటే సరిపోతుంది. అయితే జాంగ్రీలను వేసుకునే ముందు మందంగా ఉండే కాటన్ క్లాత్ను తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకొని జాంగ్రీలను గుండ్రంగా, పెద్దగా వేసుకుంటే సరిపోతుంది.