Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఒకప్పుడో... వంటిల్లుకే పరిమితమయ్యారు. తరువాత నెమ్మదిగా ఇంటికి విస్తరించారు. ఇల్లు, పిల్లలు తప్ప మరో ప్రపంచం తెలియకుండా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటికి పెద్ద దిక్కు అయిన పురుషుడు మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి అగమ్య గోచరం. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ ఎదుర్కొని నిలబడ్డారామె. భర్త క్యాన్సర్తో మరణిస్తే... కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్గా మారారు. ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ నిర్వహిస్తున్నారు.
కర్ణాటకలోకి హసన్ జిల్లాకు చెందిన రాధిక సురేష్ను పెండ్లి చేసుకుని మంగళూరులో స్థిరపడింది. మొదట సురేష్ అంబులెన్స్ నడిపేవాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులే కుటుంబానికి ఆధారం. ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది. ఆ తరువాత కొంతకాలానికి సురేష్ కెఎస్ఆర్టీసీలో చేరాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అయితే మెరుగు పడింది కానీ... సురేష్ ఆరోగ్యం దెబ్బతిన్నది. సురేష్ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తేలింది. ఇంట్లో సంతోషం కరువైంది. 2002లో సురేష్ మరణించాడు. రాధిక జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అప్పుడు రాధిక వయసు 30 సంవత్సరాలు మాత్రమే. భూమిక, భార్గవి ఇద్దరు ఆడపిల్లలు. ఏదైనా ఉద్యోగం చేయాలంటే అందుకు తగ్గ చదువులేదు. రాధిక ఆరో తరగతి మాత్రమే చదువుకుంది. అప్పటిదాకా బయటికి వెళ్లింది లేదు. పిల్లలను ఎలా పెంచాలి? ఎలా చదివించాలి? కొన్నాళ్లపాటు ఇల్లు కదలలేకపోయింది. కానీ తన పరిస్థితి ఇలా ఉంటే పిల్లలు ఏం కాను? అని ఆలోచించింది. అప్పటిదాకా భర్త అంబులెన్స్ నడిపేవాడు. పెళ్లయ్యాక, పిల్లలుకాకముందు సరదాగా ఆమెకు డ్రైవింగ్ నేర్పించాడు. కానీ డ్రైవర్గా మారాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. భర్త మరణం తరువాత... కుటుంబాన్ని పోషించడానికి భర్త మార్గాన్ని ఎంచుకుంది. అంబులెన్స్ డ్రైవర్గా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. డ్రైవింగ్ బాగా ప్రాక్టీస్ చేసి లైసెన్స్ పొందింది. ఆమెకు ఆక్సిజన్ సిలెండర్ను ఆపరేట్ చేయడం, ప్రథమ చికిత్స వంటివి తెలుసు. ఇవి రెండు అంబులెన్స్ డ్రైవర్గా ఆమెకు కలిసొచ్చాయి. అయితే పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు నైట్ ఎమర్జెన్సీ వస్తే వారిని తన తల్లిదగ్గర వదిలేది. రాత్రి, పగలు ఎప్పుడైనా కాల్ వస్తే వెళ్లడానికి అస్సలు వెనుకాడేది కాదు. ఏకబిగిన వెయ్యి కిలోమీటర్ల దూరం డ్రైవ్చేయగలిగే సామర్థ్యం ఆమె సొంతం. కర్ణాటక నుంచి కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్... ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకంజ వేయలేదు. కేవలం రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లడమే కాదు... మృతదేహాలను సైతం వాళ్ల సొంత రాష్ట్రాలకు తరలించడానికి కూడా వెళ్లేది.
నెమ్మదిగా కావేరి అంబులెన్స్ సర్వీసెస్ ఏర్పాటు చేసి మరో అంబులెన్స్ కొనుగోలు చేసింది. డ్రైవర్ను నియమించింది. నెమ్మదిగా సర్వీసెస్ ఊపందుకున్నాయి. దాంతో తన సేవలను విస్తరించింది. బ్యాంకు రుణం తీసుకుని మరికొన్ని అంబులెన్స్లు కొనుగోలు చేసింది. అదనంగా డ్రైవర్లను నియమించింది. ప్రస్తుతం ఆమె 12 అంబులెన్స్ సర్వీసులను నిర్వహిస్తున్నది. అవి కాకుండా ఇటీవలనే ఓ టూర్ బస్ను, వ్యాన్ను కూడా కొనుగోలు చేసింది. వాటిని కాంట్రాక్టుకు ఇచ్చింది. ఇప్పుడామెకు 43 ఏండ్లు. ఈ 13 ఏండ్ల సర్వీస్లో ఆమె కుటుంబం, పిల్లలు, స్నేహితులు ఎంతో సహకారం అందించారు. కూతురు భూమిక బెంగళూరులోని ఎమ్ఎస్ రామయ్య ఇనిస్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదువుతుండగా, మరో కూతురు భార్గవి కామర్స్లో డిగ్రీ చేస్తున్నది. రాధిక ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ మంగళూరు ప్రెస్క్లబ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇప్పుడు రాధిక తన కూతుళ్లకే కాదు... వాళ్లలాంటి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం.